Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యురేనియం తవ్వకాలపై ముఖ్యమంత్రి మూడ్రోజుల క్రితం నోరు విప్పారు. నల్లమలలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడా యురేనియం తవ్వకాలకు అనుమతీయబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఉభయసభల్లో ఏకవాక్య తీర్మానాన్ని ఆమోదించారు. ఈ సందర్భంగా సీఎం మరో అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రత్యేకరాష్ట్రం ఏర్పడ్డనాటి నుంచీ ఎవరికీ, ఏవిధమైన అనుమతులూ యివ్వలేదన్నారు. ఇక మీదట ఇవ్వబో మనీ తెలిపారు. ఆలస్యంగానైనా సీఎం స్పందించడం, ప్రభుత్వ వైఖరి చెప్పడం శుభపరిణామం. రాష్ట్రాన్ని చుట్టు ముట్టిన యురేనియం ముప్పుపై పోరు చేస్తున్న జనావళికి ఈ పరిణామాలు నైతికబలాన్నిస్తాయ నడంలో సందేహం లేదు. అదే సందర్భంలో ఇక అంతా రాష్ట్ర సర్కారే చూసుకుంటుందిలే.. అనే భ్రమలూ అక్కర్లేదని పర్యావరణ వేత్తలూ రాజకీయ విశ్లేషకులూ హెచ్చరిస్తున్నారు. అందుకని ఇప్పటికిప్పుడే ప్రభుత్వాన్ని అనుమానించలేం. కానీ ఆ వైపు సర్కారు నుంచి ఆచరణాత్మక అడుగులు అవసరం.
ఈ ప్రకటనలకు మూడ్రోజుల ముందూ తర్వాతా కేంద్రం తన పని తాను చేసుకుపోతూనే ఉన్నది. 'సేవ్ నల్లమల' పేరుతో బయటా, సోషల్మీడియా వేదికగానూ వ్యక్తమవుతున్న నిరసనలను ఖాతరు చేయడం లేదు. అందుకు రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు(అటవీ, పర్యావరణ, మైనింగ్) అవసరమైన సాయం చేస్తూనే ఉన్నాయి. సమస్య రాష్ట్రమంతా రగులుతున్న ఈ దశలో ముఖ్యమంత్రికి తెలియకుండా ఈ పని జరుగుతున్నదనుకోలేం. ఉభయ సభల్లో ఏకగ్రీవ తీర్మానం చేసిన రోజు కూడా యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) బృందం అధికారులు నాగర్కర్నూల్ సందర్శించారు. స్వయంగా యూసీఐఎల్ లోగోతో ఉన్న వాహనంలోనే ఢిల్లీ నుంచి అధికారులు ఇక్కడ కాలుమోపారు. అటకాయించి నిలదీసిన ఆందోళనకారులకు, ప్రశ్నించిన మీడియాకు మాత్రం మొక్కలు, తొక్కలకోసమొచ్చామని బుకాయించారు. ఆయుర్వేద మందుల తయారీకవసరమయ్యే మొక్కల పరిశీలన, పరిశోధనలు చేస్తున్నట్టు నమ్మబలికారు. ఆ మరుసటి రోజు కూడా ఈ ప్రాంతంలో కేంద్రానికి చెందిన ఓ హెలికాప్టర్ ఏరియల్ సర్వే చేసిందని స్థానికులు చెబుతున్నారు. వెయ్యిమీటర్ల లోతులో వేసిన బోర్ల నుంచి నీళ్లూ మట్టి నమూనాలు సేకరిస్తున్నారు. భూ సేకరణకు రహస్య సర్వేలు కొనసాగుతూనే ఉన్నాయి.
