Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనాతో ఏర్పడుతున్న దుర్భర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అట్టహాసంగా మోడీ సర్కార్ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో వ్యవసాయరంగం కేటాయింపులు నామమాత్రమే. ప్రధాని మోడీ రూ.20లక్షల కోట్ల ప్యాకేజీతో ప్రారంభించగా, దానికి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఐదు విడతలుగా వెల్లడించారు. రూ.20.97లక్షల కోట్ల ప్రకటనతో ప్యాకేజీని ముగించారు. ఇంత పెద్ద ప్యాకేజీలో వ్యవసాయరంగానికి ఇచ్చినది లక్షా 50 వేల కోట్లే. అందులో 50వేల కోట్లు గ్రామీణ అనుబంధ పరిశ్రమలకు ఖర్చు చేస్తామంటున్నారు. ఈ లెక్కన మౌలిక వసతులు కల్పించేందుకు ఒక్కో గ్రామానికి అందేది రూపాయే. సహకార సంఘాలు, రూరల్ బ్యాంకుల నుంచి రైతులకు మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పుకోవడం హాస్యాస్పదం. నాబార్డు ద్వారా రైతులకు వర్కింగ్ క్యాపిటల్ కల్పిస్తామని చెప్పినా.. ఇందులో కేంద్రం నుంచి ప్రత్యక్షంగా వచ్చేది ఏమీ లేదు. కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ కూడా అంతే. ఈ స్కీమ్ కింద 2.5కోట్ల రైతు కుటుంబాలకు రూ.25 వేల కోట్ల రాయితీ రుణ ప్రోత్సాహకం ఇస్తామన్నా, ఇందులో ప్రభుత్వ పాత్ర సున్నా. రుణాల మాఫీ, స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడం వంటి అంశాలు ప్రస్తుత ప్యాకేజీలో లేవు. ఇప్పటి కేటాయింపులు కూడా గత బడ్జెట్లోనివే. కిసాన్ సమ్మాన్ కింద బడ్జెట్లో 75వేల కోట్లు కేటాయించినట్టు ఇదే ఆర్థికమంత్రి తెలిపారు. కానీ రూ.18వేల కోట్లు మాత్రమే కేటాయించి, ఒక్కో రైతుకు రెండువేల రూపాయలు జమచేస్తున్నారు. దీన్ని ఉద్దీపన ప్యాకేజీ అని ఎలా అంటారన్నది ప్రశ్న?
దయనీయ పరిస్థితుల దృష్ట్యా రూ.20లక్షల కోట్ల ప్యాకేజీలో వాటా దక్కుతుందని రైతులు ఎంతగానో ఆశించారు. అయితే తక్షణ చర్యలు గాకుండా ఇదే అదనుగా సంస్కరణలను ఆర్థికమంత్రి ఏకరువు పెట్టడం దారుణం. పంటల మార్కెట్, నిత్యావసరాల బాధ్యతలను ప్రభుత్వం ఇంకెంతమాత్రం నిర్వర్తించదని చెప్పేశారు. 'ఒకే దేశం ఒకే మార్కెట్' నినాదంతో దేశ వ్యాప్తంగా ఏకీకత మార్కెట్ చట్టం, ఉత్పత్తుల నిల్వలు, ధరలపై పరిమితుల ఎత్తివేత, నిత్యావసరాల చట్ట సవరణ, రైతులు పంట వేసే ముందే పంటల కొనుగోళ్లు, ధరలపై ఎగుమతిదార్లు, వ్యాపారులతో ముందస్తు ఒప్పందాలకు వీలు కల్పించే చట్టం.. ఈ మూడు సంస్కరణలతో రైతులకు, వినియోగదారులకు లాభం కలుగుతుందని మోడీ సర్కార్ చెబుతున్నది. కానీ వాస్తవంగా వాటివల్ల రైతులకు తీవ్ర నష్టం. పాల ఉత్పత్తుల సేకరణలో విదేశీ పెట్టుబడు లను ప్రభుత్వం ఆహ్వానించింది. పాలఉత్పత్తుల్లో మన దేశం అగ్రభాగాన ఉంది. దీని మీద 35 కోట్ల కుటుంబాలు