Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ భవితను నిర్ణయించే న్యాయమూర్తి, ప్రాసిక్యూటర్, పోలీసుపాత్రలను మరోమారు అమెరికా పోషించబోతోంది. అమెరికా సామ్రాజ్యవాదం మధ్యప్రాచ్యంలో మరో ప్రమాదకర యుద్ధం దిశగా పయనిస్తోంది. ఈసారి సౌదీ అరేబియా చమురు శుద్ధి కర్మాగారాలపై గత శనివారం జరిగిన దాడుల వెనుక ఇరాన్ పాత్ర ఉందనే సాకు అమెరికా చూపించబోతోంది. ఈ దాడులతో సౌదీ చమురు ఉత్పత్తి సగానికి పడిపోయిందని, ప్రపంచ చమురు ఉత్పత్తి 6శాతం తగ్గిందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పోంపియో ప్రకటించారు. అంతేకాదు, 'ప్రపంచ చమురు సరఫరాపై ఎన్నడూ లేని విధంగా ఇరాన్ దాడిచేసింది' అనీ అన్నారు. 'దాడి యెమెన్ వైపు నుంచి జరిగిందనటానికి సాక్ష్యం లేదు' అని కూడా ప్రకటించారు.
తూర్పు సౌదీ అరేబియాలోని చమురు శుద్ధి కర్మాగారాలపై జరిగిన వరుస దాడులతో అవి బాగా దెబ్బతిన్నాయి. ఆ దాడులకు ఇరాన్ కారణమనటానికి ఎటువంటి సాక్ష్యమూ లేదు. దాడులు చేసింది తామేనని హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. యెమెన్లో చాలా ప్రాంతాలు వీరి నియంత్రణలో ఉన్నాయి. యెమెన్పై అన్యాయంగా యుద్ధం ప్రకటించి ఆ దేశ ప్రజలను అమానుషంగా చంపుతున్న సౌదీ అరేబియాపై హౌతీ తిరుగు బాటుదారులు దాడులు చేయాలను కోవటంలో ఆశ్చర్యంలేదు. ఇందుకు కారణం ఇరాన్ అని అంటున్న అమెరికా విదేశాంగ కార్యదర్శికి అమెరికా మీడియా వంత పాడుతోంది. గూఢచార వర్గాలు సేకరించిన సాక్ష్యాధారాలనుబట్టి దాడుల వెనుక ఇరాన్ హస్తమున్నట్టు అమెరికా ఎలక్ట్రానిక్ మీడియా ప్రకటించింది. ఇరాక్లో 'మానవ హనన ఆయుధాలు' ఉన్నాయనేది ఎంత బూటకమని తేలిందో ఈ 'సాక్ష్యం' కూడా అంతే బూటకమని తేలుతుంది. ఇదే అమెరికా మీడియా యెమెన్లో సౌదీ అరేబియా యుద్ధ నేరాలను ఏమాత్రం ప్రచురించటం లేదు.
గత నాలుగున్నరేండ్లలో మధ్యప్రాచ్యంలో అత్యంత పేద దేశమైన యెమెన్పై సౌదీ అరేబియా చేస్తున్న యుద్ధంలో మానవహననం జరుగుతోంది. సౌదీ అరేబియా బాంబు దాడులలో ఇప్పటివరకూ లక్షమంది చనిపోయారు. 80లక్షలమంది ఆకలిదప్పులతో అలమటిస్తున్నారు. ఈ నరమేథంలో అమెరికాకు ప్రత్యక్షపాత్ర ఉంది. ఈ యుద్ధంలో ఉపయోగిస్తున్న బాంబులు, క్షిపణులు, యుద్ధ విమానాలను అమెరికానే సరఫరా చేస్తోంది. అంతేకాకుండా సౌదీ అరేబియా యుద్ధ విమానాలు నిరంతరాయంగా యెమెన్పై బాంబుల వర్షం కురిపించటానికి ఆకాశంలోనే వాటికి ఇంధనం నింపే పనీ అమెరికా నిర్వహిస్తోంది. ఒకవైపు సౌదీ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపిస్తుంటే మరోవైపు ఆకలిదప్పులతో అలమ టిస్తున్న యెమెన్ ప్రజలకు ఆహారం, ఔషధాలు అందకుండా అమెరికా నౌకాదళం ఆ దేశాన్ని దిగ్బంధిస్తోంది.
