Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''మాట దిద్దవచ్చు మరి యెగ్గు లేకుండ
దిద్దవచ్చు రాయి తిన్నగాను
మనసు దిద్దరాదు మహినెంతవారికీ'' అంటాడు ప్రజాకవి వేమన. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ మాటలు వింటే ఈ వేమన వాక్కులే గుర్తుకొస్తాయి. తమ విద్వేష రాజకీయాలకు నిరసనలు వెల్లువెత్తుతున్నా తీరు మారని మన ఏలికలను చూస్తే.. వేమనది ఎంత సత్యవాక్కో అర్థమవుతుంది. తాము రాజ్యాంగ విరుద్ధంగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని దేశమంతా తూర్పారబడుతున్నా.. తగుదునమ్మా అంటూ సమర్థించుకోవడమేగాక, తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆకాంక్షల మేరకే తాము ఈ చట్టాన్ని తెచ్చామని వక్రభాష్యాలు చెప్పడం మోడీకే చెల్లింది! అంతేనా.. నెహ్రూను ప్రధానిని చేయడానికే దేశాన్ని భారత్, పాకిస్థాన్లుగా విడగొట్టారని సెలవిచ్చారాయన!! ఒక ప్రధాని స్థాయి వ్యక్తి.. చారిత్రక వాస్తవాలను వక్రీకరిస్తూ ఇంతటి అసత్యాలకు దిగజారడం అనుచితం, ఆక్షేపణీయం.
పార్లమెంటును ఢిల్లీ ఎన్నికల ప్రచార సాధనంగా వాడుకోవడమే లక్ష్యమైన వారి నుంచి ఉచితానుచితాలు ఆశించడం అమాయకత్వమే అవుతుందేమో! బహుశా ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం పట్టుకున్నట్టున్నది వీరికి. అందుకే పార్లమెంటు వెలుపలే కాదు.. లోపలా అదే విషం, విద్వేషం వెళ్లగక్కుతున్నారు. సరిగ్గా పోలింగ్కు కొన్ని గంటలముందు పార్లమెంటులో రామమందిర నిర్మాణానికి ట్రస్టును ప్రకటిస్తారు. సీఏఏపై పెల్లుబుకుతున్న నిరసనోద్యమాలపై అవాకులూ చెవాకులూ పేలుతారు. ఈ నిరసనలన్నీ ప్రతిపక్షాలూ పాకిస్థాన్ల కుట్రలంటారు. నిరసనలో పాల్గొనే వారంతా దేశద్రోహులేనంటారు. కేజ్రీవాల్ ఉగ్రవాది అంటారు. ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొడతారు. చివరికి అదే పార్లమెంటు సాక్షిగా నెహ్రూను తూలనాడుతారు, స్వాతంత్య్రోద్యమానికి వక్రభాష్యాలు చెబుతారు. ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కి, పార్లమెంటరీ ప్రమాణాలను గంగలో కలిపే ఈ చర్యలను ఎలా అర్థం చేసుకోవాలి?
ఢిల్లీ ఎన్నికల పర్వంలో ఇలాంటి అనుచిత, అనైతిక, విద్వేషపూరిత వ్యాఖ్యల వలన దాదాపు పదుల సంఖ్యలో బీజేపీ నేతలు ఎలక్షన్ కమిషన్ నోటీసులు అందుకోవడం ఓ విశేషం కాగా, అందులో అత్యథికులు ఎన్నికల ప్రచారం నుండే తొలగించబడటం మరో విశేషం! అలా తొలగించబడిన వారికే రాష్ట్రపతి ప్రసంగంపై చర్చలో మితిమీరిన ప్రాధాన్యతలు కట్టబెట్టడం మరీ విడ్డూరం!! ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యల్లో ఆరితేరిన ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్, ఢిల్లీ ఎంపీ పర్వేశ్ శర్మలకే ఈ చర్చకు నేతృత్వం అప్పగించడం దేనికి సంకేతం? అది పార్లమెంటైనా, ప్రజాక్షేత్రమైనా విద్వేషమే మా విధానం అని తేల్చి చెప్పడానికేనా? పార్లమెంటనేది ప్రజాస్వామ్యంలో ఓ అత్యున్నత శాసన వ్యవస్థ. అందులో రాష్ట్రపతి ప్రసంగం ఓ అతి ముఖ్యమైన రాజకీయ ప్రక్రియ. ఈ దేశానికి ప్రభుత్వం ఏమి చేసిందో, ఏమి చేయనుందో తెలిపే ఓ కీలకమైన సందర్భం. అలాంటి సందర్భానికి, ఎలక్షన్ కమిషన్ వంటి రాజ్యాంగబద్ధమైన సంస్థచే అభిశంసనకు గురైన నేతలకే చర్చకు నేతృత్వం యివ్వడం, ఏలినవారి ఆంతర్యానికి అద్దం పడుతోంది. అందుకే వేమన చెప్పినట్టు.. వీరి మాటల్లో దోషముంటే మారడానికి అవకాశముందని అనుకోవచ్చునేమోగానీ, వారి మనసులోనే ద్వేషముండగా మారుతారని ఆశించడం భ్రమే. అయినా ప్రధాని హౌదాలో ఉన్న వ్యక్తే నిండుసభలో చరిత్రపై నిందలు వేస్తుంటే, తొలి ప్రధాని నెహ్రూయే ఈ దేశ విభజనకు కారకుడని అసత్యాలు నూరిపోస్తుంటే ఈ మంత్రులు, ఎంపీలను అనుకుని ఏం లాభం. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?
నిజానికి నెహ్రూ అన్ని మతాలను గౌరవించాడే తప్ప ఎప్పుడూ ఏ మతానికీ వకాల్తా పుచ్చుకున్నట్టూ చరిత్రలో ఎక్కడా కనిపించదు. అయితే మతమేదైనా మతోన్మాదం మాత్రం ఈ దేశానికి పెను ముప్పేనని భావించాడు. లౌకిక పునాదుల మీదే ఈ దేశ సమైక్యతనూ సమగ్రతనూ కాపాడుకోగలమని విశ్వసించాడు. మతతత్వ ప్రమాదాన్నీ, ఆరెస్సెస్ ఆలోచనలనూ వివరిస్తూ.. ''అది కచ్చితంగా దుష్టశక్తి. దానితో రాజీ ఎప్పటికీ ప్రమాదమే. జాతీయతావాద భారతదేశం వేటికైతే కట్టుబడి వుందో, వాటన్నిటినీ కూలదోయడమే ఆరెస్సెస్ లక్ష్యంగా పెట్టుకుంది. ఆరెస్సెస్ ఒక ప్రయివేటు ఆర్మీ తరహా సంస్థ. అది తూచా తప్పకుండా నాజీ పంథాలో సాగుతోంది. ఫాసిజం మద్దతుతో యూరప్లో చెలరేగిన ఫాసిస్టు సంస్థలలాంటిదే ఆరెస్సెస్'' అని 1947-48ల్లో ముఖ్యమంత్రు లకు రాసిన లేఖల్లో స్పష్టంగా తేల్చి చెప్పారు. నెహ్రూ పట్ల సంఘీయుల అక్కసుకు ఇదీ ఓ కారణమే. పచ్చి అబద్ధాలు కట్టిపెట్టి ప్రధాని ఈ లేఖలపై చర్చకు సాహసించగలరా? అది చేయలేకే కదా చరిత్రకు మసి పూసి మారేడుగాయ చేయడం!
భారత స్వాతంత్రోద్యమంలో సూది మొనంత పాత్ర కూడా లేని సంఘీయులకు.. ఆ చరిత్రపై బురద చల్లడం, ఆ చరిత్రకు సారథ్యం వహించిన గాంధీ, నెహ్రూ వంటి నేతలపై దాడి చేయడం, గాడ్సేలను పూజించడం నిత్యకృత్యమైంది. ఇక ఈ అసత్యాలు, అనుచితాల వెనుకున్న మరో రహస్యం అసలు విషయాలనుంచి ప్రజల దృష్టి ఏమార్చడం, తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడం. అశేష ప్రజల ఆకలి దప్పులను పట్టించుకోకుండా అంబానీలు, ఆదానీల సేవలో తరిస్తున్న తమ అసలు స్వరూపాన్ని ప్రజలెక్కడ గ్రహిస్తారోనన్నది వీరి ఆందోళన. అందుకే ఈ మాయోపాయాలు...