Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ కరోనా సృష్టించిన విలయంలో అత్యంత బాధితులైన వలసజీవుల ఆకలి తీర్చడానికి 65వేల కోట్లు చాలన్నది ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ అంచనా. కానీ 20లక్షల కోట్ల భారీ ప్యాకేజీలో వారు ఆ మాత్రం కేటాయింపులకూ నోచుకోలేదు. వారే కాదు ఉత్పత్తికి చెమటను ధారపోస్తున్న ఏ వర్గానికీ ఈ ప్యాకేజీలో చోటేలేదు. వాళ్లూ ఈగడ్డ బిడ్డలే. ఈ మట్టి ముద్దలే. వాళ్ళను విస్మరించి దేశాన్ని ఎలా నిరన్మిస్తారు? ఎవరికోసం నిర్మిస్తారు?
అసమాన త్యాగాలు చేసి స్వేచ్ఛా పతాకాలనెగరేసిన నేల ఇప్పుడు నెత్తురోడుతోంది. ఏడు వసంతాల సంక్షేమ రాజ్యం సాధించిన స్వేచ్ఛాయుత అభివృద్ధిలో ''ఆకలి'' పుండై మండుతోంది. కరోనా విపత్తులో మన ఘరానా పాలకుల విధానాలకు పేద భారతం ఇంకా మూల్యం చెల్లిస్తూనే ఉంది. భారత ప్రభుత్వం ప్రజల కోసం 20లక్షల కోట్ల ఘనమైన ప్యాకేజీ ప్రకటించినా.. ఇంకా రహదారులపై ఆకలిజీవుల మహాపాదయాత్ర ఎందుకు సాగుతోంది? గుండెలు పిండేసే మానవ మహావిషాదాన్ని రక్తాక్షరాలతో ఎందుకు లిఖిస్తోంది?! ఉద్యోగాలు పోయి, ఉపాధి పోయి ఉనికి కోసం ఊరు దారి పట్టిన వారికి ఈ ప్యాకేజీ ఇచ్చిందేమిటి? భూమిని పండించి మనిషిని పోషిస్తున్న వారికి ఈ ప్యాకేజీలో వచ్చిందేమిటి? ఈ దేశ నిర్మాణానికి తమను తాము అర్పిస్తున్న అసంఖ్యాకమైన శ్రామికశక్తికి ఈ ఆర్థిక ప్యాకేజీలో దక్కిందేమిటి?
ఏలినవారి మాటలు మహా తీపి. కానీ చేతలు మాత్రం మహా చేదు. ఇది పేరుకే ఇరువైలక్షల కోట్ల కరోనా ప్యాకేజీ. ఇందులో అత్యధిక భాగం రుణాలూ, రుణవిధానాలే కాగా ప్రభుత్వం నేరుగా ఖర్చుపెట్టేది సుమారుగా రెండు లక్షల కోట్లు మాత్రమే. ఇది మన జీడీపీలో ఒకశాతానికి మించదు. మరి 137 కోట్లమంది ఉన్న దేశం ఆకలి ఎలా తీరుతుంది? ఈ ఆర్థిక వ్యవస్థ ఎలా కోలుకుంటుంది? ప్రధాని ప్యాకేజీ ప్రకటన, ఆర్థిక మంత్రి సుదీర్ఘ వివరణల అనంతరం మిగిలింది ఇలాంటి అనేక సందేహాలే. వీటికి సమాధానంగా మన దేశంలోనే కాదు, ప్రపంచ దేశాలన్నిటా జరుగుతున్నది ఇదేనని చెపుతున్నది ప్రభుత్వం. ఇది ఈ ప్యాకేజీని మించిన మరో పచ్చి అబద్ధం. ఆకలితీరాలన్నా, ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలన్నా ప్రజల చేతుల్లోకి నేరుగా నగదు బదిలీ కావాలన్న ఆర్థికవేత్తల సూచనలను పెడచెవిన పెట్టిన ప్రభుత్వం.. ప్రపంచ దేశాల అనుభవాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్న దాఖలాలే లేవు. ప్రజలు, ప్రజల ప్రాణాలే ప్రాధాన్యతగా వ్యవహరించే సోషలిస్టు దేశాల విధానాలను అనుసరించడానికి ఇష్టపడని ఈదేశ ఏలికలు, తాము అడుగులకు మడుగులొత్తే పెట్టుబడిదారీ దేశాల నుంచి కూడా పాఠాలు నేర్చుకోవడానికి సిద్ధపడకపోవడం ఓ వింత.
