Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాధ్యాతారాహిత్యంగా వ్యవహరించిన మోడీ ప్రభుత్వాన్ని మెడలు వంచి, హక్కులను కాపాడు కోవాల్సిన సమయమిది. బంగారు తెలంగాణ కల నినాదంగానే మిగిలిపోనుందా ? అనే అనుమానాలు, ఆవేదన కలుగుతున్నాయి. ఇప్పటికైనా తెలంగాణ అవతరణ దినోత్సవం నేపథ్యంలో సరైన ధృక్పథంతో రాష్ట్ర పాలకులు ఆత్మపరిశీలన చేసు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తెలంగాణ ఈరోజు ఆరో అవతరణ దినోత్సవం జరుపు కుంటున్నది. ఈసందర్భంగా సహజంగానే అభివృద్ధి, వైఫల్యాలపై చర్చ చోటుచేసుకుంటున్నది. అవతరణ దినోత్సవం అంటే ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం. ఆత్మస్థుతికి కాదు. ఉద్యమంతో సాకారమైన ప్రత్యేక రాష్ట్రంలో, అదే ఒరవడిలో పరిపాలన సాగిందా? అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాయా? అనే దిశగా చర్చలు సాగు తున్నాయి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో సమగ్ర దృక్పథం లోపించింది. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి పునాది పడింది. అందులో సాగునీటి కోసం చేస్తున్న కృషి అంతా కాళేశ్వరం చుట్టే తిరుగు తున్నది. పాలమూరు, డిండి, చర్లగూడెం, ఉదయ సముద్రం, శ్రీరాంసాగర్ రెండో దశ, ఎఎంఆర్ ప్రాజెక్టులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడమే ఇందుకు నిదర్శనం. దాదాపు 3.69 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రానికి అవసరమైన పరిపాలనా సంపత్తిని, నిధులను కేంద్రం నుంచి సాధించడంలో టీఆర్ఎస్ సర్కారు సఫలం కాలేదు. కేంద్రంతో నెరిపిన లాలూచీ కుస్తీనే ఇందుకు ప్రధాన కారణం. తొలి ఏడాదిలోనే లక్షా ఏడు వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేస్తానని ప్రకటించిన సీఎం కేసీఆర్, ఆరేండ్లయినా 35 శాతం దాటలేకపోయారు. కాగా, నియామకాల ముచ్చటే మరిచారు. ఇదిలావుంటే, ఉద్యోగాల్లో కాంట్రాక్టు పద్ధతిని రద్దుచేస్తానన్న పాలకులు, అ సంగతిని గాలికొదిలేశారు. తరగతి గదుల్లోనే దేశభవిష్యత్ ఉంటుందని పూర్వా రాష్ట్రపతి, ఉపాధ్యాయుడూ అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మాటలు మనకెరుకే. కానీ, వీటన్నింటిని చూస్తే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఒక్కసారీ డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేయలేదు. ఒక్క ఉపాధ్యాయ పోస్టునూ నింపకపోవడం ఆందోళన, ఆవేదన కలిగించేదే. ఉద్యోగాల నుంచి సాగునీటి ప్రాజెక్టుల దాకా రాష్ట్ర ప్రభుత్వానివి ఒంటెత్తు పోకడలే. నియంతృత్వపు బాటనే. ఉద్యమాల ద్వారా వచ్చిన రాష్ట్రంలో ఆందోళలను ఉక్కుపాదంతో అణచివేస్తున్న సర్కార్, ఇందిరాపార్క్ ధర్నాచౌక్ను ఎత్తేసేందుకు చేసిన ప్రయత్నమే ఇందుకు సాక్ష్యం. ప్రతిపక్షాన్ని విశ్వాసంలోకి తీసుకోకుండా. వాటి ఉనికినే అప్రజా స్వామికంగా ప్రశ్నార్థకం చేయడం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాకం. ఏకపక్ష నిర్ణయాలు గులాబీ సర్కార్ మార్క్గా మారాయి. అనేకసార్లు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మందలించినా, చివాట్లు పెట్టినా బేఖాతర్ చేసింది. నవ్విపోదురుగాక నాకేటి అన్నట్టుగా మసలింది. అనేక వాగ్దానాలు అసంపూర్తిగానే మిగిలి పోయాయి. దళితులకు మూడెకరాల భూమి, నిరుధ్యోగ భృతి, కేజీ టూ పీజీ ఉచిత విద్య, డబుల్బెడ్రూమ్ ఇండ్లు, ఫీజు రియింబర్స్ మెంటు, ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు వంటివి పగటి కలలే అయ్యాయి. దేశంలో అతిపెద్ద సమస్య నిరుద్యోగం. అది రాష్రాన్ని సైతం అతలాకుతలం చేస్తున్నది. దేశంలో అత్యధిక పట్టభద్రులున్న ఆరో రాష్ట్రం తెలంగాణేనని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అనే సంస్థ తన అధ్యయనంలో తేల్చింది. విద్యార్థుల బాధలు వర్ణణాతీతం. ఎంసెట్ పరీక్షతో సర్కారు అభాసుపాలైంది. ప్రశ్నాపత్రాల లీకేజీతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడుసార్లు ఆ పరీక్షను నిర్వహించాల్సి వచ్చింది. ఇంటర్ వాల్యూయేషన్ సైతం ఒక పెద్ద ప్రహసనమైంది. విద్యార్థుల భవిష్యత్ను గాల్లో దీపం చేసింది. మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయి. దిశ, సమత తదితర సంఘటనలే ఇందుకు తార్కాణం. విస్త్రృతమైన ప్రజల మద్దతులో ఎన్నికైన టీఆర్ఎస్ సర్కారు, కేంద్రంపై తగినరీతిలో ఒత్తిడి చేసి నిధులను సాధించడంలో విఫలమవుతున్నది. రాష్ట్రం హక్కుల విషయంలో కేంద్రాన్నీ నిలదీయడం రాజ్యాంగ బద్దం. సమాఖ్య ప్రభుత్వంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హక్కులు, అధికారాలు రాజ్యాంగం స్పష్టంగానే నిర్వచించింది. స్వార్థ రాజకీయాలను వదలాలి. రాష్ట్ర ప్రజల కోసం నికరంగా నిలబడాలి. ప్రజాసంక్షేమమే గీటురాయిగా, సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పట్టుదలతో ముందుకు నడవాలి. కరోనా కాలంలో ప్రజలు, పేదలు, వలస కార్మికుల కష్టాలు ప్రభుత్వానికి తెలియనివా? ఈ విషయంలో బాధ్యాతా రాహిత్యంగా వ్యవహరించిన మోడీ ప్రభుత్వాన్ని మెడలు వంచి, హక్కులను కాపాడుకోవాల్సిన సమయమిది. బంగారు తెలంగాణ కల నినాదంగానే మిగిలిపోనుందా? అనే అనుమానాలు, ఆవేదన కలుగుతున్నాయి. ఇప్పటికైనా తెలంగాణ అవతరణ దినోత్సవం నేపథ్యంలో సరైన ధృక్పథంతో రాష్ట్ర పాలకులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.