Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డబ్బులు ఇవ్వడం ఇష్టంలేని కేంద్రం, ఆర్థిక వ్యవస్థ బాగు పేరుతో రాష్ట్రాలకు మొండిచేయి చూపెడుతున్నది. తమ రాజకీయ ప్రయోజనాల కోసమే బడాబాబులకు ప్రాధాన్యతనిస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది.
కరోనా నివారణకు దేశంలో లాక్డౌన్ను విధించి ఇప్పటికి 72రోజులు. ప్రారంభదశలోనే వైరస్ను అరికట్టడంలో విఫలమైన కేంద్రం, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టింది. కేసులు పెరుగుతున్న క్రమంలో ఆర్థిక వ్యవస్థను సరిచేసే పేరుతో ఇప్పుడు క్రమంగా లాక్డౌన్ ఎత్తేసే ప్రయత్నాల్లో ఉన్నది. ఒకవైపు లాక్డౌన్ సడలిస్తూ, మరోవైపు టెస్ట్లు అవసరంలేదనే వైఖరిని ప్రదర్శిస్తున్నది. ఇదే ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ప్రాథమిక సూత్రం టెస్ట్, ట్రేస్, ట్రీట్ విధానాన్ని సక్రమంగా అమలుచేయని నేపథ్యంలో పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతున్నది. పేదలకు బియ్యం, కొంత నగదును ఇవ్వడం మంచి పరిణామమే అయినా కానీ అసలు సంగతి పక్కకుపోయింది. కరోనాను ఎదుర్కోవాలంటే ఒకే ఒక్క మార్గం విరివిగా టెస్ట్లు చేయడం. కేసులు పెరుగుతున్న తరుణంలో లాక్డౌన్ నిబంధనలు సడలించరాదని డబ్ల్యూహెచ్వో అత్యవసర విభాగం ఇన్ఛార్జి డాక్టర్ మైక్ర్యాన్ ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో విరివిగా టెస్ట్లు చేయకుంటే పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదముందనీ, దేశంతోపాటు రాష్ట్రమూ మరో ఇటలీ, స్పెయిన్, అమెరికా తరహా పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావచ్చని వైద్యనిపుణులు హెచ్ఛరిస్తున్నారు. వచ్చే రెండు నెలలు మనకు అత్యంత కీలకం. రోజుకు లక్ష మందికి చికిత్సనందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. కానీ టెస్ట్లు చేయడానికి మాత్రం వెనుకాడుతున్నది. 'ఈ టెస్ట్లు ఎవరికి పడితే వారికి చేసేవికావు. అవసరమున్నవారికే' నంటూ పదే పదే ఒకే మాటను వల్లెవేస్తున్నది. కేసులు పెరుగుతాయనే భయమే టెస్ట్లు చేయకపోవడానికి కారణం. ఒకవేళ టెస్ట్లు చేయకుండా కరోనా వ్యాధిగ్రస్తులు సమాజంలో తిరుగుతుంటే, ఆతర్వాత జరిగే పరిణామాలు ఎదుర్కోవడం మరింత దుర్లభమవుతుందనే కఠిన వాస్తవాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. మందే లేనప్పుడు చికిత్స ఎలా చేస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అందుకే టెస్ట్లు చేయడం, పాజిటివ్ వచ్చినవారిని ఐసోలేషన్ చేయడం కీలకం. ఈవిషయంలో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపిస్తున్నది. రాష్ట్రాలను ఆ దిశగా నడిపించడంలోనూ తప్పటడుగులు వేస్తున్నది. వైరస్తో సహజీవనం చేయకతప్పదని మోడీ ప్రభుత్వం చెబుతున్నది. లాక్డౌన్ను