Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజల నమ్మకమే పెట్టుబడిగా ముందుకు సాగుతున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ). ఐదు కోట్ల ప్రభుత్వ పెట్టుబడితో ప్రారంభమైన ఎల్ఐసీ దినదినాభివృద్ధి చెందుతూ ఈ రోజు దేశంలోనే బలమైన ఆర్థికశక్తిగా నిలిచింది. 11 లక్షలా 48 వేల 811 మంది ఏజెంట్లు, 15 వేలమంది డెవలప్మెంట్ ఆఫీసర్లు, లక్షమంది ఉద్యోగులతో సుమారు 40 కోట్లమంది పాలసీదారులకు సేవలందిస్తూ భారతీయుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న సంస్థ రూ.31 లక్షల కోట్ల ఆస్తుల్ని కలిగి ఉంది. దేశంలోని ఏ సంస్థకూ ఇన్ని ఆస్తుల్లేవ్. ఆసియా ఖండంలోని ఏ ప్రభుత్వ బీమా కంపెనీకి ఇంత పెద్దమొత్తంలో ఆస్తుల్లేవ్. ఆర్థికమాంద్యాన్ని కూడా తట్టుకుని నిలబడి పాలసీదారుల చేత శభాష్ అనిపించుకుంటున్న ఏకైక ప్రభుత్వరంగ సంస్థ ఎల్ఐసీ. ఏ రోజూ ప్రభుత్వాన్ని ఒక్కపైసా చేయిచాచి అడిగిందీ లేదు. ప్రభుత్వానికే ఆర్థిక అండదండలు అందించింది. నష్టాల్లో మునిగిన రైల్వే వంటి సంస్థల్ని తన నిధులతో బతికించి సంస్థ ఔన్నత్యాన్ని నలుదిశలా చాటింది. బీమారంగంలో ఎన్ని ప్రయివేటు సంస్థలొచ్చినా.. ఎల్ఐసీని అందుకోలేక పోయాయంటే అది ప్రజలకు ఎంత చేరువైందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎల్ఐసీ ఒక బంగారు బాతు. అటువంటి బాతుని స్టాక్ మార్కెట్లో ప్రవేశపెట్టబోతున్నట్టు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించారు. ఆర్థికమాంద్యంతో దేశం అల్లకల్లోలంగా ఉంటే, దాని నుంచి ఎలా గట్టెక్కాలన్నది ఆలోచించకుండా మూడు పువ్వులూ ఆరు కాయలుగా సాగుతున్న ఎల్ఐసీలో వాటాలను విక్రయించబోతున్నట్టు చెప్పడం ఆందోళన కలిగించే అంశం. ఇప్పటికే ఎయిరిండియా, భారత్ పెట్రోలియం వంటి ప్రభుత్వరంగ సంస్థల వాటాల విక్రయానికి నిర్ణయం తీసుకున్న మోడీ సర్కార్.. అత్యంత లాభాల్లో ఉన్న సంస్థలోనూ ప్రయి'వేటు'ను వేయడం కేంద్రం బరితెగింపునకు నిదర్శనం. ఇటువంటి నిర్ణయం కోట్లమంది పాలసీదారులకే కాదు. 130 కోట్లమంది ప్రజలకూ తీవ్రనష్టమే.
మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్లను తప్ప ప్రజలందర్నీ నిరాశకు గురిచేసింది. ఇప్పటికే కార్పొరేట్లకు ఆర్బీఐ నుంచి కోట్లాది సొమ్ము అందజేయడంతో పాటు లక్షల కోట్ల రాయితీలను అందజేసిన మోడీ సర్కార్కు.. ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాలన్న సోయి బడ్జెట్లో కనిపించలేదు. తగ్గుతున్న రెవెన్యూభర్తీకి వనరుల సమీకరణ, డిమాండ్ పెంపుదల వంటి సమస్యలకు అవసరమైన కార్యాచరణే లేదు. సామాన్యులకు ఊరటనిస్తూ ఒక్క కార్యక్రమాన్ని కూడా అమలుచేయలేదు. పైకెన్ని తీయని కబుర్లు చెప్పినా అవేవీ సంక్షోభ నివారణకు ఉపయుక్తంగా లేవు. ఆర్థిక మాంద్యంతో రైతులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఆసక్తి చూపిందెక్కడీ పైగా కార్పొరేట్లను ప్రపంచ కుబేరుల్లో నెంబర్వన్ స్థానంలో నిలిపేందుకు మాత్రం ఎక్కడా లేని ఉత్సాహాన్ని ప్రదర్శించటం ప్రభుత్వ ఉద్దేశాన్ని తేటతెల్లం చేస్తోంది. 2019-20కి రెవెన్యూ రూ.24.6 లక్షల కోట్లుగా బడ్జెట్లో అంచనా వేసి.. సవరించిన అంచనాల్లో రూ.21.6 లక్షల కోట్లుగా చూపారు. ఈ లెక్కన 3 లక్షల కోట్లు అనుకున్న దానికన్నా ఆదాయం తగ్గిందనేది ఆర్థికవేత్తల అంచనా. ఇది అంచనా కన్నా 12శాతం ఎక్కువ. ద్రవ్యలోటు పూడ్చుకోవడం కోసం ఈ ఏడాది బడ్జెట్లో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని కేంద్రం రూ.2.1 లక్షల కోట్లకు పెంచింది. ఆ ప్రయత్నంలో భాగమే ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల్ని అమ్మడం. వాస్తవానికి ఎప్పట్నుంచో కార్పొరేట్ల కన్ను ఎల్ఐసీపై పడింది. వారి కలలను మోడీ ప్రభుత్వం నిజం చేస్తోంది. ఊహాజనితాల మీద ఆధారపడి పనిచేసే స్టాక్ ఎక్స్చేంజ్లో ఎల్ఐసీని చేర్చడమంటే ప్రజల ఆస్తుల్ని ప్రయివేటు చేతుల్లో అప్పనంగా పెట్టడమే. ప్రజల పొదుపునకు రక్షణగా ఉండాల్సిన పాలకులు పెట్టుబడుల ఉపసంహరణ చేపట్టి ఎల్ఐసీని ప్రయివేటీకరణవైపు అడుగులు వేయించడం ఎంతవరకు సమంజసం? ప్రతి ఏటా వివిధ పథకాలకు పెట్టుబడి నిమిత్తం కేంద్రానికి మూడు లక్షల కోట్ల పెట్టుబడిని అందిస్తున్న సంస్థ ను బలహీన పరచాలనుకోవడం దేశభక్తులు చేసే పనేనా?
మనదేశ బీమారంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని పెంచాల్సిన అవసరం లేదు. ఇదే విషయాన్ని పలుసార్లు ఆర్థికవేత్తలు, వామపక్షాలు స్పష్టం చేశాయి. విదేశీపెట్టుబడులు కేవలం లాభాపేక్షతో అడుగుపెడతాయి తప్ప దేశ అభివృద్ధి కాంక్షించవు. శక్తివంతమైన ఎల్ఐసీని పీల్చి పిప్పి చేసేందుకే ఇందులో ప్రయివేటు పెట్టుబడి చొరబడుతోంది. అందుకు మోడీ ప్రభుత్వం బాటలు వేస్తున్నది. కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్మోడీ, విజరుమాల్యా వంటి వారు మన ముందున్నారు. అటువంటి వారికి ఎల్ఐసీలో వాటాలివ్వడమంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒక్కసారి పెట్టుబడుల అమ్మకాలు ప్రారంభమైతే ప్రయివేటు వారిదే పైచేయి అవుతుంది. ఈ సమస్య ఒక్క ఉద్యోగులదే కాదు. ప్రజలందరిదీ. తమ రాష్ట్రాలకు ఆర్థికంగా చేయూతనిస్తున్న ఎల్ఐసీని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైనా ఉంది. ఇలాంటి ప్రతిపాదనలను ప్రారంభంలోనే అడ్డుకోవాలి. కేంద్రం చర్యలను వ్యతిరేకించాలి.