Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజ్యాంగం అమలులోకి వచ్చి డెబ్బయ్యేళ్ళయిన సందర్భం జాతికీ, ప్రజలకీ ఉత్సవ సందర్భం. కానీ అది రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ఉద్యమ సందర్భంగా పరిణమించడం ఓ కఠోర వాస్తవం. రాజ్యాంగాన్ని కాపాడుతామని ప్రమాణం చేసి పాలనాపగ్గాలు చేపట్టిన కాషాయ మూకల్నించి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం అనివార్యమైన సన్నివేశం. రాజ్యాంగ ప్రవేశికలోని మౌలిక సూత్రాల్ని సైతం త్రోసిరాజనే పాలకుల నియంతృత్వ పోకడలపై వెల్లువెత్తే నిరసనలే ఇందుకు సాక్ష్యం.
''భారత ప్రజలమైన మేము ఈ భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్య వాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా రూపొందించు కుని... చట్టరూపంలో మాకు మేము 26 నవంబర్ 1949 నాడు సమర్పించు కుంటున్నాము'' అని రాజ్యాంగ అవతారికలో చెప్పుకున్న మాటల్ని ఒక్క అక్షరం పొల్లు పోకుండా పాటించడం అధికారంలో ఉన్నవారి బాధ్యత. ఇది రాజ్యాంగ శాసనం. కానీ 'సామ్యవాదం' అనేది నేతిబీరకాయలో నెయ్యి చందంగా మారి చాన్నాళ్ళయింది. గ్లోబలైజేషన్ నేపథ్యంలో బహుళజాతి కంపెనీలకు ద్వారాలు తెరిచిన పాలకులు కార్పోరేట్లకు గులాంగిరీ చేస్తూ దేశ ప్రజల ప్రయోజనాలని తాకట్టు పెట్టారు. ఈ దేశ సంపదల్ని, వనరుల్ని దేశీయ గుత్త పెట్టుబడిదారులకు, సామ్రాజ్యవాదులకు అప్పగించే దుష్ట విధానాల్ని అమలు చేస్తూ రాజ్యాంగ ప్రవేశికలోని 'సామ్యవాదం' అనే పదాన్ని నీరుగార్చారు.
కాషాయ పాలకుల విధానాల ఫలితంగా దేశీయ కంపెనీలు మూతపడుతున్నాయి. ప్రభుత్వరంగసంస్థలు ప్రైవేటుపరమవుతున్నాయి. ఫలితంగా తమ హక్కుల కోసమేగాక రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే పోరాటాల్లో కార్మికవర్గం అంతర్భాగమవుతున్నది. ప్రజల పోరాటాల్నీ, ప్రశ్నల్నీ సహించలేని ప్రభుత్వం వారి పౌరసత్వంపై తెగబడింది. ఈ దేశ పౌరుల పౌరసత్వాన్ని పరీక్షకు పెట్టింది. ఎవరు పౌరులో, ఎవరు కాదో తేల్చడానికి దుర్మార్గమైన, రాజ్యాంగ విలువలకు విరుద్ధమైన విధానాలని రూపొందించింది. తొలుత కశ్మీర్కు స్వయంప్రతిపత్తిని ప్రసాదించే 370 ఆర్టికల్ను రద్దు చేసి ఆ రాష్ట్రాన్ని మొత్తంగా ఒక జైలుగా మార్చింది. ఆ తర్వాత పౌరసత్వ వివాదాన్ని రాజేసింది. సీఏఏ, ఎన్ఆర్సి, ఎన్పిఆర్ పేరు ఏదయినా సరే అది ప్రజల పౌరసత్వ హక్కుల్ని హరించే పాశవిక కుట్ర. ప్రజల్ని మతప్రాతిపదికన విభజించే కౌటిల్యమిది.
