Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశ ప్రజలపై ఎన్నార్సీని రుద్దడానికి కేంద్ర సర్కారు సన్నద్ధమవుతున్నది. అసోంకే ఎన్నార్సీని పరిమితం చేస్తామనీ, దేశవ్యాప్తంగా అమలుచేసే ఉద్దేశం లేదని మంగళవారంనాడు పార్లమెంటులో కేంద్రం చెప్పడం ప్రజలను మోసగించడం, ప్రతిపక్షాలను ఏమార్చడం కోసమే. ఈ విషయమై టీఆర్ఎస్ వైఖరి కీలకం కానుంది. పార్లమెంటులో బిల్లు స్థాయిలోనే వ్యతిరేకించిన ఆ పార్టీ, ఆ దిశలో మరో ముందడుగేసింది. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్కు తాము వ్యతిరేకమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజలను మతం పేరిట విభజించే పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా, వచ్చే బడ్జెట్ సమావేశాల్లో తీర్మానం చేస్తామని స్పష్టం చేసిన సంగతీ విదితమే. మౌలిక సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన నరేంద్ర మోడీ సర్కారు ప్రజల మధ్య చిచ్చుపెట్టే చట్టానికి తెరలేపింది. ఇప్పుడు ఎన్నార్సీ అమలుకు ప్రయత్నిస్తున్నది.
ఎన్నార్సీకి, ఎన్పీఆర్కు సంబంధమే లేదంటూ నంగనాచి కబుర్లు చెబుతున్న కేంద్రం ఏకంగా ప్రథమ పౌరుడు రాష్ట్రపతి రామ్నాధ్కోవింద్ చేత పార్లమెంట్లో పచ్చి అబద్ధాలు పలికించింది. నిజానికి 2003 పౌరసత్వ నిబంధనల్లోని మూడో క్లాజు ప్రకారం జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్) అమలుచేస్తామని 2019 జులై 31న విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. అవే నిబంధనలలో ఎన్పీఆర్ ఆధారంగా జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ) రూపొందించాలని నాలుగో నిబంధన చెబుతున్నది. అంటే.. ఎన్నార్సీ కోసమే ఎన్పీఆర్ అని తేటతేల్లమైంది. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలు, పోరాటాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోనూ ఆ తరహా పటిష్టమైన కార్యాచరణ అవసరం ఎంతైనా ఉన్నది. దేశ రాజధాని ఢిల్లీలోని షాహీన్బాగ్ ఉద్యమం ఇప్పుడు పార్లమెంట్ను కుదిపేస్తున్నది. ఉద్యమకారులపై దుండగుడు జరిపిన కాల్పులు ఆందోళనకరం. ప్రజావ్యతిరేక చట్టాలు చేయడం, వ్యతిరేకిస్తే అణచివేయడం పాలకులకు అలవాటుగా మారింది. ఇప్పుడు కేంద్ర మంత్రుల రెచ్చగొట్టే ఉపన్యాసాలతో ఇష్టారాజ్యంగా దుండగులు కాల్పులకు తెగబడుతున్నారు. ఈ దుర్మార్గ సంస్కృతికి చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. ఇందుకు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, మానవహక్కుల సంస్థలు ఏకం కావాల్సిన పరిస్థితులు ముందుకొచ్చాయి. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్కు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రుల సమావేశం పెడతానని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. తక్షణమే ఆ నిర్ణయాన్ని కార్యాచరణలోకి తీసుకురావాలి. కేంద్రం ప్రజావ్యతిరేక చట్టాలకు నిరసనగా జరిగే పోరాటాలు, ఉద్యమానికి నాయకత్వం వహించేందుకు తాను సిద్ధమని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం సంతోషకరమైన విషయం.
మతసామరస్యాన్ని దెబ్బతీసి, నిరుపేదల అభివృద్ధిని అడ్డుకోవడం, సంక్షేమ కార్యక్రమాలు, సమస్యల పరిష్కారం నుంచి తప్పుకోవడం బీజేపీ తక్షణ ఎజెండా. ఆది నుంచీ బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నదని ఏకంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పదే పదే చెబుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ఆ పార్టీ ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వర్రావు సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్కు వ్యతిరేకంగా మాట్లాడారు. ఈ చట్టాలను ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. శాంతి, సౌభ్రాతృత్వాలను కాపాడాల్సిన ప్రభుత్వాలు, ప్రజలను మతప్రాతిపదికన విభజించి రాష్ట్రాల ప్రయోజనాలను సైతం దెబ్బతీసే ఏకఛత్రాధిపత్యంగా దేశాన్ని పాలించే కుట్రకు బీజేపీ పాల్పడుతున్నది. తెలంగాణ ఆర్థిక ఇబ్బందులను పట్టించుకోవడం లేదని గులాబి ప్రభుత్వం చెబుతున్నది. ఈ సమస్య పరిష్కారానికి పోరాటమే మార్గం. జీఎస్టీకి చెందిన రూ.1131 కోట్లు, ఐజీఎస్టీకి చెందిన రూ.2812 కోట్ల బకాయిలను రాబట్టేందుకు ప్రతిపక్షాలను కలుపుకుని పోరుబాట పట్టడమే మార్గం. ఐఐఎం, ఇండిస్టియల్ కారిడార్, నేషనల్ డిజైన్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు, ఉపాధి హామీ చట్టం నిధుల పెంపు, విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాల్సిన అవసరమూ ఉంది. సీఏఏకు వ్యతిరేకంగా 10లక్షల మందితో బహిరంగసభ పెడతానని ప్రకటించిన సీఎం, ఆ దిశగా వేగంగా అడుగులేయాల్సిన ఆవశ్యకతా కనిపిస్తున్నది. ప్రజల భావోద్వేగాలతో ఆటలాడుతూ దేశ ప్రతిష్టను, లౌకిక భావనను నాశనం చేసే కుట్రతో పార్లమెంటు సాక్షిగా బీజేపీ చేస్తున్న పన్నాగాలను అడ్డుకోవడానికి ఈ చర్యలు అవసరం. ఇప్పటికే విశ్వవిద్యాలయాలు పోరాట కేంద్రాలుగా మన ముందు నిలిచాయి. అసోం, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, పశ్చిమబంగా, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, కేరళతోపాటు రాష్ట్రంలోనూ మతప్రాతిపదికగా ఇచ్చే పౌరసత్వానికి నిరసనగా ఆందోళనలు సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ధోరణివల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతున్నది. దీనిని నిలువరించడానికి ప్రజలకు స్వేచ్ఛగా నివసించే అవకాశాన్నీ, హక్కూ కల్పించడానికి స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో కదలాలి. ఈ దిశగా ఇప్పటికే కేరళ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. తెలంగాణ సర్కార్ కదిలితే ఈ పోరాటంలో మరో ముందడుగు అవుతుంది. అందుకే రాష్ట్ర పాలకులు కార్యాచరణకు పూనుకోవాలి.