Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత శుక్రవారంనాడు ఇరాక్ నుంచి అమెరికా సైన్యం వైదొలగాలని రాజధాని బాగ్దాద్లో దాదాపు 20లక్షల ప్రజలు నిరసన ప్రదర్శన చేశారు. ఇరాకీ జాతీయ పతాకాలను చేబూని 'ఆక్రమణదారూ.. వెళ్లిపో, వెళ్లిపో', 'అమెరికాకు చావు తప్పదు' అనే నినాదాలతో హౌరెత్తించారు. కొందరు సాయుధ ప్రతిఘటన గుర్తులను, మరికొందరు ఆత్మార్పణకు సంకేతమైన తెల్ల టోపీలను ధరించారు. ఇరాక్లో అమెరికా సాగించిన దమనకాండ కారణంగా రగిలిపోతున్న ప్రజల ఆగ్రహం ఆ ప్రదర్శనలో వ్యక్తమైంది. మిలియన్ మార్చ్'గా అభివర్ణించిన ఈ ప్రదర్శన షియా మతపెద్ద మోఖ్తాదా అల్-సదర్ ఆధ్వర్యంలో నడిచింది. ఇరాక్ ప్రభుత్వంలోని ఒక బలమైన వర్గానికి సదర్ నాయకత్వం వహిస్తున్నాడు.
ఈ ప్రదర్శనలో కార్మికులు, యువత పాల్గొన్నారు. వీరందరి జీవితాలు సామ్రాజ్యవాదం చేసిన నేరాలతో ప్రభావితమాయ్యాయి. 1990-1991లో జరిగిన మొదటి పర్షియన్ యుద్ధం నుంచి 2003లో మానవ హనన ఆయుధాలున్నాయన్న అబద్ధం ఆధారంగా అమెరికా ఇరాక్పై చేసిన అమానుష యుద్ధందాకా జరిగిన యుద్ధాలలో 10లక్షలమందికిపైగా ఇరాకీ ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ చివరి యుద్ధాన్ని 'సామాజిక హననం'గా విజ్ఞులు పేర్కొన్నారు. మధ్యప్రాచ్యంలో ఆరోగ్య సంరక్షణ, విద్య, ఇతర మౌలిక సామాజిక సూచికల్లో అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా వున్న ఇరాక్ అమెరికా సైనిక పదఘట్టనలో నేలమట్టమైంది. ఇప్పటికీ ప్రజాజీవితంపై అమెరికా క్రూరదాడి ప్రభావం కనపడుతుంది.
ఈ సుదీర్ఘ రక్తచరిత్రకు వ్యతిరేకంగా ప్రజలలో గూడుకట్టుకున్న ఆగ్రహం ఇరానీ సైనికాధికారి, షియా మిలీషియాల నాయకుడు ఖాస్సెమ్ సులేమానీని అమెరికా హత్య చేసిన సందర్భంగా ఒక్కసారిగా వెల్లువెత్తింది. ఇరాన్, సౌదీ అరేబియా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని చల్లబరిచేందుకు ఇరాక్ ప్రధాని అబ్దుల్ మెహదీ ఆహ్వానం మేరకు బాగ్దాద్ వచ్చిన సులేమానీని, అల్-ముహాదిస్తో పాటు మరో ఎనిమిదిమంది ఇరాకీ, ఇరానీయన్లను ఎటువంటి కారణం లేకుండా జనవరి 3న బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంతంలో అమెరికా డ్రోన్ క్షిపణులను ఉపయోగించి హత్యచేసింది. ఇది ఇరాన్కు వ్యతిరేకంగా యుద్ధప్రకటన చేయటంతో సమానమవుతుంది. ఈ రాజకీయ హత్యలతో అమెరికా ఇరాక్ సార్వభౌమాధికారంపై దాడిచేయటమే కాకుండా యావత్ ప్రపంచాన్ని ఒక వినాశకరమైన యుద్ధం అంచుకు నెట్టింది.