ఆర్థికవ్యవస్థ అతలాకుతలమై ఉద్యోగాలు కోల్పోయేవారు, ఉపాధిలేక అల్లాడే నిరుద్యోగుల ప్రశ్నలకు జవాబు చెప్పలేని పాలకులు 'పౌరసత్వ' వివాదాన్ని తెర మీదకు తెచ్చారు. శరణు కోరి వచ్చినవారికి పౌరసత్వం ఇవ్వడానికి మతాన్ని ప్రాతిపదికగా చేసుకోడం రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగ ప్రవేశికలో ప్రకటించుకున్న 'లౌకిక' అనే మాటకు ఉన్న స్ఫూర్తివంతమైన అర్థాన్ని పరిహసించడం. ఇదే మన రాజ్యాంగానికి అతి పెద్ద ముప్పు. ఒకసారి ఈ సూత్రాన్ని అంగీకరిస్తే అది మరెన్నో దుర్మార్గాలకు ఆమోదించినట్టవుతుంది. అందుకే ఎల్లెడలా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) మీద నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. భిన్నమతాలు, భాషలు, తెగలు వర్థిల్లే దేశాన్ని మతం ప్రాతిపదికన విభజించే కుట్రల్ని అనుమతించడం ఆత్మహత్యాసదృశం. ఆలోచనాపరులయిన ప్రజలు ముఖ్యంగా యువతరం నిరసనల ఊరేగింపులు దేశమంతటా నిత్యకృతమయ్యాయి. రాజ్యాంగం పట్ల వారికి ఉన్న గౌరవాన్ని, రాజ్యాంగాన్ని తుడిచిపెట్టే పాలకుల నిర్హేతుక విధానాలపై నిరసనా చెప్పకనే చెబుతున్నాయి.
పాలకుల విధానాలపై నిరసనని, అసమ్మతిని, అనంగీకారాన్ని తెలియజేయడం ప్రజాస్వామిక హక్కు. ఆ స్వేచ్ఛని రాజ్యాంగమే ప్రసాదించింది. పాలకులు దుర్మార్గులయి, సంపన్నుల పక్షం వహించి జనం మీద పెత్తనం చెలాయించే ప్రమాదం ఉందని ముందుగానే రాజ్యాంగ రూపకర్తలు ఊహించి వుంటారు. అందువల్లనే నిరసన తెలిపే స్వేచ్ఛ వుందని, దానిని నిరాకరించడం పాలకులకు తగదని, ఇది ప్రజాస్వామ్య మౌలిక లక్షణమని చెప్పారు. రాజ్యాంగ అవతారికలో ఉన్న 'ప్రజాస్వామ్య' అనే మాటలోని సారాంశం అతి విస్తృతమైంది, విశాలమైంది. కానీ నిరసన తెలపడాన్ని సహించలేని ప్రభుత్వాధినేతలు ఉద్యమాల్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు తెగబడుతున్నారు. అయినప్పటికీ విశ్వవిద్యాలయాల విద్యార్థులు అదరక బెదరక ముందు నిలవడం రాజ్యాంగస్ఫూర్తికి చిహ్నం.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనదని చెప్పుకుంటున్నాం. అలాగే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం. కానీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం రెండూ పెనుప్రమాదంలో పడిన విషాద సందర్భమిది. కనుకనే రాజ్యాంగం అమలవడం ఆరంభమయిన డెబ్బయ్యేళ్ళ అనంతరం రాజ్యాంగ పరిరక్షణకు విభిన్నవర్గాల ప్రజలు సమాయత్తమవుతున్నారు.
ఇదే సమయాన భారత రాజ్యాంగం బూర్జువా రాజ్యాంగమనే మాట వాస్తవం. అయినప్పటికీ ఇవాళ అదే రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడవలసి వస్తున్నది. రాజ్యాంగంలో ఒకవైపున బూర్జువా ఆస్తిహక్కు, దానిని కాపాడే పీడక చట్టాలూ వున్నాయి. ఇవి ధనికవర్గాల ప్రయోజనాల కోసమే రూపొందాయి. మరో వైపున ప్రజలకు పౌరహక్కులు, సమానత్వాన్ని ప్రసాదించే నిబంధనలు, వివక్ష తొలగించే సంస్కరణల చట్టాలు కూడా ఉన్నాయి. ఇవి రాజ్యాంగపు ఉదార పార్శ్వాన్ని సూచిస్తున్నాయి. అయితే మొదట్నించి బూర్జువా వర్గమే అధికారంలో వుంటున్నందున ఆస్తిహక్కు, సంపదల్ని పెంచుకునే హక్కు అమలయినంతగా, బలహీనవర్గాలకు మేలు చేసే విధానాలు అమలు కావడం లేదు. రాజ్యాంగంలోని ఉదార ప్రజాస్వా మిక పార్శ్వాన్ని తుడిచిపెట్టడమే హిందూత్వ పాలకుల కుట్రపూరిత వ్యూహం. అందుకే ఈ కుట్రల్ని ప్రతిఘటించడం, రాజ్యాంగ పరిరక్షణకు ప్రతిన బూనడం తప్పనిసరి. ఇది ప్రజాస్వామ్య విలువలు నమ్మేవారందరి కర్తవ్యం.