Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడవులు భద్రంగా ఉంటే మనుషులు క్షేమంగా ఉంటారు. ఈ చిన్న విషయం తెలియక కాదు, తెలిసీ అడవుల విధ్వంసాన్ని ఆపలేకపోవడం ఆధునిక మానవుని దుస్థితి. మరీ ముఖ్యంగా సంపన్న వర్గాల, సంపన్నదేశాల విధానాలు అడవుల క్షయానికి దారితీస్తున్నాయి. ఇటీవల అమెజాన్ అడవులు దగ్ధం కావడం పర్యావరణవేత్తల్ని, ప్రకృతి ప్రేమికుల్ని తీవ్ర ఆందోళనకు లోను చేసింది. ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. తమ అభివృద్ధికి ఆటంకమైతే అడవుల్ని ఉపేక్షించడం సాధ్యం కాదన్నది పాలకుల సమాధానం.
మన దగ్గర నల్లమల్లలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా వినిపించిన తీవ్ర నిరసనల నేపథ్యంలో వాటిని అనుమతించబోమని పాలకులు చెప్పారు. అయినప్పటికీ ఆచరణలో ఏం జరుగుతుందన్నది ప్రశ్నే.. ఆదిమానవుల నివాసం అరణ్యమే. అరణ్యాల్ని దాటుకొని ప్రయాణించే క్రమాన చెట్లని నరికివేసి, వ్యవసాయయోగ్యమైన భూములుగా మార్చారు. అంతమాత్రాన ఇవాళ భారీ ప్రాజెక్టులు, మైనింగ్ తవ్వకాల కోసం వేలాది హెక్టార్ల అడవుల్ని నిర్మూలించడం క్షంతవ్యం కాదు. ఎందుకంటే జీవవైవిధ్యం సమతుల్యం మీదనే మానవుని జీవనం ఆధారపడి ఉంది. ఉత్తరాఖండ్లో ఉవ్వెత్తున వచ్చిన వరదలకు, అక్కడ కొండల మీద నిర్మించిన ప్రాజెక్టులే కారణమని పర్యావరణవేత్తలు తేల్చిచెప్పారు.
మానవుని అవసరాలకు అనుగుణంగా అడవుల్ని ఉపయోగించుకోడంలో తప్పులేదు. అడవుల్లోని జీవ వైవిధ్యానికి, పచ్చదనానికి భంగం కలగకుండా వాటిని వినియోగించుకునే విధివిధానాల్ని అనుసరించాలి. దీనికి భిన్నంగా అడవుల్ని నేలమట్టం చేయడం దుర్మార్గం. ఇది కూర్చున్న చెట్టు కొమ్మను తానే నరుక్కోవడం వంటి ఆత్మహత్యాసదృశ్యమైన చర్య.
ఈ సత్యం అందరికీ తెలుసు. అయినా లక్షల హెక్టార్ల అడవుల నిర్మూలనకు ప్రభుత్వాలు అనుమతించడం వైచిత్రి. కలపదొంగల వల్ల, జంతువుల్ని వేటాడేవారి వల్ల జరిగే నష్టం చాలా చిన్నది. వీరితో పో లిస్తే అడవి ఉనికిని దెబ్బతీసే ప్రభుత్వ విధానాలు అడవులకీ, వాటిని అంటిపెట్టుకొని ఉన్న జనాలకీ తీవ్రమైన శరాఘాతం. ఒకవైపు అటవీభూభాగ విస్తీర్ణం తగ్గిపోతుంటే మరోవైపు ఈ విస్తీర్ణం పెరుగుతున్నట్టుగా ప్రభుత్వం చెబుతున్నది. ఇది అంకెల గారడీ. ఒకప్పుడు మన దేశంలో 30శాతానికి పైగా అడవులు విస్తరించి ఉండేవి. ఇపుడు దేశ భూభాగంలో అటవీ విస్తీర్ణం 21.34శాతం మాత్రమే. దట్టమైన అరణ్యాల జోలికి అసలు వెళ్ళకూడదని అంతర్జాతీయంగా పర్యావరణవేత్తలు పదేపదే చెబుతున్నారు. కానీ మన దేశంలో భారీ డ్యాంల కోసం, రక్షణ విభాగం, జలవిద్యుత్ ప్రాజెక్టులు, గనుల నిర్మాణం కోసం దట్టమైన అరణ్యాల్ని సైతం నిర్మూలిస్తున్నారు. దీని ప్రభావం దీర్ఘకాలికం. జీవవైవిధ్యం దెబ్బతినడమే కాక అకాల వర్షాలు, తుఫాన్లు, వరదలు, భూకంపాలు తలెత్తడానికి దారితీస్తుంది.
