Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నార్సీ, సీఏఏ, ఎన్పీఆర్పై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రావడం ఆహ్వానించదగినది. రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేస్తామని సీఎం ప్రకటించడం శుభపరిణామం. ముఖ్యమంత్రి కేసీఆర్ తొలుత అనుసరించిన దోబూచులాట , వేచిచూసే ధోరణీ అనుమానాలకు తావిచ్చినట్టయింది. మున్సిపల్ ఎన్నికల అనంతరమే పార్టీ, ప్రభుత్వ విధానాన్ని మీడియాకు స్పష్టంచేయడం గమనార్హం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని వెలెత్తి చూపుతూ ''ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించలేని మోడీ సర్కార్, ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే హిందూ, ముస్లిం, ఇతర మతాల మధ్య విభేదాలను సృష్టించి పబ్బం గడుపుకోజూస్తున్నదంటూ'' విమర్శల బాణం ఎక్కుపెట్టారు. ఇది వాస్తవం కూడా. ఎన్నార్సీ, సీఏఏ, ఎన్పీఆర్ ఒకదానికొకటి సంబంధం లేదంటూనే వచ్చే ఏప్రిల్ ఒకటి నుంచి ఎన్పీఆర్ను అమల్లోకి తెచ్చే కుట్రకు బీజేపీ అధికారికంగానే శ్రీకారం చుట్టింది. ఇందుకు కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషనే సాక్ష్యం. కొంత ఆలస్యంగానైనా గులాబీ ప్రభుత్వం పౌరసత్వచట్ట సవరణపై సరైన అడుగేసింది. అవసరమైతే ఎన్నార్సీ, సీఏఏ, ఎన్పీఆర్ వ్యతిరేక ఉద్యమానికి నాయత్వం వహిస్తాననీ, ఇందుకు కాంగ్రెస్ మద్దతిస్తే తీసుకుంటాననీ, ప్రకటించడం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాలకు ఊతమిచ్చినట్టయింది.
లౌకిక దేశం కోసం ఎవరితోనైనా కలవడానికి సిద్ధమని చెప్పడం ప్రజలకు ధైర్యాన్నిచ్చే మాటే. ఇప్పటికే ఎన్నార్సీపై కేరళ, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమబంగా తదితర రాష్ట్రాలు అసెంబ్లీల్లో తీర్మానాలు చేసి అక్కడి ప్రజలకు భరోసానిచ్చాయి. తొలి రాష్ట్రం సీపీఐ(ఎం) నేతృత్వంలోని కేరళనే. అక్కడి వామపక్ష ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజలంతా గణతంత్ర దినోత్సవాన 620 కిలోమీటర్ల మేర మానవహారంతో నిరసనకు దిగారు. దేశవ్యాప్త ఆందోళనకు ఊపిరులూదారు. సంచలనాన్ని సృష్టించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నార్సీకి వ్యతిరేకంగా ఉద్యమాలు, పోరాటాలు ఉధృతమయ్యాయి. వాటికి ప్రభుత్వం సానుకూలంగా సహకరించి నికరంగా నిలబడాల్సిన సమయమిది. పార్లమెంటులో వ్యతిరేకంగా ఓటేసిన టీఆర్ఎస్, రాష్ట్రంలోని పార్టీలు, ప్రజాసంఘాలు, మానవ హక్కుల సంస్థలు చేపడుతున్న ఉద్యమాలకు అనుమతులు నిరాకరిస్తుండటం అన్యాయం. విధానం అనేది అందరిపట్లా ఒకేలా ఉండాలి. పరిస్థితులకు అనుగుణంగా పనిచేయడం అవకాశవాదమవుతుంది.