అమెరికా చేసిన ఈ హత్యాకాండ తరువాత ఇరాకీ పార్లమెంట్ రెండు రోజులపాటు సమావేశమై అమెరికా సైనిక దళాలను దేశంనుంచి బహిష్కరించాలని ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీనికి అనుగుణంగా జనవరి 9న అబ్దుల్ మహది అమెరికా దళాల ఉపసంహరణ షరతుల్ని చర్చించటానికి ఒక ప్రతినిధుల బృందాన్ని పంపాలని అమెరికాకు ఒక అభ్యర్దన పంపాడు. ఈ అభ్యర్దనకు 'మా వ్యయం తిరిగి చెల్లిస్తేనే మేము మీ దేశాన్ని వీడతాం' అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన సమాధానం సామ్రాజ్యవాద దురహంకారాన్ని ప్రతిబింబిస్తుంది. అంతేకాకుండా ఇరాక్కు వ్యతిరేకంగా తీవ్రమైన ఆంక్షల్ని విధించటం జరుగుతుందని ట్రంప్ బెదిరించాడు. అలాగే న్యూయార్క్లోని ఫెడరల్ రిజర్వ్బ్యాంక్ అకౌంట్లో వున్న 35బిలియన్ డాలర్లను వినియోగించుకోకుండా చేస్తామని, దానితోపాటు ఫైనాన్షియల్గా ఇరాక్ను దిగ్బంధంచేసి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలేలా చేస్తామని కూడా ట్రంప్ బెదిరించాడు.
గత మూడు దశాబ్దాలలో అనేక మధ్యప్రాచ్య దేశాల ఆంతరంగిక వ్యవహారాలలో అమెరికా జోక్యం చేసుకోవటం దాని నయా వలసవాద స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. 'టెర్రరిజంపై యుద్ధం', 'మానవ హక్కులు', 'మానవ హనన ఆయుధాలు', 'ప్రజాస్వామ్య పరిరక్షణ'ల వంటి సాకులతో అమెరికా ఈ దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకుంది. ఐసీస్ ఉగ్రవాదుల్ని తుదముట్టించాలనే సాకుతో ఆరువేలమంది అమెరికా సైనికులు ఇరాక్లో తిష్టవేశారు. సిరియాలో అసద్ ప్రభుత్వాన్ని కూలదోయటానికి అమెరికా ప్రేరేపించిన అంతర్యుద్ధంలో పాల్గొన్న అల్ ఖైదా నుంచి పుట్టిపెరింగిందే ఈ ఐసీస్. 2014లో సిరియా నుంచి తూర్పు దిశగా పయనించి ఇరాక్లో మూడవ వంతు భూభాగాన్ని ఐసీస్ ఆక్రమించింది. 'ఐసీస్పై యుద్ధం'లో ఇరాక్లోని అన్బార్ రాష్ట్రంలోని అనేక పట్టణాలతోపాటు రెండవ అతిపెద్ద నగరం మోసూల్ పూర్తిగా నాశనమైంది. అనేక వేలమంది ప్రజలు ప్రాణాలను, లక్షలాదిమంది తమ ఆవాసాలను కోల్పోయారు.
ఐసీస్తో ఇప్పుడు ప్రమాదంలేదని, ఇరాన్ ప్రభావిత ఇరాకీ షియా మిలీషియాలే నేడు ఇరాక్లో ప్రధాన శత్రువులని అమెరికా సైనికాధికారులు అంటున్నారు. నిజానికి ఐసీస్కి వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడింది ఈ షియా మిలీషియాలే. ఈ పేరుతో ఇరాక్లో శాశ్వతంగా తిష్టవేసి ఇరాక్లోను, సిరియావంటి మధ్యప్రాచ్య దేశాల చమురు వనరులను దోచుకోవాలని అమెరికా ప్రయత్నిస్తోంది. అమెరికా కొనసాగిస్తున్న ఈ దాష్టీకానికి వ్యతిరేకంగా ఇరాక్ ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. నిరంతరం కొనసాగుతున్న ఈ నిరసన ప్రదర్శనలలో ఇప్పటివరకు 600మంది చనిపోయారు. ఇరాక్ నుంచి అమెరికా వైదొలగకుండా అక్కడ కనీస ప్రజాస్వామ్యం మాట అటుంచి కనీసం తమకు నచ్చిన శక్తులను పాలకులుగా ఎంచుకునే అవకాశం కూడా ఇరాక్ ప్రజలకు ఉండదు. అంటే అంతిమంగా అమెరికా సామ్రాజ్యవాదాన్ని నిర్వీర్యం చేయకపోతే మధ్యప్రాచ్యంలో ముఖ్యంగా ఇరాక్ ప్రజాజీవితంలో శాంతి నెలకొనజాలదు.