Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆశల పూలెన్నో సుమిస్తున్నాయి..
మరో వసంతాన్ని ఆహ్వానిస్తూ,
చెలిమి రాగాలను ఆలపిస్తున్నాయి..
స్నేహ వసంతంలో చివుళ్లు తిన్న కోయిలలు,
మైత్రీ వేణువులూదగానే చైత్ర కోయిలవలే అనుబంధాల్ని అల్లుకుపోయి, గత స్మృతులను ముడేసుకుంటూ ఆప్త హృదయాలు ఒకరికొకరు పరితపిస్తూనే ఉంటాయి. పక్షులు తన నెచ్చెలి దగ్గరికి తుర్రుమని వెళ్లి వాలి పోయేలా.. మనక్కూడా రెక్కలుంటే ఎంత బావుండునో.. అని ఒక్కోసారి మది తడుముతూనే ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే క్షీరసాగర మధనంలో ఉద్భవించిన అమత కలశం వంటిది మైత్రి. ఆ బంధానికి అంత స్వచ్ఛతా.. ఆ స్నేహానికి అంత ఆర్ధ్రతా కలగలిసి నదిలా ప్రవహిస్తూనే ఉంటుంది.
ఆనందమైనా, బాధైనా, కష్టమైనా, ఇష్టమైనా మనసున సుడులు సుడులుగా తిరుగాడుతున్నప్పుడు ఒక సమాధానంలా తారసపడతాడు స్నేహితుడు. పద్మవ్యూహంలో చిక్కుకుపోయి విలవిల్లాడుతున్నప్పుడు కొండంత భరోసాగా కనిపిస్తుంటాడు. నమ్మకాన్ని కొంతా, అమ్మతనాన్ని కొంతా రంగరించి నాన్నలా లాలిస్తాడు. కల్లాకపటం ఎరుగక సమీరంలా అల్లుకుపోతాడు. నిజానికి జీవితంలో ఓ మంచి ఆప్తుడు ఉండాలంటారు అందుకేనేమో...! కష్టసుఖాలను పంచుకున్నప్పుడు కష్టం మంచుగడ్డలా కరిగి సన్నబడుతుంది. సంతోషం హిమాలయంలా పెరిగి పెద్దదవుతుంది. చివరకు ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం వల్లనే నేనీ స్థానానికి చేరుకున్నానని గర్వంగా ప్రకటించగలగాలి. మిత్రబృందమంటే అలా ఉండాలి. ఒకర్నొకరు ప్రోత్సహించుకుంటూ ఒకరిలోపాల్ని మరొకరు సరిదిద్దుకుంటూ ముందుకు సాగిపోవాలి. మార్గదర్శకులుగా మిగిలిపోవాలి. అటువంటి మంచిమిత్రుడు పక్కనుంటే చాలు తెలియకుండానే స్ఫూర్తి రగులుకుంటుంది. అందుకే 'కబీర్ సంగత్ సాధుకీ జ్యోం గంధీ కా బాస్ / జో కఛు గంధీ దే నహీ, తో భీ బాస్ సువాస్' అంటారు కబీర్. అంటే సత్పురుషుల సాంగత్యం అంగడిలోని అత్తరు వంటిది. అంగడివాడు ఏమీ ఇవ్వకున్ననూ అక్కడ ప్రసరించే సువాసనను అనుభవించి ఆహ్లాదపడతావు. మంచివారి నుంచి ఎలాంటి బోధలు లభించకున్నా కొంతసేపు వారితో గడిపితే చాలు ఎంతో నేర్చుకున్న వారమవుతామని కబీర్ భావన.