అభివృద్ధి జరగాలంటే అడవులు అంతరించక తప్పదనే వాదన ముందుకు తెస్తున్నారు. అభివృద్ధి ఎవరికోసం, ఎందుకోసమనే ప్రశ్నలకు సరయిన జవాబు ఉండదు. దేశీయ పెట్టుబడిదారులకోసం, బహుళజాతి కంపెనీల కోసం అడవుల్ని నిర్మూలించడాన్ని భవిష్యత్ తరాలు క్షమించవు. అడవుల్ని నరికివేసే క్రమాన ఎన్ని చెట్లను కోల్పోతారో, అన్ని చెట్లను ప్రత్యామ్నాయంగా మరోచోట పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రకారం కృత్రిమంగా మొక్కల పెంపకం కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ అరణ్యమంటే కేవలం చెట్లు కాదు, పక్షులు, జంతువులు, నేల, అక్కడ నివసించే మానవులు... ఇంకా అపారమైన జీవవైవిధ్యం. వాటిని మరోచోట పున:ప్రతిష్టించడం సాధ్యం కాదు. యురేనియం కోసం నల్లమలని నాశనం చేస్తే మరోచోట దానిని అంతే సహజసిద్ధంగా నిర్మించగలరా? ఇవాళ దగ్ధమవుతున్న అరణ్యాల్ని మరల సృజించడం సాధ్యమా?
ప్రకృతి ప్రసాదించిన అపురూప వరాలు అరణ్యాలు. మానవాళికి అవాసంగా, ఆసరాగా ఈ అరణ్యాల గొప్పతనాన్ని, వాటి సహజ సౌందర్యాన్ని విభూతి భూషణ్ బందోపాధ్యాయ 'వనవాసి' నవలలో అద్భుతంగా చిత్రించారు. 'అడవి గాచిన వెన్నెల' అంటారు. కానీ చంద్రోదయాన్ని, హౌయలు పోయే వెన్నెల అసలుసిసలు సౌందర్యాన్ని అడవిలో మాత్రమే చూడగలం. 'అడవి తల్లికీ దండాలో' అని మనవాళ్ళు పాడుకుంటారు. అటవీ వైవిధ్యాన్ని, మాయమర్మం ఎరుగని ఆదివాసుల జీవన రీతులను అల్లం రాజయ్య, సాహుల 'కొమురం భీము', వసంతరావు దేశ్పాండే 'అడవి' నవలల్లోనూ చదివి ముగ్ధులమవుతాం. కేశవరెడ్డి నవల 'అతను అడవిని జయించాడు' ఒక దృశ్యకావ్యమనే చెప్పాలి. అల్లం శేషగిరిరావు రాసిన వేట కథల్లోనూ అడవి ఔన్నత్యం రూపుగడుతుంది. తెలుగు కవులకీ, కథకులకీ అడవి గొప్ప ప్రేరణ, తరగని ఇతివృత్తం.
ఇవాళ నల్లమల్లలో యురేనియం తవ్వకాలంటే మండిపడుతున్న కవులు, రచయితలు తమ కలాలకు పదునుపెట్టారు. అడవిని స్మరిస్తున్నారు. అడవి వస్తువుగా కవిత్వాన్ని సృజిస్తున్నారు. నిజానికి గొప్ప సాహిత్యసృష్టికి అడవులే కదా మూలం. రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాల్లో అరణ్యాల వర్ణన కమనీయం. బెజ్జారపు రవీందర్ రాసిన 'తాటక' నవల అడవుల్ని నిర్మూలించే వారికీ, వాటిని కాపాడుకోవాలనుకునే వారికి మధ్య జరిగిన ఘర్షణని ప్రతీకాత్మకంగా చూపింది. అడవుల్లేని ప్రపంచాన్ని ఊహించగలమా? అడవుల్ని నిర్మూలిస్తేనే విద్యుత్ వెలుగులు లభిస్తాయంటే ఆ వెలుగులు ఎవరికోసం? ఎందుకోసం? అనే ప్రశ్నలు సహజం. అరణ్యం పట్ల సృజనశీలుర అమేయమైన మమకారమే ఈ ప్రశ్నలకు మూలం. ఇది అరణ్యాలను కాపాడుకునే దిశగా క్రియాశీలతని సంతరించుకోడం ఇవాళ్టి అవసరం.