Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లాక్డౌన్ కంటే ముందే భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనంలోకి పోయిన విషయం తెలిసిందే. ప్రజల్లో కొనుగోలుశక్తి లేక, సరుకులు అమ్ముడుపోక పోవడం వలనే ఈ పరిస్థితి వచ్చిందని ప్రధాని ఆర్థిక సలహాదారు బృందం స్పష్టం చేసింది. ఆందువలన ఇక్కడ కొనుగోలు శక్తి పెంచకుండా పెట్టుబడులు వచ్చేస్తాయని అనుకోవడం భ్రమ.
కరోనా వైరస్ ప్రపంచంలో ఆరోగ్య సంక్షోభాన్ని, దానితోపాటే ఇప్పటికే ఉన్న ఆర్థిక సంక్షోభాన్ని మరింత తీవ్రం చేసింది. 1930లో సంక్షోభం, 2008లో సంక్షోభాలను తలదన్నే సంక్షోభం ఇది. ఈ నేపథ్యంలో అమెరికా, జపాన్ లాంటి సామ్రాజ్యవాద దేశాలు ఈ సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మల్చుకోవడానికి చైనా నుంచి పరిశ్రమలను బయటకి తీసుకువచ్చే తీవ్ర ప్రయత్నంలో మల్లగుల్లాలు పడుతున్నాయి. సందడిలో సడేమియా అన్నట్టు మోడీ భారతదేశంలోకి కూడా పెట్టుబడులు ఎగురుకుంటూ వస్తాయని అంచనా వేస్తున్నారు.
జపాన్ 1.9 ట్రిలియన్ డాలర్ల డబ్బు చేతపట్టుకుని చైనా నుంచి బయటికి వచ్చి కంపెనీలు పెట్టుకునే వారికి పెట్టుబడులకు సహకరిస్తామని బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నది. అమెరికా చైనా వైరెస్ కారణంగా ఈ ఆర్థిక సంక్షోభం వచ్చింది కాబట్టి కంపెనీలు చైనా నుంచి బయటకు వచ్చి అమెరికాలోనే కంపెనీలు పెట్టాలని చెపుతూ ఇతర ప్రాంతాలకు వెళితే ప్రతికారం ఉంటుందని హెచ్చరిస్తున్నది. భారతదేశం ఏమో చైనా నుంచి బయటకు వచ్చే కంపెనీలు భారతదేశాన్ని తమ సహజ కార్యక్షేత్రంగా ఎంచుకుంటాయని భావిస్తున్నది. కొంత లాబీయింగ్ కూడా మొదలు పెట్టి ఉండవచ్చు.
ఇతర దేశాలు చైనాకు ఎందుకు వెళ్ళి కంపెనీలు స్థాపించుకున్నాయి. ఈ అంశం అర్థం అయితే అక్కడ నుంచి కంపెనీలు బయటకు వస్తాయా రావా అనేది కూడా అర్థం అవుతుంది. రెండోది కరోనా సంక్షోభంలో అక్కడ ప్రభుత్వం ఏమన్నా కంపెనీల మీద తీవ్ర ఒత్తిడి చేసి పని చేయకుండా పరిస్థితులను సృష్టించిందా అంటే అదేమీ లేదు. కాబట్టి కంపెనీలు ఈ నేపథ్యంలో బయటకు పోవాలనే ఆలోచన చేయకపోవచ్చు. గతంలో అమెరికా నుంచి కూడా వైరస్లు పుట్టి ఇతర దేశాలకు పాకాయి. మరి అప్పుడు కంపెనీలు అమెరికా నుంచి వెళ్ళిపోయాయా. వెళ్ళలేదే.
ఇతర దేశాలు అసలు చైనాను ఎందుకు ఎంచుకున్నాయి. చైనాలో కంపెనీలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు బాగా ఉంటాయి. అక్కడ ముడిసరుకు లభ్యత పుష్కలంగా ఉంటుంది. నైపుణ్యం గల కార్మికులు అందుబాటులో ఉంటారు. దానితో ఉత్పాదకత ఎక్కువ ఉంటుంది. కంపెనీ స్థాపనం, ముడిసరుకు లభ్యత, నైపుణ్యం గల కార్మికులు, ఉత్పత్తి అయిన సరుకులకు సరైన మార్కెట్ చైనాలో పుష్కలం కాబట్టే అక్కడకి వెళ్ళాయి. నీళ్ళు పల్లం ఎరుగు అన్నట్టు పెట్టుబడి లాభం ఎరుగు అనేది మన సృహలో ఉండాలి.
మరో ముఖ్యమైన విషయం చైనాలో రవాణా సౌకర్యాలు చాలా ఆధునిక పద్ధతిలో ఉన్నాయి. ఆరులైన్లు, ఎనిమిది లైన్ల రోడ్లు ఉన్నాయి. 250 కిలోమీటర్ల స్పీడ్తో వాహనాలు వెళ్ళే సౌకర్యం ఉంది. ప్రపంచంలో అతిపెద్ద రవాణా కేంద్రాలు చైనాలో ఉన్నాయి. అందులో వూహాన్ ఒకటి. ఈ సౌకర్యాలను వదులుకోవడానికి ఎవ్వరు ఇష్టపడకపోవచ్చు. మరి ఈ పరిస్థితులలో అమెరికా, జపాన్, భారత్ ఎందుకు ఇంత తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయో ఆలోచిస్తే.. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 3న ఉన్నాయి. ట్రంప్ మళ్ళీ గెలవాలనే తీవ్ర ప్రయత్నంలో ఉన్నాడు. స్వదేశంలో ఆయన పదవీ కాలంలో ఇది సాదించాను అని చెప్పుకోవడానికి ఏమీలేదు. కరోనా వైరస్ కాలంలో కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, నోరు పారేసుకోవడంతో ప్రజలలో ఆయన పట్ల వ్యతిరేకత పెరిగింది. అందుకని చైనాను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తే ఓట్లు వస్తాయనే ఆశ. వైరస్ వల్ల జరిగిన నష్టపరిహారం ముక్కుపిండి వసూలు చేస్తాను అని అంటున్నారు. ఇదే సమయంలో అక్కడ నుంచి కొన్ని కంపెనీలైనా తెచ్చి అమెరికా భూభాగంలో కంపెనీలు పెట్టి అమెరికాలో ఉపాధి అవకాశాలు కలిగితే అది నా ఘనత అని చెప్పుకునే ప్రయత్నం ఇది. ఇది పారకపోవచ్చు. జపాన్ది కూడా సంక్షోభాన్ని ఒక అవకాశంగా వాడుకుని కొన్ని పరిశ్రమలనైనా తన స్వాధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నంలానే కనబడుతుంది.
ఇక భారతదేశం విషయానికి వస్తే ఆరేండ్ల పాలనలో కలలను అమ్ముకుని మోడీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతున్నది. నిరుద్యోగ సమస్య 45ఏండ్ల గరిష్టానికి చేరుకున్నది. వ్యవసాయ సంక్షోభం తీవ్రంగా మారి ఆత్మహత్యలు పెరిగాయి. కరోనా కారణంగా నగరాలు, పట్టణాలు తీవ్ర ఇబ్బందులలో ఉన్నాయి. అందుకని ఇప్పుడు ''వైరస్ కారణంగా చైనా నుంచి కంపెనీలు బయటకు రానున్నాయి, వాటిని మనదేశంలో వాల్చుకునే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాము, అవి త్వరలో ఇక యువతరానికి ఉపాధి చూపుతాయి, అవి వచ్చిన వెంటనే మీకు ఉద్యోగాలు వస్తాయి.'' ఇది మోడీ అమ్ముతున్న కల! భారతదేశంలో సరుకులు అమ్ముకునే అవకాశం లేనప్పుడు పెట్టుబడులు రావడం అంత సులభం కాదు. లాక్డౌన్ కంటే ముందే భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనంలోకి పోయిన విషయం తెలిసిందే. ప్రజల్లో కొనుగోలు శక్తి లేక, సరుకులు అమ్ముడుపోక పోవడం వలనే ఈ పరిస్థితి వచ్చిందని ప్రధాని ఆర్థిక సలహాదారు బృందం స్పష్టం చేసింది. ఆందువలన ఇక్కడ కొనుగోలు శక్తి పెంచకుండా పెట్టుబడులు వచ్చేస్తాయని అనుకోవడం భ్రమ.