Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజకీయం - నేరం. నేరం కోసం రాజకీయం. రాజకీయం కోసం నేరం.. అన్నట్టుగా సాగుతున్నది దేశ రాజకీయం ఇప్పుడు. అందుకే తాజా అధ్యయనం ప్రకారం ప్రస్తుత లోక్సభలో 46శాతం మందిపై క్రిమినల్ కేసులు, 29శాతం మందిపై తీవ్ర నేరారోపణలు ఉన్నాయని తేలింది. ఇందులో సింహ భాగం పాలక బీజేపీ ఖాతాలో ఉంది. 2019 లోక్సభలో బీజేపీ నుంచి క్రిమినల్ కేసులు ఉన్న 155మంది పాగా వేశారు. ఇందులో హత్య, హత్యాయత్నం, లైంగికదాడులు, అపహరణలు, బలవంతపు వసూళ్ళు, దోపిడీ తదితర తీవ్ర కేసులు ఉన్నవారు ఉన్నారు. ఇలాంటి నేరారోపణలు ఎదుర్కొంటున్నవారిలో ఇతర బూర్జువా పార్టీలకు చెందినవారి సంఖ్య సైతం తక్కువుగా ఏమీ లేదు. నేరమయ రాజకీయాలు చేయడం బూర్జువా పార్టీల ప్రాథమిక లక్షణంగా మారిన చోట బూర్జువా పార్టీలనుంచి నేర రహిత నేతలను ఆశించడం అత్యాశ మాత్రమే కాగలదు.
దేశ వ్యాప్తంగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలలో మూడవ వంతుమంది క్రిమినల్ కేసులు, అందులో సగం మందికి పైగా తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో నేరస్తులు చట్టసభలలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు ఎలక్షన్ కమిషన్ తాను చేయాల్సిన ప్రయత్నాలు చేసి చివరికి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు 2018 సెప్టెంబర్లో నేరస్తులను చట్టసభలలోకి రానీయకుండా నిరోదిస్తూ బలమైన చట్టం చేయాలని పార్లమెంటును ఆదేశించింది. అయినా పార్లమెంటు సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసింది. దీంతో, గురువారం సుప్రీం కోర్టు ఈ విషయమై మరింత గట్టి ఆదేశాలు జారీ చేసింది. ప్రతి రాజకీయ పార్టీ తాను పోటీకి దింపుతున్న అభ్యర్థులపై ఉన్న కేసుల వివరాలను పార్టీ వెబ్సైట్లలోను, పార్టీలకు అనుబంధంగా నడిచే సామాజిక మాధ్యమాలలోనూ ఉంచాలని, అలాగే ప్రింట్ మీడియా ద్వారా ప్రకటనలు ఇవ్వాలనీ ఆదేశాలు జారీ చేసింది. అలాగే, సదరు అభ్యర్థిని ఎంపిక చేసిన మూడు రోజుల్లోగా ఎన్నికల కమిషన్కు ఆ వివరాలను నివేదించాని ఆదేశించింది. ఇందుకు భిన్నంగా వ్యవహరించే రాజకీయ పార్టీలపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకొనే అధికారాన్ని ఎన్మికల కమిషన్కు ఇచ్చింది. ఈ ఆదేశాలు ఆహ్వానించదగినవే. అయితే, ఈ ఆదేశాలను పాలక పార్టీలు ఏ మేరకు పాటిస్తాయన్నది ప్రశ్న! వ్యవస్థలను గుప్పెట పెట్టుకునే పాలక రాజకీయాలు శృతి మించుతున్న స్థితిలో సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం పాలకులు ప్రతి పక్షాలపై, ముఖ్యంగా ప్రజా ఉద్యమాలలో ముందు వరుసలో ఉంటూ పదుల సంఖ్యలో కేసులను ఎదుర్కొంటున్న కమ్యూనిస్టు పార్టీల నాయకులు, కార్యకర్తలపై రాజకీయ కక్ష సాధింపుకోసం పాలకులు ఉపయోగించరన్న నమ్మకమేమీ లేదు. నిజమైన నేరస్తులు యధావిధిగా తప్పించుకుని నిజాయితీగా ప్రజా ఉద్యమాలలో పాల్గొని కేసులపాలబడ్డ వారు బలికారన్న భరోసా ఏమీ లేదు.