ఉదాహరణకు, పచ్చి ప్రజా వ్యతిరేకి, మన ప్రధాని మోడీకి ఆదర్శప్రాయుడు అయిన ట్రంప్ ఏలుబడిలోని అమెరికాలోనే చూద్దాం.. ''పే చెక్ ప్రొటక్షన్ ప్రోగ్రాం'' కింద పరిశ్రమలకు రుణాలు మంజూరు చేయడమే గాక, ఆ రుణాలను ఉద్యోగులను తొలగించకుండా వారి వేతనాలకోసం లేదా కొత్త ఉద్యోగాల నియామకం కోసం ఉపయోగించినట్టయితే తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించింది ప్రభుత్వం. ఇక యూకేలో ''వేజ్ ప్రొటక్షన్ ప్యాకేజ్'' కింద ప్రతి నెలా నేరుగా 2500 పౌండ్ల మేరకు 80శాతం ఉద్యోగుల వేతనాలను తామే చెల్లిస్తామని ముందుకొచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం. జపాన్ ప్రభుత్వం ప్రతి పౌరుడికి ప్రతి నెల 930 డాలర్ల సొమ్మును నేరుగా అందిస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే.. మార్కెట్ శక్తుల ప్రయోజనాలే తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోని ఇలాంటి అనేక పెట్టుబడిదారీ దేశాలు, తమ వర్గ ప్రయోజనాల కోసమే అయినా తప్పనిసరి పరిస్థితుల్లో కార్మికులకూ ఎంతోకొంత ఉపశమనాన్ని కలిగిస్తూ నిర్దిష్టమైన ఉద్దీపనలతో ముందుకు సాగుతున్నాయి. కానీ సంక్షేమ రాజ్యమని చెప్పుకుంటున్న మనదేశంలో కష్టజీవుల పట్ల ఆ మాత్రం కనికరమూ లేకపోవడం విషాదకరం. మన ప్రభుత్వం కూడా ప్రకటనలు అనేకం చేసింది. కానీ వాటి అమలుకు ఈ ప్యాకేజీలో అస్కారమేది. ''యాజమాన్యాలేవీ ఉద్యోగులను తొలగించకూడదు. జీతాలు నిలిపివేయడమూ, జీతాల్లో కోత విధించడమూ చేయకూడదు'' అని ప్రధాని పిలుపునిచ్చారు. కానీ జరుగుతున్నదేమిటి? నిర్దిష్టమైన కేటాయింపులూ అవసరమైన చర్యలూ, చేతలూ లేకుండా ఊరికే మాటలు చెపితే మంత్రాలకు చింతకాయలు రాలతాయా..!
ఇక్కడొక విషయాన్ని గమనించాలి. భారత ఆర్థిక వ్యవస్థలో ఎంఎస్ఎంఈ (మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రెజెస్) లది అత్యంత కీలకస్థానం. దేశ స్థూల జాతీయోత్పత్తిలో 28శాతం, దేశ శ్రామిక శక్తిలో 30శాతం, దేశ ఎగుమతులలో 50శాతం ఈ ఎంఎస్ఎంఈలే కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అలాంటి రంగంలో ఉద్యోగులకు నేరుగా కేటాయింపులు లేకపోగా రుణాలు కూడా కేవలం 8శాతం పరిశ్రమలకే వర్తిస్తాయని స్వయంగా ఆర్థిక మంత్రే సెలవిచ్చారు. ప్రభుత్వ ఉద్దీపనల, ఉద్దేశాల సారాంశాన్ని అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. అంటే ఈ రుణ కేటాయింపులు కూడా ఇటు ప్రజల కోసమూ గాక, అటు అత్యధిక శ్రామిక శక్తికి ఆశ్రయమిస్తున్న చిన్న, మధ్య తరహా పరిశ్రమలకూ గాక ఎవరి కోసం? పిడికెడు మంది బడా కార్పొరేట్ల కోసమేనా? ఏలిన వారి దృష్టిలో దేశమంటే ఈ పిడికెడు మంది బడాబాబులేనా? దేశభక్తి అంటే ఈ బడాబాబుల సేవలో తరించడమేనా? ఇంతటి విపత్తులోనూ తన వర్గ ప్రయోజనాలను మరువని పాలికలు మరిచింది ప్రజలనే అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏంకావాలి? ఈ కరోనా సృష్టించిన విలయంలో అత్యంత బాధితులైన వలసజీవుల ఆకలి తీర్చడానికి 65వేల కోట్లు చాలన్నది ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ అంచనా. కానీ 20లక్షల కోట్ల భారీ ప్యాకేజీలో వారు ఆ మాత్రం కేటాయింపులకూ నోచుకోలేదు. వారే కాదు ఉత్పత్తికి చెమటను ధారపోస్తున్న ఏ వర్గానికీ ఈ ప్యాకేజీలో చోటేలేదు. వాళ్లూ ఈగడ్డ బిడ్డలే. ఈ మట్టి ముద్దలే. వాళ్ళను విస్మరించి దేశాన్ని ఎలా నిర్మిస్తారు? ఎవరికోసం నిర్మిస్తారు?