కేంద్రం నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని, ఏకపక్షంగా పోతున్నదని ఐదేండ్ల పాలనలో అర్థమైంది. రాజ్యాంగ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసింది. కార్పొరేట్ అనుకూల విధానాలను మరింత వేగంగా అమలు చేసింది. ఫలితంగానే దేశ ప్రజలు నేడు మాంద్యంలోకి నెట్టబడ్డారు. తాజాగా యురేనియం తవ్వకాలూ వారి ప్రయోజనాల కోసమేనని ప్రజలూ రాష్ట్ర ప్రభుత్వమూ గ్రహించాలి. భూమి లోపల ఉన్న ఈ అణుధార్మిక పదార్థం ఓసారి బయటకొస్తే సంభవించే ముప్పును ఎవ్వరూ ఆపలేరు. యురేనియం అనుభవాలను ప్రత్యక్షంగా చవిచూసిన ధనిక దేశాలు వాటి తవ్వకాల నుంచి క్రమంగా తప్పుకుంటున్నాయి. అగ్రరాజ్యం అమెరికా కూడా 1982 తర్వాత ఈ తవ్వకాలను దాదాపు నిలిపేసింది. తవ్వకాలకు వ్యతిరేకంగా ఆ దేశంలో పెద్దఎత్తున ఉద్యమాలూ సాగాయి. ఈ నేపథ్యంలో ధనిక దేశాలు యురేనియంతో నడుస్తున్న అణువిద్యుత్ కేంద్రాలను మూసేశాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దాని వినియోగం పెంచడం ద్వారా తమ అవసరాలు తీర్చుకోవాలని భావిస్తున్నారు. బహుళజాతి సంస్థలు, బడాకార్పొరేట్ల సేవలో తరిస్తున్న మన పాలకులు అందుకు జీ హుజూర్ అంటున్నారు. మన ప్రజలను బలిపశువులను చేసి మరీ దేశ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారు. ఇందులో మోడీ ముందున్నారు. ఆ విధానాల దుష్ఫలితాలు మనం అనుభవిస్తూనే ఉన్నాం. కేంద్రం నియంత పాలనకు బోలెడు సాక్ష్యాలు మన కండ్లముందే ఉన్నాయి. కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేసిన తీరు దేశ ప్రజలకు తెలుసు. ప్రజాభీష్టం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతూనే వేలాదిమంది సాయుధులతో ప్రజా తిరుగుబాట్లను అణిచింది. ప్రజాస్వామ్య దేశంలో సైనికపాలన సాగిస్తున్నది. ఈ ఉదంతాలు దేన్ని తెలియజేస్తున్నాయి?
రేపు నల్లమల కేంద్రంగా సాగుతున్న యురేనియం తవ్వకాల కోసమూ ఈ చర్యలకు పోదని అనుకోలేం. కాబట్టి ప్రజలూ ప్రభుత్వం అప్రమత్తం కావాలి. ఇన్నాళ్లూ బీజేపీతో ఏ బంధం కొనసాగినా ఈ విపత్కర స్థితిలో మాత్రం తమను గెలిపించిన ప్రజలు, రాష్ట్ర ప్రయోజనాలే ప్రాధాన్యం కావాలి. కేవలం ప్రకటనలతో కేంద్రం లొంగదు. ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన అన్ని అనుమతులూ రద్దు చేయాలి. వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. సమస్య కేవలం చెంచులదో, నల్లమలవాసులదో మాత్రమే కాదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 9కోట్ల మంది ప్రజల జీవన్మరణ సమస్య. రాష్ట్రం కేంద్ర సర్కారును ప్రత్యక్షంగా ఢకొీనాలి. సుప్రీంకోర్టు తీర్పుతో 2013లో ఒడిస్సాలో 'వేదాంత' చేపట్టిన బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమానికి అక్కడి సర్కారు దిగొచ్చింది. స్వయంగా ప్రజాభిప్రాయసేకరణ జరిపింది. ఇందుకు కేసీఆర్ ప్రభుత్వమూ స్వయంగా పూనుకోవాలి. తన మాటకు కట్టుబడాలి. ఏ అనుమానాలకూ తావీయకుండా నిజాయితీ చాటుకోవాలి. అంతిమంగా ప్రజా ఉద్యమాలే పరిష్కారం.