అలాగే, 'నేరాలు రుజువు కాకుండా ఒక వ్యక్తిని చట్టసభలలోకి రానీయకుండా తాము ఆపలేమని దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది పార్లమెంటే'నని సుప్రీం కోర్టు స్పష్టం చేయడంతో నిర్ణయాధికారం పార్లమెంటు చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో ఈ విషయంలో ఆశలు అడుగంటి పోయే పరిస్థితి ఏర్పడింది. అధికారానికి నేరాన్ని ఒక సోపానంగా భావించే బూర్జువా పార్టీలు నేర రహితులు, అవినీతి రహితులతో ఎందుకు ఎన్నికల యుద్ధం చేయాలనుకుంటాయి? తమ ప్రత్యర్థి పార్టీకి మించిన నేరగాళ్లను బరిలోకి దింపాలనుకుంటాయి తప్ప సచ్ఛీలుర్ని ఎందుకు అక్కున చేర్చుకుంటాయి. అస్సలు, ఒకరికొకరు కూడబలుక్కున్నట్టు, ఒకరితో ఒకరు కుమ్మక్కు అయినట్టూ బూర్జువా పార్టీలన్నీ కలిసి నేర రహితుల్ని ఎన్నికల బరిలోనుంచి వెలుపలకు నెట్టేసేందుకు తమ అభ్యర్థుల జాబితాను పూర్తిగా నేరస్తులూ అవినీతి పరులతో నింపేస్తున్న స్థితిలో ఈ బూర్జువా పార్టీలనుంచి మనం రాజకీయ ప్రక్షాళనకు సంబంధించిన చట్టాలను ఎలా ఊహించగలం? సరికదా, తమ వ్యక్తిగత జీవితాలను త్యాగం చేస్తూ ప్రజల తరపున పోరాడే వారిపై పాలకులు అత్యంత తీవ్రమైన 307, 302 లాంటి సెక్షన్ల కింద కేసులు బనాయించి జైళ్లపాల్జేయడం మనం చూస్తూనే ఉన్నాం. తమ రాజకీయ ప్రత్యర్థులను ముఖ్యంగా కమ్యూనిస్టులను ఎన్నికల బరిలోనుంచి తప్పించేందుకు బూర్జువా పార్టీల నేతలు బరితెగిస్తారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కాబట్టి, నేరచరితుల విషయంలో కూడా సుప్రీం కోర్టు గట్టి చట్టాన్ని తీసుకురావాలని ఆశించడం తప్ప పార్లమెంటుపై ఆశలు పెట్టుకునే అవకాశం ఆవగింజంతయినా లేదు. ఈ విషయంలో సుప్రీం కోర్టు సైతం చేతులెత్తేస్తే ఇక చేయగలిగింది ఏమీ లేదు పార్లమెంటును ప్రక్షాళన చేసుకోవడం తప్ప! అవును, ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకూ అంతిమ పరిష్కారం ప్రజల చేతుల్లోనే ఉంటుంది. ప్రజా ప్రతినిధులే ప్రజలకు ఒక ప్రధాన సమస్యగా మారినపుడు వారిని తప్పించే తిరుగులేని అధికారం ప్రజల చేతుల్లోనే ఉంటుంది. ప్రజల ఓట్లతో అధికారం సొంతం చేసుకున్న మరుక్షణం నుంచీ ఆ అధికారానికి తామే సొంతదారుల మైనట్టుగా విర్రవీగుతూ తమకు అధికారం అప్పజెప్పిన ప్రజల మూలుగలు పీల్చుతున్నవారిని దారికి తెచ్చే శక్తి ఒక్క ప్రజలకు మాత్రమే ఉంది. ప్రజలు ఆ దిశగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది.