Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రాణం విలువ తెలియని వాళ్ళు
పాలకులైతే
రక్షణ కవచాలే మారణాయుధాలై
ప్రాణాలు తీస్తాయి!
'నారాయణుడే' వైద్యుడని బుకాయించే వాళ్ళు
నేతలైతే
మందు గోళీలే విషపు గుళికలై, మనుషుల
మరణ శాసనం రాస్తాయి! - దేశంలో, మరీ ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇప్పుడు ఇదే జరుగుతూ ఉంది. సుతిమెత్తని కబుర్ల మాటున సొంత ఇండ్లు చక్కబెట్టుకోవడంలో సిద్ధహస్తు లైన కమలనేతలు ఇప్పుడు కరోనా మహమ్మారిని సైతం వదలకుండా తమ విశ్వరూపం ప్రదర్శిస్తూ ఉన్నారు. ప్రధాని మోడీ కనుసన్నలలో పాలన సాగే ఆయన సొంత రాష్ట్రం గుజరాత్లో, వారి పార్టీ బీజేపీ ఏలికలోని హిమాచల్ప్రదేశ్లో చోటు చేసుకున్న కరోనా కుంభకోణాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనాలు. మందులేని కోవిడ్ మహమ్మారి నుంచి ఎంతోకొంత రక్షించగల వెంటిలేటర్లు, వైద్య పరికరాల కొనుగోలులో బీజేపీ నేతలు పాల్పడిన అవినీతి విష సర్పాలు సైతం సిగ్గుపడేలా ఉంది. విష సర్పాలు కేవలం తమకు హాని చేస్తారని భావించిన వారినే కాటేస్తాయి, కానీ కమలనాథులు మాత్రం తమను గద్దె నెక్కించి ఎంతో మేలు చేసిన అమాయకపు ప్రజలనే అన్యాయంగా కాటేసేందుకు పూనుకున్నారు.
ప్రధాని మోడీ స్వరాష్ట్రం గుజరాత్, పాలకపార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వరాష్ట్రం హిమాచల్ ప్రదేశ్లలో కరోనా కుంభకోణాలు చోటు చేసుకోవడం యాదృచ్ఛికంగా మాత్రం భావించలేం. గుజరాత్లో మోడీ ప్రియ శిష్యుడు, ముఖ్యమంత్రి విజరు రూపాని ఆరోపణలు ఎదుర్కొంటుండగా, హిమాచల్ప్రదేశ్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రియ శిష్యుడు, రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ బృందాల్ ఆరోపణల నేపథ్యంలో ఏకంగా రాజీనామానే చేశారు. గుజరాత్లో ముఖ్యమంత్రి విజరు రూపానికి అత్యంత సన్నిహితుడైన పరాక్రమ సింహ జడేజా సీఎండీగా ఉన్న 'సీఎన్సీ ఆటోమేషన్ లిమిటెడ్' నుంచి ప్రభుత్వం ఐదు వేల వెంటిలేటర్లను కొనుగోలు చేసింది. అలాగే, ఇదే కంపెనీ అహ్మదాబాద్లోని అతిపెద్ద కోవిడ్ ఆస్పత్రికి బ్రీతింగ్ మెషిన్లను కూడా సరఫరా చేసింది. అయితే, ఇవన్నీ చాలా నాసిరకమైన, కనీస ప్రమాణాలు పాటించని పరికరాలని వైద్యుల పరిశీలనలో వెల్లడైంది. కాగా, ఈ కొనుగోళ్ళకు ఆ కంపెనీకి చెల్లించిన నిధులు ప్రధాని 'పీఎం కేర్ ఫండ్' నుంచి దేశీయంగా తయారైన వెంటిలేటర్ల కొనుగోలు కోసం కేటాయించిన రెండు వేల కోట్ల లోనివి కావడం గమనార్హం. కేవలం ప్రధాని మాత్రమే సర్వ హక్కులూ కలిగిన 'పీఎం కేర్ ఫండ్' నుంచి ప్రధానికి తెలియకుండా, ఆయన అనుమతి లేకుండా నిధులు విడుదలయ్యాయని భావిస్తే అది కేవలం అమాయకత్వమే అవుతుంది. ఎందుకంటే, కరోనా లాంటి కష్టాల నుంచి ప్రజలను ఆదుకునేందుకే ప్రధాని ఎలాంటి ఆడిట్ల గొడవ లేకుండా సర్వస్వతంత్రంగా, సర్వాధికారాలతో 'పీఎం కేర్ ఫండ్ 'ను ఇటీవలే ఏర్పాటు చేసుకున్నారు మరి!
మన భారతీయ సాంప్రదాయంలో సన్యాసులకు గౌరవం, విలువ అధికం. సమాజ శ్రేయస్సు కోసం సొంత జీవితాన్ని త్యజించిన త్యాగధనులుగా ప్రజలు సన్యాసులను కొలుస్తారు. ఆరాధిస్తారు. నమ్ముతారు. నమ్మి, తమ జీవితాలకు సంబంధించిన నిర్ణయాధికారాలను వారికి సమర్పించుకుంటారు. ఇందులో నమ్మకం తప్ప మరెలాంటి కారణమూ, తర్కమూ ఉండదు. కారణం, తర్కంలేని నిర్ణయాలకు బలిపశువులు తప్ప బాధ్యులు ఉండరు కదా?! కాబట్టి, తమ ద్వారా ప్రేరేపితమై తీసుకున్న నిర్ణయాల ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న జీవర్మణ సమస్యలకూ సన్యాసులు ఎలాంటి బాధ్యతా స్వీకరించరు. సరికదా, కనీసం జాలి కూడా చూపించరు. పైపెచ్చు, ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి కష్టమూ వారి పాపపరిష్కారంలో భాగమేననీ, ఇప్పుడు ఈ కష్టాలు కిమ్మనకుండా అనుభవిస్తే, వచ్చే జన్మలో కండ్లు చెదిరే సుఖాలు అనుభవిస్తారని కథలు చెబుతారు. ఇది వారి సిద్ధాంతం. ఇదే వారి సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని మత్తు మందులా ప్రజలపై చల్లి చల్లగా అధికార పీఠాలను అధిష్టించేశారు. అధిష్టించేసి, ఇప్పుడు తమ అసలు రూపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. 'మమ్మల్ని నమ్మడం మీ నేరం తప్ప, మిమ్మల్ని మోసగించడం మా తప్పెలా అవుతుందని' తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళుతున్నారు.
2014 నుంచి ప్రతి ఎన్నికల సందర్భంలోనూ ప్రధాని మోడీని, ఆయన పరివారాన్నీ దేశ ప్రజలు సన్యాసులుగానే స్వీకరించారు. సన్యాసులు అంటే సొంత కుటుంబం, వ్యక్తిగత స్వార్థంలేని సేవాతర్పరులుగా భావించే తమను పాలించే అధికారాన్ని అప్పగించారు. కొన్ని అనుమానాలు, భయాలూ వారిస్తూ ఉన్నా తమ భవిషత్ను వారి చేతుల్లో పెట్టారు. అయితే, కనిపించే వేషం, వినిపించే మాటలో సన్యాసిత్వం ఉట్టిపడినంత మాత్రాన వారి మనసులు నిష్కల్మషం కానక్కరలేదని కరోనా కాలంలో కాషాయ పాలకుల చేతలు చాచికొట్టి చెబుతున్నాయి. మేలుకుంటారు ప్రజలు. మేలుకుని మేకవన్నె పులులకు మంచి గుణపారం నేర్పి, తమ జీవితాలను తామే ఏలుకుంటారు!