Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా విపత్తు కాలాన అధికారంలో ఉన్నవారు ఎలా వున్నారు, ఎలా వ్యవహరించారు, మనుషులు ఏవిధంగా మెలిగారో చరిత్రలో రికార్డు అవుతుంది. ఆ చరిత్ర ముందు దోషులుగా నిలబడరాదంటే మానవత్వం వెల్లివిరియాలి. ఇది తొలుత పౌరుల పట్ల బాధ్యతగా మెలిగే విధానకర్తల మాటల్లో చేతల్లో ప్రతిఫలించాలి. అపుడే మానవత్వానికి సార్థకత, మనిషితనానిది కీర్తిపతాక.
మానవత్వం గురించి తరచుగా మాట్లాడుతుంటారు. మానవత గురించి కవులు కవితలల్లుతారు. సాధారణ సమయాల్లో మానవవిలువల గురించి ఎన్నో ప్రబోధిస్తారు. కానీ విపత్తులు చెలరేగిన సమయంలోనే మానవతకు అసలుసిసలు పరీక్ష ఎదురవుతుంది. మనుషుల్లో మానవత్వం ఏమేరకు మిగిలివున్నదో రుజువవుతుంది. కరోనా కల్లోల కాలం నిజమైన పరీక్షా సమయం. అనుమానాలే పెనుభూతాలై మనుషుల్ని వెక్కిరిస్తాయనే మాట ఇపుడు అంతటా కనిపిస్తున్న దృశ్యం. తల్లీ కొడుకులకీ, అయినవాళ్ళకీ మధ్యన సంబంధాలు ఎలా వుంటాయో చెప్పకనే తేటతెల్లమవుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో సొంత తల్లిని ఇంట్లోకి రానివ్వని ఉదంతం వింటే అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం అన్న సినిమా పాట అక్షరసత్యం కదా అనిపిస్తుంది.
ఆ తల్లికి కరోనా లేదు, కానీ షోలాపూర్లోని కూతురు దగ్గర్నించి కొడుకు చెంతకు వచ్చింది. కానీ కొడుకు ఇంట్లోకి రానివ్వడానికి నిరాకరిస్తే ఆ తల్లి గుండె పగలదా? చివరకు ఎవరో ఏదో సర్దుబాటు చేసి ఇంట్లోకి పంపించారు. కానీ కరోనా విపత్తు కాలాన బంధాలకీ, అనుబంధాలకీ విలువ ఎక్కడీ పరాయి ప్రాంతాల్లో ఉండలేక చావైనా, బతుకైనా సొంత ఊళ్ళోనే అని వచ్చేవారిని అనుమానంగా చూడటమే కాదు, అడ్డుకోవడం, ఘర్షణ పడటం వంటి ఉదంతాలు ఏం చెబుతున్నాయి? అలాగే గర్భిణీ అని తెలిసినప్పటికీ ఒక మహిళని అపార్ట్మెంట్లోకి రానివ్వని మధ్యతరగతి కూపస్థ మండూకాల్లో మానవత్వం ఎక్కడ దాగుంది? కరోనా బాధితులకు సేవ చేయడం, చికిత్స అందించడమే పాపం అన్నట్టుగా డాక్టర్ల పట్ల, నర్సుల పట్ల ఇరుగుపొరుగు వారి దుర్మార్గ ప్రవర్తన ఎంత అమానవీయం?
మానవతా నీవెక్కడీ అని గొంతెత్తి ఘోషించాల్సిన పరిస్థితి మనిషితనానికి అవమానకరం. ఈ అమానవీయ పరిస్థితులు కరోనా విపత్తు విజృంభణకు దారితీస్తాయి. కరోనా ఉందనే విషయం చెప్పడానికి, చెప్పుకోడానికి భీతిల్లే పరిస్థితి సరయింది కాదు. ఈ భయం కారణంగా కరోనాని దాచిపెడితే అది వారికే కాదు, చుట్టుపక్కల వారికి ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అందుకే కరోనా వ్యాధి బాధితుల పట్ల ప్రవర్తనా తీరులో మార్పు రావాలి. అంతేగాక కరోనాకు సంబంధించిన నిరాధారిత భయాల్ని, అనుమానాల్ని వదులుకోవాలి. జాగ్రత్తపడాలి. కానీ జాగ్రత్త పేరిట సాటి మనుషుల్ని అనుమానించే, అవమానించే ప్రవర్తన అనుచితం.
