Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ సంవత్సర కాలంలో పైన పేర్కొన్న కోట్లాది ఏవర్గ ప్రజలకి మోడీపాలన మేలు చేసింది? వర్గపోరాట గీటురాయితో పరిశీలిస్తేనే మోడీ సర్కార్ అసలు రంగు బయటపడుతుంది. ఓపిగ్గా కష్టజీవులను, కుల, మత అణిచివేతకు గురయ్యే వారిని బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిలపడటమే నేటి కర్తవ్యం.
ఏ పాలననైనా తరాజులో పెట్టి జోకితే ఆ రాజ్యంలో ఎందరికి మంచి జరిగింది? ఆపాలన ఉపయోగపడింది సన్న జనానికా? రాబందులకా? వంటి వాటిని బట్టి ఆ రాజ్యాలను, పాలించే రాజులను, వారి పాలనను అంచనా వేయొచ్చు. ''చరిత్ర పరిశీలన వర్తమాన వర్గపోరాటంతో మాత్రమే ప్రారంభించాలి. లేకుంటే గతించిన సంఘర్షణలలో గెలుపొందిన వారి ప్రభావానికి గురిగాక తప్పదు. ఈ గత సంఘర్షణల సశ్మానాలలో కూచునే మన విశ్వవిద్యాలయ అకడమిక్ రాబందులు చరిత్ర పేరుతో పాలకవర్గాల పుక్కిటి పురాణాలను ప్రచారం చేస్తున్నారు'' అంటాడు తొలితరం విప్లవ కవి సివి సుబ్బారావు.
నిన్న మే 30కి మోడీ పాలనకు సంవత్సరం నిండింది. ఈ సంవత్సర కాలంలో బక్క జీవుల కేమిచ్చిందో, రాబందుల కేమిచ్చిందో ఏడాదంతా వెతుక్కోన క్కర్లేదు. 2020 మే నెల ఒక్కటి చాలు. అప్పటిదాకా చేస్తున్న కొలువులు కొండెక్కి, నెలవుల్లోంచి బేదఖలై, కాళ్ళకు చక్రాలు కట్టుకుని వందల మైళ్ళు సొంతూళ్ళకు పయనమైన 11కోట్ల మంది వలస కూలీలకు మోడీ ప్రభుత్వం ఏమి సమాధానం చెపుతుంది? వందల కిలోమీటర్లు నడిచి, నడిచే దారిలో ప్రసవించి మళ్ళీ 130కి.మీటర్లు నడిచిన తల్లి అడిగే ప్రశ్నలకు మోడీ సర్కార్ సమాధానం చెప్పగలదా? రైలు చక్రాలే యమకింకరులై ఛిద్రమైన పదహారు ప్రాణాల గురించి మోడీ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా? ఈ వలస జీవులకు మోడీ సంవత్సర పాలన ఏమిచ్చినట్టు?
తన వందరోజుల పాలన పూర్తి కాగానే మోడీ సాబ్ ఒకింత 'ధైర్యంగా' ''అసలు సినిమా ముందుంది. ఈ వంద రోజుల పాలన ఒక ట్రెయిలర్ మాత్రమే'' అన్నప్పుడు చాలా మందికి విషయం అర్థం కాలే! ఈ సంవత్సర పాలన బహుశా కొంతమందికైనా భ్రమలు తొలగేలా చేస్తున్నది. అదే ''వర్తమాన వర్గపోరాటం''.
దేశంలో 14.65 కోట్ల రైతు కుటుంబా లున్నాయి. అనేక కుటుంబాల్లో పౌల్ట్రీ, డెయిరీ వంటివిగాని, రబ్బర్ ప్లాంటేషన్లో దాదాపు కుటుంబంలోని స్త్రీలందరూ వివిధ సహాయ పనులు చేస్తారు, అంటే 40-45 కోట్ల మంది. వీరి బతుకులు రోజురోజుకు దుర్భరమవుతున్నాయి. 14కోట్ల మంది వ్యవసాయ కార్మికులున్నారు. గిట్టుబాటు గాని వ్యవసాయంతో ఒకపక్క రైతులు అల్లాడుతుంటే, పెరిగిన యాంత్రీకరణతో వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, మోడీ సర్కార్ చెప్పే అంత్యోదయ స్కీమ్వారి దరిదాపుల్లోకి వెళ్ళడం లేదు. సంవత్సరంలో 50 నుంచి 75 రోజుల పని దొరకడమే కనాకష్టంగా మారింది. ఉపాధి హామీ పథకానికి 2015-16 నుంచి మోడీ సర్కార్ విధిస్తున్న కోతలు, చేసిన పనికి రావాల్సిన బకాయిలే కోట్ల రూపాయలకు చేరినాయి.
