Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ శనివారం ప్రవేశపెట్టిన కేంద్రబడ్జెట్ సంపదసృష్టికర్తల పేరుమీద సంపన్నుల చుట్టూ తిరిగింది. సంపద సృష్టిస్తే పంపకం సాథ్యమవుతుంది. పంపకం కోసం సంపద సృష్టించాలి. అందుకు మార్కెట్ మీద ఆధారపడాలి. కాబట్టే మేము మార్కెట్ అనుకూల బడ్జెట్ తీసుకొచ్చామని అంటున్నారు పాలకులు. వ్యాపారాన్ని సులభ తరం చేయాలనే పేరుమీద, వ్యాపారులకు అనుకూలమైన నిర్ణ యాలు తీసుకుంటున్నారు. ఇదే 2020 బడ్జెట్లో కీలకాశం. పెట్టు బడులకోసం ప్రయివేట్ సంస్థలను ఆశ్రయిస్తున్న పాలకులు బ్యాంకు లను ప్రయివేటీకరించడం, ఎల్ఐసీ నుంచి పెట్టుబడులను ఉప సంహరించడంలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. మరోవైపు పెట్టుబడిదారులకు పన్నులను గణనీయంగా తగ్గిస్తూ ప్రతిపాదించారు. తయారీ రంగంలో కొత్తగా పెట్టుబడి పెడుతున్నవారికి 15శాతం, ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన వారికి 22శాతానికి పన్నులు తగ్గించారంటే పాలకులకు పెట్టుబడిదారులపై ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇపుడు 1 శాతం సంపన్నుల వద్ద దేశంలోని అధిక సంపద పోగుపడుతూ ఉంది. ఆ సంపన్నుల నుంచి పన్నులు వసూళుచేసి ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడం అవసరం. న్యాయం కానీ పాలకులు ఆపని చేయకుండా పేదల మూల్గులు పీల్చుతున్నారు.
దేశంలో ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయిందనీ, ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిందనీ శుక్రవారం వెలువడిన ఎకనమిక్ సర్వే తేల్చింది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గితే సరుకుల అమ్మకాలు తగ్గిపోతాయి. సరుకుల అమ్మ కాలు తగ్గితే ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంది.అయినా, బడ్జెట్లో మాత్రం ప్రజల కొనుగోలు శక్తిని పెంచే ప్రతిపాదన ఒక్కటి కూడా లేదు. ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడానికి 1) సగటు ఆదాయం పడిపోతుండటం 2) 46 ఏండ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం ఇప్పుడు తాంవిస్తుండం 3) విద్యకార్పొరేటీకరణ 4) వైద్యం కార్పొరేటీకరణ 5) ధరల పెరుదలలు ప్రధానకారణాలు . ఈ కారణాల వల్ల ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయి, దేశం ఆర్థిక మాద్యం కోరల్లో చిక్కుకుంది. దేశాన్ని ఆర్థిక మాద్యం నుంచి గట్టెక్కించగల సరైన చర్యలను బడ్జెట్ తీసుకోలేకపోయింది.అసలు ఆవైపు ప్రయత్నమే లేదు. పారిశ్రామిక వేత్తలు సంపద సృష్టిస్తారనీ, మనం మార్కెట్ను నమ్మాలనీ పాలకులు చెబుతున్నారు.సంపద సృష్టి పేరుతో పారిశ్రామిక వేత్తలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు, దేశ సంపదను దోచిపెడుతున్నారు. ఉదారవాద ఆర్థిక విధానాలు అమలవుతున్న గత 30ఏండ్ల కాలంలో ఏపార్టీ ప్రభుత్వమున్నా జరిగింది ఇదే. ఇందుకు మోడీ ప్రభుత్వ మినహాయింపేమీ కాదు సరికదా గత ప్రభుత్వాలను మించిపోయి పారిశ్రామికవేత్తల కొమ్ముకాస్తోంది.ఈ విధానాల ఫలితమే దేశం ఆర్థిక మాద్యం వైపు పయనించడం.
మార్కెట్కు ఆటంకం కలుగకూడదనే పేరుతో-బడా బాబులకు రాయితీలతోపాటు, భారీగా పన్నులు తగ్గిస్తోన్న ప్రభుత్వం, మరోవైపు కార్మిక చట్టాలను తిరగతోడుతోంది. కార్మికులకు రక్షణగా ఉన్న చట్టాలను మార్చి వారిని పెట్టుబడిదారుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడక తప్పని దుస్థితికి చేర్చుతోంది. ఇంకోవైపున విదేశీ పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచింది. తన బడాబాబులకు అనుకూల, ప్రజా వ్యతిరేక విధానాలను మరింత చురుకుగా, విస్తృతంగా అమలు చేస్తామని పాలకులు బహిరంగంగా చెబుతున్నారు. ఇదేగనుక జరిగితే రానున్న రోజులలో దేశం మరింత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయం. ఆర్థిక సంక్షోభానికి ఒక పరిష్కారం దొరకడం అసాధ్యం. మార్కెట్ను విశ్వసించాలని పదేపదే చెబుతున్న పాలకులు, పెట్టుబడిదారులకు రాయితీలు అధికం చేస్తూ, వారిపై ప్రభుత్వ నియంత్రణ తగ్గించేస్తున్నారు. ప్రభుత్వ జోక్యం తగ్గించే పేరుతో ధరల నియంత్రణకు ఉపయోగపడే నిబంధనలను బలహీనపరచడమే జరుగుతున్నది వనరులపై ప్రభుత్వ నియంత్రణ లేకుండా చేసి పారిశ్రామికవేత్తలకు పూర్తి స్వేచ్ఛ ప్రయత్నం చేస్తున్నారు. పారిశ్రామిక వేత్తలు ఆడిందే ఆట, పాడిందే పాటగా తయారై కార్మికులు మరింత శ్రమ దోపిడీకి గురవుతున్నారు. 5నుంచి 15 లక్షల లోపు వేతనమున్న కొద్దిమంది వేతన జీవులకు పన్ను తగ్గింపునిచ్చిన మోడీ ప్రభుత్వం పేద ప్రజలపై ఏకంగా యుద్ధమే ప్రకటించింది. బడ్జెట్ పేరుతో మొదలైన ఈ యుద్ధం 130 కోట్ల జీవితాలతో చెలగాటమాడుతోంది.
బడాబాబులకు పన్ను రాయితీలు ఇస్తే ప్రభుత్వానికి రాబడి ఎలా వస్తుంది? ఇందుకు మిగిలిన మార్గం ప్రజలపై పన్నుల భారం మోపడం. భారాలతో ప్రజలను బాదడం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడం. ఇప్పుడు మోడీ ప్రభుత్వం అదే చేస్తోంది. ఇకముందు మరిన్ని భారాలు మోపనున్నారు. దీంతో ధరలు చుక్కలనంటుతాయి. రాబోయే రోజుల్లో ధరలు మరింతగా పెరిగి ప్రజల జీవితాలు నరకప్రాయం కావడం ఖాయం. ఈ నేపథ్యంలో ప్రజల సంఘటిత ప్రతిఘటనాశక్తి మాత్రమే వారిని రక్షించగలదు. అన్ని వర్గాల ప్రజలు ఏకమై ఎక్కడికక్కడ ప్రతిఘటించాలి. ప్రజాఉద్యమాలను ఉధృతం చేయాలి.