దేశం అట్టుడుకుతున్నా బీజేపీకి పట్టడం లేదనీ, అనైక్యతను సృష్టిస్తుందనీ, సీఏఏను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని కొట్టేయాలనీ, త్వరలోనే ప్రాంతీయ పార్టీల సీఎంలతో సమావేశం పెడతానని చెప్పిన ముఖ్యమంత్రి, రాష్ట్రంలో ఎన్నార్సీ, సీఏఏ, ఎన్పీఆర్కు వ్యతిరేకంగా జరిగే పోరాటాలను అణచివేయడం ఆశ్చర్యకరం. అనుమానాలకు ఆస్కారమేర్పడుతున్నది. దేశంలో ఉన్నది సైనిక ప్రభుత్వం కాదనీ, ప్రజాస్వామ్య సర్కారని వ్యాఖ్యానించిన సీఎం, రాష్ట్రానికి బీజేపీ రూ. 5 వేల కోట్ల పన్ను బకాయిలు ఇవ్వాలనీ, సమస్యలనూ పరిష్కరించడం లేదని చెప్పడం విశేషం. బీజేపీతో దేశఆర్థిక వ్యవస్థ సర్వనాశనమవుతున్నదంటూ చేసినా విమర్శా సహేతుకమే. రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్న బీజేపీ తెచ్చిన ఎన్నార్సీ అనుకూల చట్టంపై భావసారూప్యం కలిగి, కలిసొచ్చే ఇతర పార్టీలతో జట్టుకట్టి, ఇప్పటికే ప్రకటించినట్టుగా శాసనసభలోనూ తీర్మానించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఉద్యమంలో ముందుకొచ్చిన దాదాపు 12 ఇతర రాష్ట్రాలతో కలిసి ప్రయాణిస్తే సత్ఫలితాలు వచ్చే వీలుంది. సమాజంలో అనుమానాలు, అభద్రత, భయాందోళనలు ఎక్కువకాలం నిలవడం, దేశంలోని ఆయా రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరదు. ప్రజాగ్రహాన్ని, రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని బీజేపీ భావించడం లేదు. ఇందుకు ఇటీవల ఉత్తరప్రదేశ్లోని లక్నోలో హోంమంత్రి అమిత్షా 'ఆరునూరైనా పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలుచేసి తీరుతామంటూ' చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. కేంద్రం చేపట్టిన ఎన్పీఆర్ ప్రక్రియకు, చట్టానికి వ్యతిరేకంగా, ప్రజలకు మద్దతుగా కేరళ, పంజాబ్ రాష్ట్రాలు దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఆ దిశగా కేసీఆర్ ప్రభుత్వమూ ఎజెండా చేయాలి. కేరళ తరహాలో పోరాటానికి సిద్ధపడాలి. ఇదిలావుండగా కాంగ్రెస్ ఇటీవల కాలంగా చేస్తున్న పనులు, చేష్టలు అవకాశవాదానికి పరాకాష్ట. మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ వ్యవహరించిన తీరు ఇందుకు అద్దంపడుతున్నది. స్థానిక అవగాహన మేరకు బీజేపీకి వ్యతిరేకంగా పోటీచేసి, చైర్మెన్ స్థానానికి వచ్చేసరికి ప్లేటు ఫిరాయించడం గమనార్హం. లౌకితత్వమే తన ఎజెండాగా చెప్పుకున్న ఆ జాతీయ పార్టీ, పదవుల కోసం బీజేపీతో జతకట్టడం, అడ్డదారులు తొక్కడం ఆందోళన కలిగించే అంశం. తాను బీజేపీ చంకలో దూరటంతోపాటు, సీపీఐ(ఎం) కూడా తమ అపవిత్ర కలయికకు మద్దతునివ్వాలని కోరుకోవడం విడ్డూరం. బీజేపీని ఓడించాలన్న సూత్రబద్ధ విధానమే సీపీఐ(ఎం) పాటించింది. ఇది గిట్టని కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు చౌటుప్పల్లో సీపీఐ(ఎం) కౌన్సిలర్లు, వారి ఆస్తులపై భౌతికదాడులు చేయడం ఎంతమాత్రం సహించరానిది. ప్రజసామ్యబద్ధంగా జరిగిన ఎన్నికలను అపహాస్యం చేసి గూండా రాజకీయాలను ప్రోత్సహించేలా వ్యవహరించడం సరికాదు.