మరో 48 కోట్ల మందికి పైగా కార్మికులు వీరిలో 94శాతం అసంఘటిత కార్మికులు. వీరికి దాదాపు ఏ కార్మిక చట్టాలూ వర్తించవు. నెల తిరగంగానే జీతమొచ్చే, డీఏ లుండే, బోనస్లొచ్చే కార్మికులు దేశంలో కేవలం 6శాతమే. కరోనా వల్ల చైనా దివాళా ఎత్తినట్టు చెపుతూ చైనా నుంచి వివిధ దేశాల పెట్టుబడిదారుల్ని ఆకర్షించడం కోసమని చెపుతూ అనేక రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు కార్మికచట్టాలన్నింటిని ఊడ్చిపారేస్తున్నాయి. చైనా నుంచి కనీసం భారతీయపెట్టుబడిదారులు సైతం మన దేశంలోకి రావడానికి సిద్ధంగా లేరన్నది అసలు వాస్తవం.
'భారతదేశం' ఒక ఊహ కాదు. జాతీయోద్యమ కలల సౌధం. అనేక తరాలు తమ రక్తమాంసాలతో నిర్మించు కున్నాం ఈ 'భారత్'ను. ఆరు ప్రధాన మతాలు, 6400 కులాలు, ఉప కులాలు, 1618 భాషలున్న ఈ దేశం ఐక్యంగా నిలవదని 1947లోనే శపించిన వాళ్ళున్నారు. జారే ముక్కల కోసం ఆశగా ఎదురు చూసిన వారున్నారు. కానీ మేరునగ ధీరుడుగా నిలిచిన మన దేశాన్ని చూసి ప్రపంచం అవాక్కయింది. భిన్నత్వాన్ని గౌరవించడం జాతీయోద్యమం ఉగ్గుపాలతో నేర్పింది. దేశ ఐక్యతకు, సమగ్రతకు అదే కీలకం.
కానీ బీజేపీ పుణ్యాన లోపల్నుండి విధ్వంసం ప్రారంభమైంది. ఈ సంవత్సర కాలంలో రాజ్యాంగానికి విరుద్ధంగా కాశ్మీర్ శాసనసభ ఆమోదం లేకుండా 370వ అధికరణం రద్దయిపోయింది. పౌరసత్వ సవరణ చట్టానికి, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా గళం విప్పిన వారందర్నీ అన్ లాఫుల్ యాక్టివిటీస్ (ప్రివెన్షన్) యాక్ట్ కింద అరెస్టులు సర్వసాధారణమైనాయి. ఆనంద్ తెల్తుంబ్డే, గౌతమ్నౌలఖా వరవరరావ్, మొదలైనవారిని అర్బన్ నక్సల్ పేరు మీద జైళ్ళలో కుక్కారు. దేశంలో లెక్కలేనన్ని సార్లు ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నారు.
కన్నయ్యకుమార్, ఉమర్ ఖలీద్, నిర్భన్ భట్టాచార్యలను రాజద్రోహ నేరంపై నిర్బంధించడంతో ప్రారంభమైన 'వేట' హార్థిక్ పటేల్ అరుంధతిరారుల మీదుగా సాగి తాజాగా గుజరాత్ సీఎంని మార్చబోతున్నారన్న వార్త ప్రచురించినందుకు గుజరాత్లో పత్రికా సంపాదకులు ధవల్ పటేల్ని రాజద్రోహం నేరంపై అరెస్టు చేశారు. 1860ల నాటి బ్రిటిష్ చట్టాన్ని మోడీ సర్కార్ తన ఇష్టారాజ్యంగా వాడుతున్నది. గతంలో ఎప్పుడూ చూడనంత అసహనం దేశంలో పెచ్చరిల్లుతున్నది. ఈ సంవత్సర కాలంలో పైన పేర్కొన్న కోట్లాది ఏవర్గ ప్రజలకి మోడీపాలన మేలు చేసింది? వర్గపోరాట గీటురాయితో పరిశీలిస్తేనే మోడీ సర్కార్ అసలు రంగు బయటపడుతుంది. ఓపిగ్గా కష్టజీవులను, కుల, మత అణిచివేతకు గురయ్యే వారిని బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిలపడటమే నేటి కర్తవ్యం.