Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''అబద్ధమాడితే గోడ కట్టినట్టుండాలి'' అన్న మాట పెద్దలు ఏ ఉద్దేశంతో అన్నారోగానీ.. ఇప్పుడు అదే మాటను సార్ధకం చేసే పనిలో తలమునకలవుతున్నాయి బీజేపీ ప్రభుత్వాలు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈనెల 24న భారత పర్యటనకు రానున్న విషయం విదితమే. ఈ సందర్భంగా ప్రధాని మోడీ స్వరాష్ట్రం గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్దదైన స్టేడియాన్ని ఆయన చేతులమీదుగా ప్రారంభింపజేయడమేగాక, అదే స్టేడియంలో ఆయన ఆగమనానికి అంబరాన్నంటే సంబరాలకు సన్నాహాలు చేస్తున్నారు మన ఏలికలు. ''నమస్తే ట్రంప్'' పేరుతో నిర్వహిస్తున్న ఈ అతి(థిó) మర్యాదల వెనుక ఆంతర్యమేమిటోగానీ.. సాధారణంగా విదేశాల అధినేతలెవరైనా పర్యటనకు వస్తున్నారంటే.. అధికారిక గౌరవమర్యాదలూ భద్రతాపరమైన జాగ్రత్తలతో పాటు ఇక్కడి అభివృద్ధీ అందుకు గల ఆటంకాలనూ చర్చించి, వాటి పరిష్కారానికీ ఇరు దేశాల ప్రయోజనాలకూ అవసరమైన ప్రణాళికలు, పరస్పర సహకారం, ఒప్పందాలకు ప్రయత్నించడం సహజం. కానీ ఇందుకు భిన్నంగా దేశంలోని వెనుకబాటుతనాన్ని అమెరికా అధ్యక్షుడి కంటపడకుండా గోడల వెనుక దాచే ప్రయత్నం చేస్తున్నాయి ప్రభుత్వాలు.
ట్రంప్ గౌరవార్థం లక్షలాదిమందితో ''సివిక్ రిసెప్షెన్''ను తలపెట్టిన కేంద్ర, రాష్ట్ర (గుజరాత్) ప్రభుత్వాలు.. ఈ సందర్భంగా అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి సదరు క్రీడాప్రాంగణం వరకూ భారీ ''రోడ్షో''' నిర్వహించనున్నాయి. అయితే ఈ మార్గంలో దాదాపు మూడువేల మంది నివసిస్తున్న ''దేవ్శరణ్'' మురికివాడ ఉంది. ఈ మురికివాడను మూసివేస్తూ కేంద్ర సర్కారు కనుసన్నల్లో దారి పొడవునా భారీ గోడ కడుతోంది గుజరాత్ సర్కార్. దశాబ్దాల మన వెనుకబాటుకు సంకేతమైన ఈ మురికివాడ అగ్రరాజ్యాధినేత కంటపడితే అవమానమను కుంటున్నారే.. మరి ఈ మురికినంతా అక్కడ పోగేసిందెవరు? ఈ పేదరికాన్నంతా పెంచి పోషించిందెవరు? ఆ మురికివాడలోని దారిద్య్రాన్ని రూపుమాపలేని పాలకులు.. దానిని అమెరికా అధ్యక్షుడి చూపుల్లోకి మాత్రం రాకుండా చేయదలచుకున్నారు! అందుకే ఎయిర్పోర్టు నుంచి ఇందిరా బ్రిడ్జి వరకూ దాదాపు నాలుగువందల మీటర్ల దూరానికి పైగా ఏడడుగుల ఎత్తైన గోడ నిర్మిస్తున్నారు!!
''వైభవ సౌధాల చుట్టు ఎండిన డొక్కల కేకలు..
మీ చుట్టూ చెలరేగిన ఆకలి సంద్రపు హౌరూ..
నలుదిక్కుల కాచుకున్న క్షుధిత మానవుల పోరూ..
ఆకలి మంటల కాలే మీ వైభవ స్వర్ణలంక..
చూడబోరు జాలిగాను ఎవరూ మీ చితుల వంక..'' అన్న ప్రముఖ కవి బైరాగీ కవిత గుర్తుకొస్తోంది ఏలినవారి తీరు చూస్తుంటే. ఒకవైపు ఆకాశాన్నంటే ఏడంతస్తుల భవనాలు.. వాటి పక్కనే పూరిగుడిసెల మురికివాడలు. రోడ్లపై విదేశీకార్లు, చౌరస్తాలో ఆ కార్లచుట్టూ బిచ్చమెత్తుకునే బికారులు. ఒకవైపు కోట్లాది రూపాయల ఖర్చుతో వైభవోపేతమైన విందులూ వినోదాలూ.. మరోవైపు గుప్పెడు మెతుకుల కోసం ఆశగా చూసే కాలే కడుపులు. దశాబ్దాలుగా ఇదే కదా ఈ దేశ ముఖచిత్రం. ఈ ముఖాన్ని దాచిపెట్టి మనుగడ కొనసాగించాలనుకునేవారు ఈ ముఖచిత్రాన్ని మార్చగలరా?
అగ్రరాజ్యాల అధినేతలు పర్యటనల కొచ్చినప్పుడల్లా పైపై అలంకరణలకు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ధారపోసి, క్షుద్బాధకు బిచ్చమెత్తుకునే ఆకలి జీవులను ఊరవతలకి విసిరేసి, ఈ దేశం సుభిక్షంగా ఉందని చెప్పుకోవడం పాలకులకు పరిపాటిగా మారింది. మొన్న క్లింటన్, నిన్న ఇవాంకా ట్రంప్ పర్యటనల్లోనూ మనం ఇదే చూసాం. నేడు మరో అడుగు ముందుకేసి ఏకంగా వాడలకే గోడలు నిర్మించడం చూస్తున్నాం. ఈ ఒక్క కారణం చాలు ఈ పర్యటనలు ఏ ప్రయోజనాల కోసమో, ఎవరి ప్రయోజనాల కోసమో అర్థం చేసుకోవడానికి. ఇవి నిజంగా ప్రజల ప్రయోజనాల కోసమే అయినప్పుడు ఆ ప్రజా జీవనానికి ముసుగులేసి ఈ గోడల వెనుక దాయడమెందుకు? ఇది అసంఖ్యాకమైన ఈ దేశ ప్రజాజీవనాన్ని అపహాస్యం చేయడమే అవుతుంది తప్ప ఆ ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలకు నైతికత అవుతుందా..?
కొద్దిమంది అమెరికా సంపన్నవర్గాల కోసం ప్రపంచ మానవాళి మనుగడనే పణంగా పెట్టేందుకు వెనుకాడని అమెరికా నైజం తెలియనిదేమీ కాదు. అందుకే ''ఊరకరారు మహానుభావులు'' అన్నట్టుగా ఏమి కోరి ట్రంప్ ఈ దేశానికి వస్తున్నాడన్నది పలు అనుమానాలు రేకెత్తిస్తున్నది. సరిగ్గా అధ్యక్ష ఎన్నికల ముంగిట మరోసారి వైట్హౌస్లో కొలువుదీరడానికి, అమెరికాలోని ప్రవాస భారతీయులను ఆకర్షించడమే ఒక లక్ష్యం కాగా.. కోట్లాది మంది భారతీయులకు ఆశ్రయమిస్తున్న ఈ దేశ పౌల్ట్రీ, పాల ఉత్పత్తి రంగాలను సంక్షోభంలోకి నెట్టే ప్రమాదకరమైన ఒప్పందాలకు అడుగులు పడుతున్న సూచనలు కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఎందుకంటే గోడలు నిర్మించడంలో ట్రంప్ మోడీని మించిన ఘనాపాటి. ఈ నేతలిద్దరూ తమ అంతరంగ గోడల్లోకి ఒక్కసారి తొంగి చూసుకుంటే తెలుస్తుంది.. అక్కడ ఎంత మురికి పేరుకుపోయిందో..! ఇప్పటికే వీరంతా కలిసి నిర్మించిన గోడలతో ప్రపంచమంతా అసమానతల్లో ఊపిరాడకుండా ఉన్నది. ఇప్పుడు కావాల్సింది గోడలు నిర్మించడం కాదు. గోడలు కూల్చడం. ఆ పని ఏలికలు చేయలేనప్పుడు.. ఈ గోడలనే కాదు, ఏలికల పీఠాలనూ కూల్చడమొక్కటే ప్రజల ముందున్న ఏకైక పరిష్కారం.