Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వామపక్షాలు, ప్రతిపక్షపార్టీలు, ప్రజాసంఘాలు, అమర్త్యసేన్, అభిజిత్ బెనర్జీ వంటి ఆర్థికవేత్తలు ప్రజల కొనుగోలు శక్తి పెరిగే నిర్ణయాలు తీసుకోవాలని కోరుతూ వస్తున్నారు. ఉపాధిలో నెలకొన్న సంక్షోభం నుంచి బయటపడాలంటే ప్రతీ రంగంలో ప్రోత్సాహకాలు పెంచాలి. ఇప్పటికే ఆరేండ్లుగా అనేక ఇబ్బందులతో దేశప్రజానీకం సతమవుతున్నది. కరోనావైరస్తో మరింత ఆందోళనగా ఉన్న ప్రజల్లో భరోసా నింపాల్సిన తక్షణ కర్తవ్యం మోడీ ప్రభుత్వంపైనే ఉంది.
కేంద్రప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల దేశంలో మందగమనం వచ్చింది. దానిమీద కరోనా.. ఫలితంగా లాక్డౌన్.. ఇలా ఒకదాని వెంట మరోటి దాడి చేయడంతో ప్రస్తుతం ఉపాధిరంగం సంక్షోభంలో పడింది. ఉపాధి కోల్పోయి కోట్లమంది విలవిలలాడుతున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏడాదికి రెండు కోట్లమందికి ఉపాధి కల్పిస్తామని ఆరేండ్ల క్రితం చెప్పిన మోడీ.. ఇప్పటివరకు అదనంగా ఉద్యోగాలు కల్పించింది శూన్యం. మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అంటూ గొప్పలు చెప్పారు. అంతేకాదు ఇతర దేశాల పెట్టుబడుల రాకతో కావల్సినంత మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పిన మాటలు నీటమూటలుగానే మిగిలాయి. చైనా నుంచి కంపెనీలు రాబోతున్నాయని, ఉద్యోగాల కోసం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదంటూ మోత మోగించారు. కేంద్రం చెప్పగానే వాటికోసం కార్మిక చట్టాలను చాపలో చుట్టేసి అటకెక్కించాయి బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు. ఆ దేశం నుంచి కంపెనీలు రాకపోగా, కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు మనదేశం నుంచి తరలి పోయాయి. విదేశీ కంపెనీలు దేవుడెరుగు కనీసం భారత్ కంపెనీలైనా చైనా నుంచి రాలేదు. చైనా ఆర్థికంగా ఇబ్బందులు పడినా, అంతర్గతంగా తన వృద్ధిరేటు తగ్గినా తమ దేశ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తగా చూసుకోగలిగింది. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగే నిర్ణయాలు తీసుకుంటుంది. మనదేశంలో మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి గానీ, ఉపాధిని పెంచేందుకు గానీ ఏ మాత్రం తోడ్పాటునందించలేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉపాధి పరిస్థితిపై సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఇఈ) విడుదల చేసిన తాజా సర్వే మరింత ఆందోళనకు గురిచేస్తున్నది. లాక్డౌన్ అనంతరం దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి సుమారు పదికోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని వెల్లడించింది. కొత్తగా ఉద్యోగంలో చేరిన 30ఏండ్ల వయసు కలిగిన 2.7కోట్ల మంది యువత ఈ ఏప్రిల్ మాసంలోనే నిరుద్యోగులుగా మారారంటే సంక్షోభం ఎంతటి తీవ్రస్థాయిలో ఉందో అర్థమవుతుంది. బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న పెట్టుబడిదారీ అనుకూల, శ్రామిక వ్యతిరేక విధానాలే నిరుద్యోగం తారాస్థాయికి పెరగడానికి కారణమన్నది వాస్తవం.
ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్(ఐఎల్ఓ) సర్వే ప్రకారం 2018-19కి భారత్లో నిరుద్యోగిత రేటు 3.5 శాతం ఉండగా, 2020 మార్చి నాటికి నిరుద్యోగిత రేటు 9శాతం పెరుగుతుందనీ సీఎంఇఈ గతంలోనే ప్రకటించింది. లాక్డౌన్ వల్ల నిరుద్యోగం గ్రామాల్లో 22.8శాతం. పట్టణాల్లో 28శాతంగా నమోదైందని లెక్కలు తెలియజేస్తున్నాయి. లాక్డౌన్ తర్వాత చిన్న తరహా పరిశ్రమలు మూతపడ్డాయి. ఆ రంగం, ఈ రంగం అన్నది లేకుండా అన్నిచోట్ల పనుల్లేక సుమారు 14కోట్లమంది పట్టణాల నుంచి గ్రామాలకు తరలిపోయారు. వీరే గాకుండా పని ఉన్నప్పుడే పనుల్లోకి వెళ్లే అడ్డాకూలీలు. ఇప్పుడు వీరంతా నిరుద్యోగసునామీలో చిక్కుకున్నారు. గ్రామాల్లో ఉన్నవారికే పనులు లేనప్పుడు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారందరికీ ఉపాధి దొరకడం కష్టమే. పనులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నా ఆ రకమైన పథకాలను రూపొందించిందెక్కడీ ఉపాధిహామీ చట్టాన్ని మరింత పటిష్టంగా అమలుపరిచినా ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది. అలాంటి ఆలోచన, ప్రణాళిక కేంద్రం వద్ద లేదని రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ వెల్లడిలోనే అర్థమైంది.
కరోనాకు ముందే దేశంలోని ఎంఎస్ఎంఈలు జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు కారణంగా తీవ్రసంక్షోభంలో ఉన్నాయి. ఆర్థికమాంద్యం కూడా తోడవడంతో అవి మరింత నష్టాల్లోకి వెళ్లాయి. దీని ఫలితంగానే వేలాది పరిశ్రమలు మూతపడ్డాయి. గతంలో వాటిని ఆదుకునేందుకు ఎలాంటి చర్యలను మోడీ సర్కార్ తీసుకోలేదు. కార్పొరేట్లకు, విదేశీ కంపెనీలు, పారిశ్రామికవేత్తలకు మేలు చేకూర్చే పనులను మాత్రమే అమలు చేసింది. ప్రస్తుత లాక్డౌన్తో ఉపాధి హామీ చట్టానికి అదనంగా నిధులు కేటాయించినా, ఎంఎస్ఎంఈలకు రుణాలు కల్పిస్తామని చెబుతున్నా దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నది ఆర్థికవేత్తల అభిప్రాయం. నేరుగా ప్రజల చేతుల్లోకి నగదును ఇవ్వకుండా పైకెన్ని తెచ్చినా అవన్నీ పైపై పూతలే. ప్రస్తుత విధానాలతో ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం చాలా కష్టం. ప్రపంచంలో మొదటగా కరోనా వైరస్తో దెబ్బతిన్న చైనా నుంచి ఈ విషయంలో నేర్చు కోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది. మరికొన్ని దేశాలు వివిధ రూపాల్లో ప్రజల చేతికి నగదు అందేలా చూసాయి. అంతెందుకు వామపక్ష పాలిత రాష్ట్రమైన కేరళ ప్రభుత్వం రూ.20 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించి, అమలు చేస్తున్నది. ప్రపంచమంతా కేరళ మోడల్ను ప్రశంసిస్తుంటే, దానిని దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ముందుకు రావడానికి మోడీ సర్కార్ అందుకు సిద్ధంగా లేదు. వామపక్షాలు, ప్రతిపక్షపార్టీలు, ప్రజాసంఘాలు, అమర్త్యసేన్, అభిజిత్ బెనర్జీ వంటి ఆర్థికవేత్తలు ప్రజల కొనుగోలు శక్తి పెరిగే నిర్ణయాలు తీసుకోవాలని కోరుతూ వస్తున్నారు. ఉపాధిలో నెలకొన్న సంక్షోభం నుంచి బయటపడాలంటే ప్రతీ రంగంలో ప్రోత్సాహకాలు పెంచాలి. ఇప్పటికే ఆరేండ్లుగా అనేక ఇబ్బందులతో దేశప్రజానీకం సతమవుతున్నది. కరోనావైరస్తో మరింత ఆందోళనగా ఉన్న ప్రజల్లో భరోసా నింపాల్సిన తక్షణ కర్తవ్యం మోడీ ప్రభుత్వంపైనే ఉంది.