Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సృష్టిలో ప్రతి ప్రాణికీ తన అంత:బాహ్య స్వభావాలు నిరంతరం కాలానుగుణంగా మారుతుంటాయి. గొంగళి పురుగు కూడా అందమైన సీతాకోకచిలుకగా రూపాంతరం చెందుతుంది. 'శరత్కాలపు ఆకాశం నీలం, జ్యేష్టమాసపు వానల తరువాత గాలిలో నిర్మలత్వం ఏదో అర్థం కాని నూతనత్వం' అంటారు చలం. ఇవి కంటికి కనిపించకున్నా మనసుని స్పృశించి మైమరిపించి గొప్ప అనుభూతిని పంచుతాయి.
ప్రపంచంలో మారనిదంటూ ఏదీ లేదు. మార్పు సహజం. స్థిరంగా కనబడే భూమి కూడా తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. అనంత విశ్వంలోని ప్రతి అణువూ మార్పునకు లోనుకాక తప్పదు. మనుషుల్లోనూ చాలామంది మారుతున్నారు. ఈ మహత్తరమైన నాగరికతంతా మార్పు ద్వారా సాధించిందే. సహజమే కదా! ఒక్కోసారి వద్దన్నా అది వచ్చి తీరుతుంది. ఈ స్థూలదృష్టితో పరిశీలించని కొందరు తమనుతాము మార్చుకునేందుకు ఇష్టపడరు. ప్రయత్నమూ చేయరు. ఇవేమీ లేకపోగా 'అబ్బే! ప్రపంచం మారదండీ..' అని నిట్టూర్పులు వదలుతారు. మనిషి ప్రకృతిని చూసి ప్రతిస్పందించడం ప్రారంభించిన నాటి నుంచీ ప్రకృతిలో క్షణంక్షణం కలిగే మార్పులను ఆస్వాదిస్తున్నప్పుడు, మనం చూడకపోవడం ఏమిటీ? గమనించకపోవడం ఏమిటీ? ఇప్పటిదాకా ఎన్నో మార్పుల్ని చూశాం. చూస్తున్నాం. చూడబోతాం. మార్పుని అర్థం చేసుకుని, అంగీకరించే మనస్తత్వాన్ని అలవర్చుకోకపోవడం చేతనే పదిమంది మాట్లాడే మాటల్నే పలుకుతుంటాం. మానవ శ్రేయస్సుకి దోహదపడే మార్పుల పట్ల నిశితమైన అవగాహన ఉంటే ఇలా మాట్లాడబోం. మార్పు ఇంకా ఇంకా రావాలనీ, అది సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలనీ ఆశిస్తూ, ఆశావహంగా జీవిస్తాం.
నేడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రపంచమంతటా వ్యాపార సంస్కృతి ఆవరించింది. భౌతిక సంపదల వెంట పరుగులు తీస్తూ మానవుడు అస్తిత్వాన్నే మరిచిపోతున్నాడు. సాంకేతిక రంగంలో క్షణక్షణం వస్తున్న మార్పులు తన హృదయానుభూతుల్ని, సహజ స్పందనల్ని అరికట్టి మరగా మార్చివేశాయి. తెల్లారిలేస్తే దైనందిన జీవితంలో ప్రతి చర్యనూ సైన్స్ నియంత్రించి, జీవన వేగాన్ని విపరీతంగా పెంచేసింది. తత్ఫలితంగా మనిషి ఉక్కిరిబిక్కిరై యాంత్రికంగా బతికేస్తున్న దుస్థితి. యంత్రాలకు సజీవ స్పందన ఉంటుందా? సృష్టి వైచిత్రి స్పందించి ప్రతిసృష్టి చేయగల శక్తి ఉంటుందా? ఉండదు. అందుకే నేటి మానవుడు వికాసానికి దూరంగా జీవచ్ఛవంలా బతికేస్తున్నాడు. మరి నానాటికీ విషమిస్తున్న పరిస్థితుల్లో మానవుడు ఎందుకు మారడు? అనే ప్రశ్న ఉత్పన్నకావడం సహజం. కానీ, మనిషి మారుతాడు. మారాలని ఉంటే కృషి ఉంటే మనుషులు మహాపురుషలవుతారు. ఆధునికతను సహేతుకమైన దృష్టితో చూడగలగాలి. దానిని అర్థం చేసుకోగల విశాల దృక్పథం, మార్పునకు ఆహ్వానం పలకగల సహృదయం, శాస్త్ర జ్ఞానాన్ని అంగీకరించే శాస్త్రీయ దృక్పథం అలవరుచుకోవాలి. అప్పుడే సమాజ పరిణామానికి మనవంతు తోడ్పాటు అందించిన వారమవుతాం. మనవంతు భూమిక పోషించకుండా మారాలనుకోవడం హాస్యాస్పదమే. ఒక సందర్భంగా ఆల్బర్ట్ ఐన్స్టీన్ మార్పు గురించి ప్రస్తావిస్తూ 'మన ఆలోచనా విధానం తప్ప అన్నీ మారాయి' అన్నారు.
మార్పు అనేది ఒక్కనాటితో సాధ్యమా? అనుకున్న వెంటనే సంభవిస్తుందా అంటే కానే కాదు. కొన్ని త్వరితగతిన సంభవిస్తే మరికొన్ని కాలాలు పట్టవచ్చు. అయినా మార్పు అనివార్యమైంది. సమాజాన్ని మార్చాలని సంకల్పించి ఎంతోమంది మహానుభావులు తమ జీవితాల్ని అంకితమిచ్చారు. వారి జీవితకాలంలో సాధించింది స్వల్పమే అయినా సాధించాల్సింది ఎప్పుడూ ఉంటుంది. వారి కర్తవ్యాన్ని వారు శక్తివంచన లేకుండా నిర్వర్తించారు. నేటితరంపై సమాజాన్ని మరింత అభివృద్ధిపథంలో నడిపించాల్సిన బాధ్యత ఉన్నది. ఈ బాధ్యతలో నిత్య సంఘర్షణ తప్పకపోవచ్చు. 'ఎందుకొచ్చిన గొడవ నలుగురు నడిచే దారిలో నడిస్తే పోదా?' అనుకునేవారూ ఉండొచ్చు. జీవితానుభూతులు గ్రహించిన వారెవరూ ఉదాసీనంగా బతకరు. బతకడానికీ వాళ్ల మనస్సు ఒప్పుకోదు. మెరుగైన సమాజం కోసం చేసే కృషిలో 'నీ ఒక్కడివే అంతా మార్చేసేటట్టున్నావే..' అంటూ హేళన చేసేవారిని అభివృద్ధి నిరోధకులుగా గుర్తించి, వారిని లెక్కచేయకుండా ముందుకు పోగలగాలి. అనాది నుంచి మానవుడు తన మార్గానికి అడ్డువచ్చే అనేక ప్రతీప శక్తులతో పోరాడుతూనే ఉన్నాడు. ఈ పోరాట ఫలితాన్ని వారు అనుభవించకపోయినా తర్వాత తరంపై ఆ ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. నిరంతర పోరాటం ద్వారానే మానవుడీనాడు విశ్వాన్ని జయించగలిగే స్థితికి ఎదిగాడు. అందుకే మార్పు చైతన్యానికి చిహ్నం. చైతన్యం జీవానికి చిహ్నం. ప్రకృతిలో మార్పు అత్యంత సహజమైన జీవన ప్రక్రియ. అది జీవచైతన్య కేతనం...