Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో పేరొందిన ప్రభుత్వరంగ సంస్థల్లో ఒకటైన ఎయిరిండియా కనుమరుగు కాబోతోంది. ఇకపై దానిని చరిత్ర పుస్తకాల్లో మాత్రమే చూసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వరంగాన్ని నిర్వీర్యం చేస్తూ నిత్యం ప్రయివేటు జపం చేస్తున్న మోడీ సర్కార్.. ఎయిరిండియాను పూర్తిగా అమ్మేయాలని నిర్ణయించింది. 2018లో ఖరారు చేసిన 76శాతం వాటా విక్రయించేందుకు ముందుకు ఎవరూ రావడం లేదని.. సంస్థను గంపగుత్త(వందశాతం వాటా)గా అమ్మేయడానికి ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు బిడ్లను ఆహ్వానిస్తూ కేంద్రప్రభుత్వం సోమవారం ప్రకటన జారీ చేసింది. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్లో వందశాతం, సింగపూర్ ఎయిర్లైన్స్తో కలిసి నిర్వహిస్తున్న సంయుక్త సంస్థ (ఏఐఎస్ఏటీఎస్)లో ఉన్న 50శాతం వాటాను పూర్తిగా విక్రయించాలని నిర్ణయించినట్టు కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. ఈ ఏడాది మార్చి 17లోగా బిడ్లు దాఖలు చేయడానికి అవకాశమిచ్చింది. ఎయిరిండియా బ్రాండ్ను కొనసాగించాలన్న నిబంధనకూ ప్రభుత్వం తిలోదకాలిచ్చేసింది. బిడ్డింగ్లో సంస్థలను చేజిక్కించుకునే కొనుగోలుదారుడు తమకు నచ్చిన పేరును పెట్టుకునే అవకాశాన్ని కల్పించింది. అంతేగాకుండా కొనేవారికి రుణభారాన్ని, బకాయిలను భారీగా ఆఫర్లు ప్రకటించింది. ఇంతచేసినా కొనుగోలుదారు కేవలం రూ. 223.286 కోట్ల రుణాలను చెల్లిస్తే సరిపోతుంది. నిపుణులు, మేధావులు, ఆర్థికవేత్తలు సూచించినట్టు ఆ రుణభారాన్ని, బకాయిలను, పన్నులను కేంద్రమే భరిస్తే ఎయిరిండియాకు ఎలాంటి నష్టాలూ ఉండేవి కావు. ఐదేండ్ల కాలవ్యవధిని ఇచ్చినట్టయితే సంస్థ ఆర్థికంగా బలోపేతం అవుతుందన్న ఆర్థికవేత్తల సలహాల్ని పెడచెవిన పెట్టడం గమనార్హం. అంటే, ప్రభుత్వరంగ సంస్థల్ని ఒక్కొక్కటిగా ప్రయివేటుపరం చేసి కార్పొరేట్ల కొమ్ముకాయడమే మోడీ సర్కార్ ఆలోచనగా కనిపిస్తోంది.
