Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మున్సిపల్ ఎన్నికలు రాజకీయ వ్యభిచారాన్ని తలపించాయి. సాధారణ ఎన్నికలను మరిపించాయి. రాజ్యాంగం కల్పించిన హక్కును ప్రజలు స్వేచ్ఛగా వినియోగించుకునే అవకాశం లేకుండా పోయింది. దీనికి రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ ప్రధాన కారణం. 120 మున్సిపాల్టీలు, 9 కార్పొరేషన్లకు బుధవారం ఎన్నికలు జరిగాయి. అవకతవకలు, అక్రమాలకు ఆలవాలంగా ఇవి ప్రతిబింబించాయి. డబ్బు, మద్యం ఏరులైయింది. గత వారం రోజులుగా దాదాపు రూ.280కోట్ల మేర మద్యం అమ్ముడుపోయినట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్పారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడంలో గులాబీ పార్టీతోపాటు కాంగ్రెస్, బీజేపీ పోటీపడ్డాయి. గతంలో ఓటుకు నోటు అనేవాళ్లు. ఇప్పుడు ఓటుకు మద్యం, బంగారు నాణెం, బైక్, రూ.లక్ష అనేవి ప్రచారంలోకి వచ్చాయి. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెవులు, కండ్లూ మూసుకుంది. పైకి డాంబికాలు చెబుతూ అధికారపార్టీకి వంతపాడిందనే విమర్శలను మూటకట్టుకున్నది. పోలీస్శాఖా పరిస్థితీ అదే.
మున్సిపల్ ఎన్నికలు రాజకీయ జూదానికి తెరలేపాయి. ఇందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మెన్లు తమ పార్టీ గెలుపుకోసం నానాగడ్డీ కరిచారు. దగ్గరుండిమరీ ఎన్నికల మార్గదర్శకాలకు తూట్లు పొడిచారు. డబ్బు, మద్యాన్ని ప్రవహింపజేశారు. రియల్ఎస్టేట్ వ్యాపారుల ప్రభావం విపరీతంగానే కనిపించింది. ఈ ఎన్నికలు ఎన్నో వింతలు, విశేషాలకు నెలవుగా మారాయి. డబ్బు, మద్యం పక్కనబెడితే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాయి. అభ్యర్థుల స్థాయినిబట్టి కాసుల వర్షం కురిపించారు. కార్పొరేషన్లూ కాస్త పెద్ద మున్సిపాల్టీల్లో కోట్లాది రూపాయలు ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు ఖర్చుపెట్టారు. అధికార పార్టీ నేతలు ప్రజల పేదరికాన్ని ఆసరా చేసుకుని రాజ్యాంగ హక్కులను కాలరాశారు. ఓటేసే స్వేచ్ఛను హరించారు. ఓటర్లతో ఆటాడుకున్నారు. నల్లగొండ జిల్లా చండూరులో టీఆర్ఎస్, కాంగ్రెస్ ఏకంగా ఓటర్ల క్యాంపులు పెట్టాయి. తాగినోళ్లకు తాగినంత అన్నట్టుగా మద్యం పోశాయి. ఓటర్ల బలహీనతలను తమ బలంగా మార్చుకుని అడ్డగోలు వ్యవహారాలు నడిపాయి. ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కాయి. ఫిర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో ఎన్నికలకు ముందు నుంచే డబ్బు కుమ్మరించారు. బడంగ్పేటలో ఓటుకు రూ.50 వేలు ఇచ్చినట్టు సమాచారం. ఇలా అనేక చోట్ల ఓటర్లను ప్రలోభపెట్టే వక్రమార్గాలను టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అనుసరించాయి.
గులాబీ పార్టీ ఇష్టారీతిన అధికార దుర్వినియోగానికి పాల్పడింది. ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల నుంచి పోలింగ్ దాకా అక్రమాలకు తమకు అనుకూలంగా ఎన్నికల ప్రక్రియను మలిచింది. పోలింగ్కు మూడు రోజులు ముందు నుంచే కాసుల పంపకాలకు తెరలేపింది. బంగారు నాణేల దగ్గర నుంచీ ద్విచక్ర వాహనాల వరకూ పంపిణీ చేసిందన్న ఆరోపణలున్నాయి. ఒకే ఇంట్లో ఐదారు ఓట్లు ఉంటే రూ. రెండు లక్షల వరకు ఎరగా వేసిందని సమాచారం. ఇలా ఎన్నికల నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించింది. అయితే అదేస్థాయిలో రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీస్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించాయి. అన్ని రకాలుగా గులాబీ పార్టీ అడుగులకు మడుగులొత్తాయి. ప్రజాస్వామ్యం మాత్రం మంట కలిసింది. విలువల వలువలూడ్చారు. రాజ్యాంగ వ్యవస్థల ఉసురు తీశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితాలు తప్పులతడకగా రూపొందించిన సంగతి వామపక్షాలు చెప్పినా, కమిషన్ చెవికెక్కలేదు. పోలింగ్ రోజు ఆ సంగతి బయటపడింది. మీర్పేట కార్పొరేషన్ పరిధిలోని ఒక ఐదు అంతస్థుల భవనాన్ని మూడు వార్డుల కింద విభజించారు. ఈ ఒక్క సాక్ష్యం చాలు అవకతవకలు ఏస్థాయిలో ఉన్నాయో అర్థంచేసుకోవడానికి. బ్యాలెట్ పేపర్ల ముద్రణపై కూడా అనుమానాలు వెల్లువెత్తాయి. బండ్లగూడ జాగీర్లోని 22వ వార్డు, పోలింగ్ కేంద్రం 17లో ఒక మహిళా ఓటరుకు ఇచ్చిన బ్యాలెట్ పేపర్లోని టీఆర్ఎస్ గుర్తుపై ఓటేసినట్టుగా ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని హాలియా మున్సిపాల్టీలో టెండర్ ఓటు అడిగితే, సాధారణ ఓటు వేయించారు. రీపోలింగ్ చేయాల్సి వస్తుందన్న కారణంతో ఇలా చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇదిలావుండగా ఎన్నికలు జరిగిన గద్వాల, జగిత్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబాబాద్, ఖమ్మంతోపాటు హైదరాబాద్ నగర శివారుల్లోని ఆయా కార్పొరేషన్లల్లో అల్లర్లు జరిగాయి. వీటిని అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారు. ఎన్నికల్లో ఓట్లు వేయించు కోవడానికి ఎన్నో అక్రమాలకు పాల్పడ్డ కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, చివరకు శాంతిభద్రతల సమస్య సృష్టించడానికే వెనుకాడలేదు. జగిత్యాలలో టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య, గద్వాలలో కాంగ్రెస్, ఎంఐఎం, ఖమ్మంలో స్వతంత్ర అభ్యర్థిపై టీఆర్ఎస్ నేతల దాష్టీకం, వర్థన్నపేటలో కాంగ్రెస్, టీఆర్ఎస్, పెద్దఅంబర్పేట కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య, కోదాడ, బోడుప్పల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, మీర్పేటలో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గొడవలు జరిగాయి. మీర్పేట, పరకాల, తాండూరు, మంచిర్యాలలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. మీర్పేట, బోడుప్పల్, వేములవాడ, సత్తుపల్లి, దుండిగల్, హుజూర్నగర్లో టీఆర్ఎస్ అభ్యర్థులు, ఆ పార్టీ నేతలు పోలింగ్ కేంద్రాల వద్ద డబ్బులు పంచినా పోలీసులు పట్టించుకోలేదు. కేసులు నమోదు చేయలేదనే విమర్శలూ వెల్లువెత్తాయి.