యెమెనీ హౌతీస్ పది డ్రోన్లకు ఆయుధాల్ని బిగించి సౌదీ చమురు శుద్ధి కంపెనీలపై దాడి చేశారని తెలుస్తోంది. వారు చేసిన దాడి యెమెన్ ప్రజలపై సాగిస్తున్న మారణకాండతో పోలిస్తే చాలా చిన్నది. ఐక్యరాజ్య సమితికి చెందిన భద్రతా మండలిలో యెమెన్పై సోమవారం జరిగిన సమావేశంలో అమెరికా నూతన రాయబారి కెల్లీ క్రాఫ్ట్ ఇరాన్పై అమెరికా చేస్తున్న ఆరోపణలను పున:శ్చరణ చేసింది. 'దాడి యెమెన్ వైపు నుంచి జరిగినట్టు సాక్ష్యం లేదు' అనే ప్రకటన తప్ప అమెరికా విదేశాంగ కార్యదర్శి పోంపియో దగ్గర మరో రుజువేమీ లేదు. సౌదీ చమురు శుద్ధి కర్మాగారాలకు జరిగిన నష్టం 'చాలా తీవ్రమైనది' అని ఆమె అన్నారు. ఆమె దృష్టిలో యెమెన్ ప్రజలు చిందిస్తున్న రక్తంకంటే సౌదీ అరేబియా చమురు చాలా విలువైనది.
శనివారం రాత్రి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్తో మాట్లాడి తన సంతాపాన్ని, మద్దతును తెలియజేశాడు. ఆ తరువాత సౌదీ చమురు శుద్ధి కర్మాగారాలపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకోవటానికి అమెరికా 'సర్వసన్నద్ధం'గా ఉందనీ ప్రకటించాడు. ఇరాన్లో తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని నెలకొల్పటం కోసం యుద్ధం చేయాలనుకుంటున్న అమెరికా పాలకవర్గాలు, దాని సైన్యం, గూఢచార యంత్రాంగం సౌదీ అరేబియా చమురు కర్మాగారాలపై జరిగిన దాడిని ఒక సాకుగా ఉపయోగించు కుంటున్నాయి. అమెరికా సామ్రాజ్యవాద ఆధిపత్య క్షీణతను సైనిక సంపత్తితో నిలువరించటానికి, ముఖ్యంగా ప్రపంచ ఇంధన వనరులపై పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించటానికి, తన ప్రత్యర్థులకు అలాంటి అవకాశం దక్కకుండా ఉండేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
సౌదీ చమురు కర్మాగారాలపై ఎవరు దాడి చేసినప్పటికీ మొత్తం అమెరికా ప్రజలను, యావత్ మానవాళిని ఒక వినాశకరమైన యుద్ధంలోకి దించాలనే ప్రయత్నం జరుగుతోంది. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులకు దిగితే ఆ దేశం ప్రతిఘటిస్తుంది. అమెరికా యుద్ధనౌకలను పర్షియన్ గల్ఫ్లో ఇరాన్ ముంచే ప్రమాదం ఉంటుంది. అమెరికా కుట్రలు, కుతంత్రాల వల్ల వేలాది అమెరికా సైనికుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయి. అటువంటి పరిస్థితులలో అది మరో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం కూడా ఉంది. దానితో మానవాళి మనుగడే ప్రశ్నార్థకమౌతుంది. అటువంటి యుద్ధాన్ని నిలువరించాలంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా శాంతికోసం ఉద్యమించాలి. అప్పుడే సామ్రాజ్యవాదం ఒంటరిదౌతుంది. మానవాళి మనుగడకు కనీస భద్రత ఉంటుంది.