సహజసిద్ధమైన మేధస్సు మంచిమిత్రులు తోడుంటే మరింత మెరుగులు దిద్దుకుంటుందని నిరూపించారు ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్. బంగారానికి పుటం పెట్టినట్టు సరైన స్నేహబంధం తోడుంటే ఎంచుకున్న రంగంలో శోభించవచ్చు. ఆయన జీవితాన్ని చూస్తే ఇదే అవగతమవుతుంది. యుక్తప్రాయంలో ఐన్స్టీన్కు సజ్జనులైన మిత్రులు లభించారు. ఐన్స్టీన్ మిత్రులు మార్సెల్ గ్రోస్మన్, మిషెల్ అంజిలో బెస్సోతో గంటల తరబడి గణితానికి సంబంధించిన చర్చల్లో మునిగిపోయేవారు. ఐన్ ప్రతిభను ఉపాధ్యాయులకన్నా ముందుగా గుర్తించింది స్నేహితుడే. వారితో గడిపిన సరదా సందర్భాలూ ఆయనలోని జ్ఞానతృష్ణను రెట్టింపు చేశాయి. అలసిన వేళల్లో ఆ మిత్రులతో సంగీత కచేరీలకు వెళ్లడం ఐన్స్టీన్కు ఎంతో మానసిక ఉల్లాసాన్నిచ్చేది. ఫలితంగా మంచి అభిరుచులు కూడా అలవడ్డాయి. ఈ ముగ్గురూ జీవితాంతం తమ మైత్రి కొనసాగించారు. ఒకరి అభివృద్ధికి మరొకరు పట్టుగొమ్మలై నిలిచారు.
స్నేహం వ్యక్తిగతానికే కాదు.. అది సమాజ పురోభివృద్ధికి దిక్సూచిగా మారాలి. నేటి ఆధునిక కాలంలో ఆలోచనలు పంచుకునే సరిజోడి కావాలి. సమాజంతో ముడిపడిన మనిషి జీవనానికి అదెంతో అవసరం కూడా. మధ్యతరగతి కుటుంబంలో పుట్టినా కారల్మార్క్స్-ఏంగెల్స్ మైత్రి పెట్టుబడిదారీ విధానాన్ని ఎండగట్టి, ప్రపంచవ్యాప్త కార్మికవర్గ ఉద్యమానికి బాటలు వేసింది. మానవ సంబంధాలను ఆర్థిక సంబంధాలుగా ఆనాడే పేర్కొని, ఒక సామాజిక విప్లవ సిద్ధాంత ఆవిర్భావానికి కారణమైంది. ఫైడల్కాస్ట్రో-చేగువేరా చెలిమి విముక్తి ఉద్యమానికి ఊపిరులూదింది. స్వతంత్ర రాజ్యాల సంస్థాపనకు తోడ్పడింది. ఆదర్శాలూ ఆశయాలూ కలగలిసిన మహౌన్నత స్నేహాలు గనుకే వారు మహానుభావులు..! తెలుగునాట బాపూ రమణల మైత్రి ఓ స్మరణీయ ఘట్టం. చక్కని బొమ్మా చిక్కని సజనా జమిలిగా సాగిన ప్రయాణం వారిది. స్నేహబంధాలకు ఇంత విలువా, శక్తీ ఉన్నాయి కాబట్టే అనేక రూపాల్లో అది సమాజంలో గుబాళిస్తూనే ఉంది. అందుకే 'స్నేహానికన్న మిన్న లోకాన లేదురా / కడదాకా నీడ లాగ నిను వీడి పోదురా / ఈ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది/ఈ స్నేహ మొకటేనురా..' పాట నిరంతర రాగ తరంగమై రాజిల్లుతున్నది. ఇరువురు వ్యక్తుల మధ్య పెనవేసుకున్న చెలిమి మల్లెతీగలా అల్లుకుపోయి, సుమధుర సౌరభాల్ని వెదజల్లుతూ ఉంటుంది. ఆ మధుర జ్ఞాపకాల్లోనికి ప్రవేశించిన ప్రతిసారీ స్నేహ పరిమళాల్ని ఆస్వాదించిన కమ్మని అనుభూతులే.. చిక్కని భావనలే.. అందుకే స్నేహం ఓ మహావృక్షం. అది ఎప్పటికీ నీడలా సేదతీరుస్తూ ఉంటుంది. మైత్రికి వర్ణ, వర్గ, జాతి బేధాలూ ఎల్లలూ లేవు. అందుకే అది సజీవం. కొత్తచివుళ్లకు శాశ్వత చిరునామా...!