కొనసాగిస్తే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందంటూ ప్రచారానికి పూనుకుంది. వైరస్ను అరికట్టడానికి అవసరమైన ఏర్పాట్లు చేయకుండా, రాష్ట్రాలకు నిధులు ఇవ్వకుండా పత్రికా ప్రకటనలు, ప్రెస్మీట్లతోనే సరిపెట్టింంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడమే కీలకమన్న పద్ధతిలో వ్యవహరిస్తున్నది. ఈ ఆలోచన సరైందా? ఇలాంటి విధానంతోనే ఉన్న అమెరికా ఇప్పుడు కరోనా తాకిడికి వణికిపోతున్నది. ట్రంప్ వైఖరితో ఆ దేశ ప్రజలు అల్లాడుతున్నారు. బుధవారం నాటికి ఆ దేశంలో కరోనాబారిన పడి లక్షా 539మంది చనిపోయారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చెప్పుకున్న అమెరికా తీసుకున్న విధానఫలితమిది. ఇక మన దేశంలో కేరళ ప్రభుత్వం మనుషులను బతికించుకోవడమే ప్రధాన ధ్యేయంగా పనిచేసింది. ఆ దిశగా సత్ఫలితాలను చూస్తున్నాం. తెలంగాణ సైతం కొంత ముందే ఊహించింది. షాపింగ్ మాళ్లు, సినిమా థియేటర్లు, హోటళ్లు, విద్యాసంస్థలను మూసేసింది. పేదలకు బియ్యం, డబ్బు అందజేయడం మంచి ప్రయత్నమే. గాంధీ ఆస్పత్రిని పూర్తిస్థాయి కోవిడ్ హాస్పిటల్గా మలచడం తదితర పనులు వేగంగా చేసింది. అంతర్జాతీయ విమానాలను ఆపాలంటూ కేంద్రం కండ్లు తెరిపించింది. ఏపీ ప్రభుత్వమూ కొంత స్పందించింది. ఈ మొత్తం ప్రక్రియలో లాక్డౌన్ను ప్రకటించడం తప్ప ఎలాంటి బాధ్యత తీసుకోనిది కేంద్ర ప్రభుత్వమే. ఈనేపథ్యంలో వచ్చే జూన్ ఒకటి నుంచి ఏంచేయాలనే విషయమై సమాలోచనలు జరుగుతున్నాయి. కరోనాకు ఇంకా మందేలేని నేపథ్యంలో విస్తృతంగా వైద్యపరీక్షలు చేయడం ద్వారా మాత్రమే దీనిని ఎదుర్కోగలమని ఇప్పటికే ప్రపంచానుభవం నిరూపించింది. మన దేశంలోనూ కేరళ సైతం రుజువుచేసింది. ఇప్పుడు ప్రధానమైంది టెస్ట్లు చేయడం. అవసరమైన మేరకు ఐసోలేషన్ కేంద్రాలను విస్తృతంగా ప్రారంభించి పౌష్టికాహారాన్ని అందించడం ముఖ్యం. ఏ మేరకు లాక్డౌన్ సడలిస్తే, ఆమేరకు వైద్య పరీక్షలు విస్తరించాలి. ప్రజల చేతుల్లోకి డబ్బు చేర్చాలి. ఇవి తక్షణావసరం. రాష్ట్ర ప్రభుత్వం టెస్ట్లు అవసరంలేదనే నిర్ణయం తీసుకుంది. ఇది ప్రమాదకరం. మరోవైపు ఖర్చుకు వెనుకాడుతున్నారు. ఇది ఎంతమాత్రం సహించరానిది. ఇప్పుడు కావాల్సిందల్లా రాజకీయ చిత్తశుద్థి, డబ్బు. కేంద్రంపై ఒత్తిడి తేవాలి. కలిసొచ్చే రాష్ట్రాలను కలుపుకుపోవాలి. కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐసాక్ ఇప్పటికే పిలుపునిచ్చారు. అయినా మన రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పటికైనా చురుగ్గా కదలాలి. కేంద్రం బాధ్యతారాహిత్యంపై నిలదీయాలి. డబ్బులు ఇవ్వడం ఇష్టంలేని కేంద్రం, ఆర్థిక వ్యవస్థ బాగు పేరుతో రాష్ట్రాలకు మొండిచేయి చూపెడుతున్నది. తమ రాజకీయ ప్రయోజనాల కోసమే బడాబాబులకు ప్రాధాన్యతనిస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది.