Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనిషికన్నా మనిషి మాటకున్న విలువ మిన్న మనుషుల మధ్య మాటలకున్న విలువ మరీ మిన్న మనుషుల మధ్య మాట కరువైనపుడు శ్మశాన నిశ్శబ్దం రాజ్యమేలుతుందిప్రభుత్వానికీ ప్రజలకూ మధ్య మాట కరువైనపుడు రాజ్యమే ఒక శ్మశానాన్ని తలపిస్తుంది- అవును! ఇప్పుడు కాశ్మీర్లో అదే జరుగుతోంది. ఉగ్రవాదానికి-కేంద్రానికి మధ్య అంటూ మొదలైన యుద్ధం ఇప్పుడు కేంద్ర పాలక పార్టీకి - కాశ్మీర్లోని ప్రజాస్వామ్య పార్టీలకూ మధ్య కేంద్రీకృతమైంది. ఫలితంగా కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ముగ్గురూ చెరసాలలో మగ్గుతున్నారు. భారతదేశ చరిత్రలో కనీవినీ ఎరుగుని విపరీతమిది. తలచుకుంటేనే వొళ్లంతా జలదరించే అనూహ్యమైన అప్రజాస్వామిక పరిణామమిది. మరీ ముఖ్యంగా భారతదేశ జాతీయజెండా కాశ్మీర్లో సగర్వంగా ఎగిరేందుకు జీవితాంతం చావుకు ఎదురీది శ్రమించిన 81ఏండ్ల కురువృద్ధుడు, మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాను అరెస్టు చేయడం. ఫరూఖ్ అబ్దుల్లా విషయంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పరమ దుర్మార్గమైనది. ఆర్టికల్ 370ని రద్దు చేసిన ఆగస్టు 5 నుంచే ఫరూఖ్ను గృహనిర్బంధంలో ఉంచారు. ఆగస్టు 6న కేంద్ర హౌం మంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రసంగిస్తూ ఫరూఖ్ను అరెస్టు చేయడం కానీ, నిర్బంధంలోకి తీసుకోవడం కానీ జరగలేదని నిస్సిగ్గుగా పచ్చి అబద్ధమాడారు. దీంతో తమిళనాడుకు చెందిన ఎండీఎంకే నేత వైగో ఫరూఖ్ ఎక్కడున్నారో చెప్పాలంటూ సుప్రీం కోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలు చేయడంతో ఆయనను అరెస్టు చేసినట్టు ప్రకటించారు.
సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే తరిగామితో సహా కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్, పీపుల్స్డెమోక్రటిక్ ఫ్రంట్.. పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములైన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలంతా ఇప్పుడు నిర్బంధంలో మగ్గుతున్నారు. ఇన్నాళ్ళూ కాశ్మీర్ ప్రజల గొంతుకగా ఉన్నవారు, వేర్పాటువాదుల నుంచి పొంచి ఉన్న ముప్పుకు బెదరకుండా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వాళ్ళంతా జైళ్ళల్లో మగ్గుతున్నప్పుడు ఇక అక్కడ రాజకీయ ప్రక్రియకు తావెక్కడిది? దశాబ్దాలుగా రగులుతూ ఉన్న కాశ్మీర్ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు వీలెక్కడిది? అంటే, కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించేందుకు సిద్ధంగా లేదని మనకు అర్థమవుతున్న అంశం. మరి, రాజకీయ ప్రక్రియకు పూర్తిగా తలుపులు మూసేసిన కేంద్రం ఇప్పుడు అక్కడ ఏమి చేయబోతోంది? మాటలకు (చర్చలకు) మార్గం మూసేసిన తరువాత ఏమి జరుగుతుంది? మరింతగా నిర్బంధం పెరుగుతుంది. మరిన్ని వేలమందిని జైళ్ళల్లో కుక్కేస్తారు. కాశ్మీర్లో జైళ్ళు చాలకపోతే దేశంలోని జైళ్ళన్నిటికీ కాశ్మీరీయులను తరలిస్తారు. నిజానికి ఇప్పటికే ఆ తరలింపు మొదలయ్యింది. ఇంటికొక్కరు, ఆ ఇంటిని పోషించాల్సిన అవసరం, శక్తి ఉన్నవాళ్ళు ఇంటికి దూరమైన తరువాత ఆ కుటుంబం, కుటుంబానికి దూరమై జైలులో ఉన్న వ్యక్తి డీలా పడిపోతాడనీ, తీవ్ర నిరాశలో, నైరాశ్యంలో కూరుకు పోతారనీ, ఎంత ప్రతిఘటించినా వ్యర్థం, అత్యంత బలమైన రాజ్యంతో ఢకొీని తాము అనుకున్నది సాధించడం అసాధ్యమన్న నిర్ణయానికి వచ్చి సర్కారుతో రాజీ పడతారనీ, ఉన్న దాంతో సర్దుకుపోవడం అలవర్చుకుని అణగిమణగి పడిఉంటారనీ.. కేంద్రంలోని కాషాయ ప్రభుత్వం భావిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే కేంద్రంలోని బీజేపీ సర్కార్ కాశ్మీర్ ప్రజలపై మానసిక యుద్ధం చేస్తున్నదిప్పుడు. చుట్టూ నిశ్శబ్దాన్ని నింపి, నిశ్శబ్దంలో జనాన్ని నింపి, ఆ మాటలు లేని మౌన జీవితంతో జనం విసిగివేసారిపోయేలా చేసి లొంగదీసుకోవాలని చూస్తోంది.
కాశ్మీర్లో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పూర్తిగా సమర్థనీయమని సాక్షాత్తూ సుప్రీంకోర్టు ప్రకటించిన తరువాత ఇక ప్రజలకు ప్రత్యామ్నాయం ఎక్కడిది? తమకు జరుగుతున్న అన్యాయాన్ని, తమపై జరుగుతున్న దౌర్జన్యాన్ని జనం ఎక్కడికెళ్లి విన్నవించుకోవాలి? తమకు న్యాయం జరిగేలా చూడాలని ఎవరిని వేడుకోవాలి? అలా విన్నవించుకునే, వేడుకునే అవకాశం లేకుండా చేయడమే నరేంద్ర మోడీ సర్కారు ఎత్తుగడ. ప్రత్యామ్నాయం కోల్పోయిన జనం అనివార్యంగా తాము చెప్పినట్టు వింటారని, తమ కాళ్ల చెంత పడి ఉంటారనీ కమలనాథుల నమ్మకం.
నిజమే! లోపల రగులుతున్న అగ్నిపర్వతం కూడా బద్ధలయ్యే వరకూ పైకి ప్రశాంతంగానే కనిపిస్తుంది. అంతమాత్రాన అది బద్దలయ్యేవరకు తనలోపల ఉన్న గుణాన్ని కోల్పోయినట్టు కాదు. ప్రజలూ అంతే. జీవితం తమలో రగిలించిన తిరుగుబాటు తత్వాన్ని ఆశయం సిద్ధించేంత వరకూ అస్సలు కోల్పోరు. ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో లోలోన అణచుకుంటారు. అదనుచూసి అగ్నిపర్వతమై బద్ధలవుతారు.