Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'షహీన్బాగ్'.. నిన్నటిదాకా ఇది ఢిల్లీ మహానగరంలోని ఓ మామూలు బస్తీ.. రెక్కాడితేగాని డొక్క నిండని సామాన్యుల ఆవాసం. కానీ నేడు ఎటుచూసినా త్రివర్ణ పతాకాలై రెపరెపలాడుతున్న ప్రశ్నల పూదోట..! రాజధాని నడిబొడ్డున ఈ దేశం గుండె చప్పుడు వినిపిస్తున్న దేశభక్తి పాట..!! ఇప్పుడది ఎముకలు కొరికే శీతాకాలపు చలిని కూడా లెక్కచేయక దిక్కులన్నిటినీ వెలిగి స్తోంది. గత నలభై రోజులుగా ముసలీ ముతకా పిల్లాపాపలతో రాత్రింబవళ్లూ రాజ్యం కుట్రలను ఛేదిస్తోంది.
''సీఏఏ సే ఆజాదీ
ఎన్నార్సీ సే ఆజాదీ
ఎన్పీఆర్ సే ఆజాదీ
బీజేపీ సే ఆజాదీ'' అంటూ మార్మోగుతున్న షహీన్బాగ్.. జనవరి 26న జాతీయ పతాకనెగరేసి.. కొన్నివేల కంఠాలతో రాజ్యాంగ పీఠికను నినదిస్తూ మన గణతంత్ర స్ఫూర్తి చాటిచెప్పింది. ఆ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్న ఏలికలకు హెచ్చరికగా నిలిచింది. అత్యంత సహజసిద్ధమైన, న్యాయబద్ధమైన ఈ శాంతియుత నిరసనోద్యమాన్ని అణచివేయడానికి వేసిన ఎత్తులేవీ ఫలించని ఏలికలకు.. షహీన్బాగ్ ఇప్పుడొక సవాలుగా నిలిచింది.
మొదట దీనిని కేవలం ఒక మతానికి చెందినవారి ఉద్దేశ్యపూరిత ప్రయత్నంగా పేర్కొంటూ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నించింది బీజేపీ ప్రభుత్వం. షహీన్బాగ్లో 40శాతంమంది ప్రజలు ముస్లింలే కావడాన్ని ఒక అవకాశంగా తీసుకుని ఈ దుష్ప్రచారానికి తెరతీసింది. మిగిలిన 60శాతంమంది ప్రజలలో మెజారిటీ హిందువులేనన్న సంగతి దాచింది. కానీ 'మీరు మీ రాజకీయాలకోసం మతం పేరుతో మమ్మల్ని ముక్కలు చేస్తే, మేం మా హక్కులకోసం మతాలకతీతంగా ఒక్కటిగా నిలుస్తాం..' అని నిరూపించింది షహీన్బాగ్. దీంతో కంగుతిన్న కమలనాథులు ఇది ప్రతిపక్షాల తెరవెనుక కుట్ర అంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు. కానీ తమ వెనుక ఎవ్వరూ లేరు, మేం ఎవరినీ ఆహ్వానించడం లేదు, తమంతట తాముగా వచ్చిన ఎవరినీ కాదనటంలేదు, కేవలం చట్టం ప్రజా వ్యతిరేకమైనది కాబట్టే వ్యతిరేకిస్తున్నాం అని ప్రకటించింది షహీన్బాగ్. ఈ ప్రకటనకు మద్దతుగా హిందూ ముస్లిం భాయీ భాయీ అంటూ కుల, మత, ప్రాంతాలకతీతంగా, రాజకీయపార్టీలకతీతంగా షహీన్బాగ్తో గొంతు కలిపింది ఢిల్లీ నగరం. అక్కడ జాతీయ జెండాలు, మహాత్మాగాంధీ, భగత్సింగ్, సుభాష్చంద్రబోస్, అంబేద్కర్వంటి మహామహుల చిత్రపటాల మధ్య ''భారత రాజ్యాంగ ప్రవేశిక'' ప్రముఖ స్థానాన్ని అలంకరించడం విశేషం. ఈ దేశాన్ని నడిపించడంలో మహిళలూ ముందుంటారని ఏనాడో చెప్పిన అంబేద్కర్ మాటలను నిజం చేస్తూ షహీన్బాగ్ ఉద్యమంలో మహిళలే నేతృత్వం వహించడం, ముక్కుపచ్చలారని