ఈ విషయంలో ప్రభుత్వాల నిష్క్రియాపరత్వం క్షమార్హం కాదు. ఎక్కడికక్కడ పరీక్షలు చేయాలి. కరోనా పట్ల నిర్దిష్టమైన అవగాహన కల్పించాలి. వ్యాధిగ్రస్తులకు సరైన వసతులతో కూడిన క్వారంటైన్, చికిత్స అందించాలి. కానీ అవి లోపించిన ఫలితంగానే అనేకమంది ప్రభుత్వం నిర్దేశించిన చోట్ల ఉండలేక బయటకు వస్తున్నారు. కరోనా బాధితులను శత్రువులుగా చూడకూడదని మాట మాత్రంగా చెబితే సరిపోదు. దానికి సంబంధించిన విస్తృత ప్రచారం, చైతన్యం కల్పించాలి. అంతేగాక వ్యాధి బారిన పడినవారికి తగిన సదుపాయాలతో కూడిన చికిత్స లభిస్తుందన్న భరోసా కల్పించాలి. ఆ భరోసా లోపించిన ఫలితంగానే కరోనా పట్ల భయానక వాతావరణం నెలకొన్నది. ప్రభుత్వాల అపసవ్య విధానాల ఫలితంగా మనుషుల నడుమ పరాయీకరణ పెరిగింది. మనిషికి మనిషికీ నడుమ ఎడం హెచ్చింది. మానవత నగుబాటు పాలై విలపిస్తున్నది.
బతకడం, బతుకు కోసం తండ్లాడటం మృత్యుపరిహాసంగా పరిణమించిన క్షణాన ఊపిరి తీసుకుంటున్న వారిని చూస్తున్నాం. కరోనా విపత్తు మనుషుల్ని చావు సమీపానికి తీసుకెళ్ళడం కాదు, చావే నయం అనుకునే పరిస్థితుల్లోకి నెడుతున్నది. అందుకే ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి. ఏవో నాలుగు సరుకులు ఇచ్చి ఎంతో చేశామని చెప్పుకునే ప్రభుత్వాల వాగాడంబరానికి చెంపపెట్టు ఈ ఆత్మహత్యల పర్వం. ఆపదలో ఆదుకునే ఆపన్న హస్తం లేక దిగులు మేఘాలు కమ్ముకున్న ముఖాలమీద కన్నీటిని తుడిచేవారు లేరు. ఈ విపత్కర సమయంలో ధీరగుణం ప్రదర్శించాలని అందంగా చెబుతారు. కానీ ఆ చేవ, ఆశ ఎక్కణ్నించి వస్తాయి. చేయడానికి పనిలేక, చేసిన పనికి డబ్బులు రాక, తినడానికి తిండిలేక అల్లాడేవారు ధైర్యంగా ఎలా ఉండగలరు? పనుల్లేక పస్తులుండాల్సిన పరిస్థితుల్లో మృత్యుశీతలస్పర్శ వంటి కాలాన్ని ఎలా అధిగమించగలరు?
పేదలు, నిరుపేదలు, చిరుద్యోగులు, నిరుద్యోగులు విభిన్నరకాల సమస్యలతో తల్లడిల్లే వారికి పాలకుల్నించి కచ్చితమైన హామీ లభించలేదు. మాటలు కోటలు దాటుతున్నాయే గానీ ఆచరణలో ఏ ఆశా కనిపించడం లేదు. కరోనా విపత్తు నుంచి బయటపడగలమనే మనోస్థయిర్యం ఏర్పడాలంటే అధికారంలో ఉన్నవారు బాధ్యతతో వ్యవహ రించాలి. ప్రజలు బిచ్చగాళ్ళు కాదు, వారికి సహాయం చేయడం తమ విధి, బాధ్యత అనే దృక్పథం ఉండాలి. పాలకులు ఖర్చు చేస్తున్నది ప్రజలసొమ్ము తప్ప వారి జేబుల్లోని సంపాదన కాదు. అందుకే ప్రజల పట్ల జవాబుదారీతనంతో వ్యవహరించాలి.
మనుషుల మధ్య పరాయీకరణ పెరగకుండా ఉండాలంటే తొలుత ప్రభుత్వాలు సున్నితంగా మెలగాలి. సాటి మనుషుల పట్ల కరుణ, ప్రేమ పొడసూపాలంటే బ్యూరోక్రసీ ఆచరణలో అవి ప్రతిఫలించాలి. కరోనా విపత్తు కాలాన అధికారంలో ఉన్నవారు ఎలా వున్నారు, ఎలా వ్యవహరించారు, మనుషులు ఏవిధంగా మెలిగారో చరిత్రలో రికార్డు అవుతుంది. ఆ చరిత్ర ముందు దోషులుగా నిలబడరాదంటే మానవత్వం వెల్లివిరియాలి. ఇది తొలుత పౌరుల పట్ల బాధ్యతగా మెలిగే విధానకర్తల మాటల్లో చేతల్లో ప్రతిఫలించాలి. అపుడే మానవత్వానికి సార్థకత, మనిషితనానిది కీర్తిపతాక.