బతుకుదెరువు సాగిస్తున్నాయి. వారందర్నీ బజారుకీడ్చడానికి న్యూజిలాండ్, స్విట్లర్లాండ్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, అమెరికా, జర్మనీ దేశాల పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి ఆర్థికమంత్రి నిర్మల జెండా ఊపారు. ఇప్పటికే ఈ దేశాలు మన పౌల్ట్రీ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. పౌల్ట్రీలో ప్రపంచంలోనే నెంబర్వన్ దేశంగా భారత్ ఉన్నది. ''బర్డ్ ప్లూ'' అని ప్రచారం చేసి లక్షల కోళ్లను చంపించాయి. గాలికుంటు, ఇతర వ్యాధుల పేర్లతో పశువులను హతమార్చాయి. దీంతో అటు వ్యవసాయ రంగం, ఇటు అనుబంధ రంగాలైన పౌల్ట్రీ, పాలు, చేపలు, మాంసం ఉత్పత్తుల ఎగుమతులను దెబ్బతీయడానికి డబ్ల్యుటీఓ, ప్రపంచ బ్యాంకు రెండూ సామ్రాజ్యదేశాలకు బంట్లుగా పనిచేశాయి. ఇతర దేశాల ఉత్పత్తుల దిగుమతులపై ఆధారపడే స్థితికి నెట్టేశాయి. ప్రతిపాదిత సదరు సంస్కరణలు అమల్లోకొస్తే ఇటు రైతులు అటు వినియోగదారులు కార్పొరేట్ల కబంధ హస్తాల్లో చిక్కడం ఖాయం.
ఇప్పటికే వంటనూనెలు కోటీ 15లక్షల టన్నులు ఏటా దిగుమతులు చేసుకుంటున్నాం. ఇంకా 40లక్షల టన్నుల పప్పులు, మనకు మిగులుగా ఉన్న పంచదార, పత్తి దిగుమతులను కూడా దేశంపై రుద్దుతున్నారు. పరిమితులు ఉన్నప్పుడే బ్లాక్ మార్కెట్ను, కత్రిమ కొరతను ప్రభుత్వాలు అడ్డుకోలేకపోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ చట్టం లేకుండా చేస్తే.. బహిరంగంగా మధ్యదళారీ లాభాలకు అవకాశం కల్పించినట్టవు తుంది. ప్యాకేజీ ప్రకటనలో కేంద్ర ఆర్థికమంత్రి తేనేటీగల అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయించారు. కానీ పరిశ్రమల మౌలిక సదుపాయాల పేరుతో 12.5లక్షల ఎకరాల వ్యవసాయ భూమిని సేకరించాలని చెప్పారు. ఒకవైపు జనాభా ఏటా 1.9శాతం పెరుగుతుండగా, 43కోట్ల ఎకరాల సాగు భూమిలో 9కోట్ల ఎకరాలు బీళ్లుగా ఉన్నాయి. ఇప్పటికే అంతంతమాత్రం గానే ఉన్న వ్యవసాయ ఉత్పత్తులు మోడీ ప్యాకేజీలో మరింత దెబ్బతింటున్నాయి. సంస్కరణల పేరుతో ప్రయివేటుకు అప్పగిస్తే మన ఉత్పత్తుల పరిస్థితి ఏంటన్నది ప్రశ్న. వాస్తవానికి ఈ ప్యాకేజీ ప్రకటించిన నాలుగు రోజులకు దివాలా తీసిన కంపెనీలకు రుణాల పెంపుతో పాటు గృహావసరాలు, విమానశ్రయాలు, విద్యుత్, రక్షణశాఖ ఉత్పత్తులు, సహజసంపదలైన బొగ్గుగనులు ప్రయివేటుపరం చేయడానికి విధానాలను అందంగా రూపొందించిన విషయం తెలిసిందే. అతి ముఖ్యమైన రక్షణరంగంలో 49శాతం నుంచి 70శాతానికి ఎఫ్డీఐ పెంచారంటే ఇంతకంటే దారుణం ఏముంటుంది? వ్యవసాయానికి, పారిశ్రామిక రంగాభివృద్ధికి, చివరికి సేవారంగానికి కూడా తోడ్పడని ఈ ప్యాకేజీ ప్రజల పెదవులపై తేనె పూసిన చందంగానే ఉన్నది. ఈ ప్యాకేజీ అమలు జరిగితే దేశ స్థూల ఉత్పత్తి మైనస్లోకి రావడం ఖాయం.