పసిపాపలనుంచి పండు ముదుసలి వరకూ బీజేపీ పౌరచట్టాలను తూర్పారబడుతుండటం బీజేపీకి మింగుడుపడని విషయం. బలవంతంగా ఎత్తిపడేద్దామంటే అంతర్జాతీయ మీడియా అక్కడ మొహరించడంతో ఎటూ పాలుపోని స్థితి ప్రభుత్వానిది. ఈ పరిస్థితుల్లో వ్యాపారులకు, బాటసారులకు తీవ్ర ఆటంకం కలిగిస్తుందనే పేరుతో ఆ ఆందోళనా శిబిరాన్ని ఎత్తేయాలని చూసింది అధికార గణం. కానీ వ్యాపారులంతా స్వచ్ఛందంగా దుకాణాలు మూసుకుని నిరసనలో పాల్గొనడమేగాక నిరసనకారులందరికీ ఆహార పదార్థాలూ తాగునీరు అందిస్తూ తమ సంఘీభావాన్ని కొనసాగిస్తుండటంతో ఈ ఎత్తూ ఫలించలేదు. రహదారిలో వెల్లువెత్తుతున్న జనాలతో రాకపోకలకు ఇబ్బంది కలిగినా.. వాహనదారులంతా మరో మార్గాన్ని ఎంచుకుని తమ మద్దతు తెలియజేస్తుండటం ఈ నిరసనకు గల విశాల మద్దతుకు అద్దం పడుతోంది.
అయితే దక్షిణ ఢిల్లీని, ఉత్తరప్రదేశ్లోని నోయిడాను అనుసంధానించే ఆ ప్రధాన రహదారి స్తంభించడం పట్ల పోలీసులను చివాట్లు పెట్టిన న్యాయస్థానం, ప్రజల నిరసన హక్కులకు భంగం కలిగించరాదని చెప్పడం గమనార్హం. ఎప్పుడైనా ప్రజలను ఒప్పించి, మెప్పించి విరమింపజేయాలనే న్యాయస్థానాలు సూచిస్తాయి. కానీ ప్రజలను ఒప్పించడానికి వారడిగే ఏ ప్రశ్నలకు ఈ ఏలికల వద్ద సమాధానాలున్నాయి గనుక..! చీకటి కుట్రలూ కుతంత్రాలూ తప్ప..! అందుకే బీజేపీ పెద్దలు ఆది నుంచీ ఈ ఉద్యమానికి రాజకీయరంగు పులిమి తప్పించుకోజూస్తున్నారు. ఫలితంగా షహీన్బాగ్ తరహా నిరసనలు మరో 40 నగరాలకు విస్తరించాయి. నిన్నటి గణతంత్ర దినోత్సవాన షహీన్బాగ్లో పెల్లుబికిన ప్రజావెల్లువ వాటికి మరింత ఉత్తేజాన్నందించింది. జనవరి 26న యావద్భారతం ఒక దీక్షగా రాజ్యాంగ పీఠికను పఠించడం ఇందుకొక నిదర్శనం. ఈ పఠనం కేవలం ఒక సామూహిక నిరసన మాత్రమే కాదు, ఒక సమున్నత ఆశయ ప్రకటన.
సాధారణంగా రాజ్యాంగం అమలులోకొచ్చిన రోజుగా జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా, అధికారిక జాతీయ వేడుకగా ప్రభుత్వమూ ప్రజలూ కలిసి జరుపుకోవడం ఆనవాయితీ. అలాంటిది.. ప్రభుత్వం నుంచే రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ప్రజలు దీక్ష బూనాల్సిరావడం ఓ విషాదం. 70ఏండ్ల ప్రయాణం తరువాత ఏలికలే రాజ్యాంగం పాలిట పీడకులు కావడం వైచిత్రి! ఏ రాజ్యాంగం నిర్దేశించిన శాసనాల ద్వారా అధికారం చేపట్టారో, ఆ రాజ్యాంగాన్నే చెరబట్టి, ప్రజాసామ్యంపై పగబట్టి, విద్వేషాలను మోసుకు తిరుగుతున్న వికృత సమూహాల మధ్య.. ఈ దేశాన్ని నిలబెట్టుకోవడానికి ఓ పోరాటమై మొలిచింది షహీన్బాగ్. ఒక ప్రతిఘటనా స్వరమై నిలిచింది షహీన్బాగ్. ఎందరో అమరుల త్యాగాల ఫలమైన ఈ నేలను కాపాడుకోవడానికి... ఇప్పుడు వేల షహీన్బాగ్లు కావాలి.