బీజేపీ అనుసరిస్తున్న ఉదారవాద ఆర్థిక విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనమైంది. పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికల అమలులో భాగంగా 2020 మార్చి నాటికి ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటుపరం చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఇప్పటికే బీపీసీఎల్లో ప్రయివేటుకు ద్వారాలు తెరిచిన మోడీ సర్కార్.. అదే బాటలో మిగతా సంస్థలకూ మంగళం పాడేందుకు వేగంగా పావులు కదుపుతున్నది. పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ప్రజల ఆస్తుల్ని దోచిపెట్టే క్రతువును నిరాఘాటంగా సాగిస్తున్నది. ఆ క్రమంలోనే ఇప్పుడు ఎయిరిండియా ప్రయివేటుకు కట్టబెడుతోంది. సరళీకరణ, ప్రయివేటీకరణ విధానాలతో ఇప్పటికే అపారంగా సంపద పోగేసుకున్న కార్పొరేట్లకు ఎయిరిండియా యాజమాన్య హక్కులను అప్పగించడమంటే దేశ సంపదను దోచిపెట్టడమే. గత ఆరేండ్లుగా తీసుకుంటున్న నిర్ణయాలన్నీ ప్రజలకోసమేనని చెప్పుకుంటున్నా.. వాటివల్ల లాభపడింది నిజంగా కార్పొరేట్లే. దేశం ఆర్థికమాంద్యంలో ఉంటే ఆర్థికవ్యవస్థను పెంచే రీతిలో నిర్ణయాలు తీసుకోవల్సిన కేంద్రం.. ఏకపక్షంగా పెట్టుబడిదారులకు, విదేశీ బహుళజాతి సంస్థలకు విచ్చలవిడిగా రాయితీలు కల్పించింది. కోట్లాది రూపాయలను అప్పనంగా అందజేసినా దేశానికి గానీ, ప్రజలకు గానీ ఒరిగింది శూన్యం. ఎయిరిండియాను ప్రయివేటుపరం చేయాలని 2017లోనే నిర్ణయం జరిగింది. ఆ తర్వాత నిటి ఆయోగ్ సిఫార్సులు చేయడం, వెంటనే కేంద్రం నిర్ణయం తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. ఉద్యోగులు, కార్మిక సంఘాలు వ్యతిరేకించడంతో.. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని మాయమాటలతో సరిపెట్టింది.
ఏ సంస్థను ప్రయివేటుకు కట్టబెట్టాలన్నా ఆ సంస్థలో నష్టాలను సాకుగా చూపడం ప్రభుత్వానికి రివాజుగా మారింది. ఎయిరిండియా విషయంలోనూ అదేపని చేసింది. ప్రయివేటు ఎయిర్లైన్స్కు రాని నష్టాలు ప్రభుత్వరంగ ఎయిర్లైన్స్లకే ఎందుకొస్తున్నాయో చెప్పేందుకు పాలకులు ముందుకు రావడం లేదు. పాలకుల నిర్ణయాలే ఇందుకు కారణమన్న నిజాన్ని దాచే ప్రయత్నమిది. మాంద్యం రావడానికి కారణమైన వారికి అనేక రాయితీలు సమకూర్చిన పాలకులు, తిరిగి వారికే సంస్థను కట్టబెట్టాలనుకోవడం విచిత్రం. ఇది జాతి వ్యతిరేకమైన నిర్ణయమని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి, మరికొందరు అధికారపార్టీ నేతలు చెబుతున్నా ఏలికల చెవికెక్కడం లేదు. 2007 వరకు మంచిలాభాల్లో ఉన్న ఎయిరిండియాకు, ఆ తర్వాత నష్టాలు రావడానికి సర్వీసుల విస్తరణ, పాత విమానాల స్థానంలో కొత్తవి కొనుగోలు చేయకపోవడం, గత పాలకులు అనుసరించిన విధానాలు కారణం. ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని అప్పులను చెల్లించి 2015-16, 2016-17 కాలంలో రూ. 300 కోట్ల మేర లాభాలార్జించిన ఎయిరిండియాను మోడీ ప్రభుత్వం అమ్మేయాలనుకోవడం దుర్మార్గం..
ప్రపంచదేశాల్లో ఎయిర్లైన్స్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలనే ప్రభుత్వాలు కోరుకుంటున్నాయి. అందుకు భిన్నంగా భారత ప్రభుత్వ ఎయిర్లైన్స్ను అమ్మేయడం వల్ల పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉం టాయి. ప్రజల ఆస్తులతో పాటు ఉద్యోగుల హక్కులు, సామాజిక భద్రత, ప్రయాణికుల భద్రత గాలిలో కలిసిపోతాయి. జవాబుదారీతనం ఉండదు. ఈ చర్యను కేవలం కార్మిక సంఘాలే కాదు.. ప్రజలంతా వ్యతిరేకించాలి.