Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాల్మార్ట్ వంటి అమెరికా వ్యాపార దిగ్గజాలు మన గ్రామాల్లో ఏజెంట్లను పెట్టుకొని పంటలను సేకరిస్తున్నాయి. వ్యవసాయరంగంలో ఎగుమతి, దిగుమతి బాధ్యతలను దేశీయ గుత్తపెట్టుబడిదారులకు అప్పగించింది. అందులో భాగంగానే రిలయన్స్ వంటి దేశీయ కార్పొరేట్లు నిత్యావసర, ఫ్రెష్ ప్రూట్ మార్కెట్ను శాసిస్తున్నాయి. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను కాంక్షించి క్యాబినెట్ చేసిన తీర్మానాలను ఉపహరించుకోవడం మంచిది.
వ్యవసాయరంగంలో మోడీ సర్కార్ ఇటీవల పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. రైతులకు లబ్ది చేకూర్చడం కోసమే ఈ చర్యలు తీసుకున్నట్టు చెప్పింది. అందులో ఒకటి మద్దతు ధరలు ఖరారు చేయడం, రెండోది ఒకే దేశం-ఒకే మార్కెట్ విధానం, మరోటి నిత్యావసరాల చట్టాన్ని సవరించడం. ఆరు శతాబ్దాలుగా రైతులు పడుతున్న ఇబ్బందులు ఈ మూడింటితో తొలగిపోతాయన్నట్టు ప్రధాని మోడీ ఘనంగా ప్రకటించారు. రైతులు తాము పండించిన పంటలను దేశంలో ఎక్కడైనా ఎవరికైనా విక్రయించు కోగల స్వేచ్ఛను కల్పిస్తున్నట్టు అభయమిచ్చారు. వాస్తవానికి ఈ మూడు అంశాలూ రైతులకు మేలు చేసేవి కావు. మరింతగా దిగజార్చేవి. కిసాన్ సమ్మాన్, వడ్డీ మాఫీ, ఫసల్ యోజన, వంటి పథకాలు ఎన్ని ఉన్నా అవేవి రైతులకు లబ్ధి చేకూర్చలేదు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించిన ప్యాకేజీలో ఒక్క రూపాయి కూడా రైతాంగానికి ప్రయోజనాన్ని ఇవ్వలేదు. అవన్నీ కార్పొరేట్ సంస్థలకు లాభాలు కట్టబెట్టాయి. ప్రస్తుతం కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన మూడు ఆర్డినెన్స్లూ పెట్టుబడుదారుల కోసమేనని స్పష్టమవుతుంది.
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. స్వామినాథన్ సిఫార్సులను అమలు చేస్తామని 2014 ఎన్నికల ప్రణాళికలో బీజేపీ వాగ్దానం చేసింది. గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా చేతులెత్తేసింది. 2019లో మళ్లీ అధికారంలోకి వచ్చినా.. మోడీ సర్కార్ ఉత్పత్తి ధరలను అశాస్త్రీయంగా నిర్ణయించి రైతులను తీవ్రంగా మోసం చేసింది. ఆహార ధాన్యాలకు మెరుగైన ధరలు కల్పించేందుకు కృషి చేస్తామన్న మోడీ మాటలు కోటలు దాటాయి తప్ప మద్దతు ధర విషయంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఇటీవల ప్రకటించిన 14రకాల వ్యవసాయ ఉత్పత్తుల ధరలు రైతులకు అసంతృప్తిని మిగిల్చాయి. నిరుడు వరికి మద్దతు ధర క్వింటాల్ రూ.1815 ఉండగా ఈ సారి దాన్ని 1868 చేశారు. గతంలో పోల్చుకుంటే ఈసారి రూ.53 పెరిగినట్టు. పత్తి క్వింటాల్కు రూ.275 పెంపుదలగా చూపింది మోడీ ప్రభుత్వం. గతంలో నిర్ణయించిన ధరలే శాస్త్రీయంగా లేవని రైతాంగం, రైతు సంఘాలు ఆందోళన చేస్తే, ఈ సారి గొప్పగా చేశామన్నట్టు ప్రకటించుకోవడం సిగ్గుచేటు. ఏటా రైతులు వంద రకాల వ్యవసాయ ఉత్పత్తులను పండిస్తున్నారు. అయితే కేంద్రప్రభుత్వం 14రకాల ఉత్పత్తులకే మద్దతు ధరలు ప్రకటించింది. ఈ ధరల వల్ల పారిశ్రామికవేత్తలకు రైతులు ఏటా 3 లక్షల కోట్లు నష్టపోతున్నా రన్నది ఆర్థికవేత్తల అంచనా. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం రైతులు పెట్టిన పెట్టుబడికి 50శాతం కలిపి మద్దతు ధర నిర్ణయిస్తేనే మేలు జరుగుతుంది.
మద్దతు ధర విషయంలోనూ రైతులను మోసం చేస్తున్న కేంద్రం.. కరోనా సమయంలో వ్యవసాయరంగంలో సంస్కరణలకు గ్రీన్సిగల్ ఇస్తూ కార్పొరేట్లకు ద్వారాలు తెరిచేందుకు క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం ప్రమాదకరం. 'ఒకే దేశం ఒకే మార్కెట్' నినాదంతో దేశవ్యాప్తంగా ఏకీకృత మార్కెట్ చట్టం, ఉత్పత్తుల నిల్వలు, ధరలపై పరిమితుల ఎత్తివేత, నిత్యావసరాల చట్ట సవరణ, రైతులు పంట వేసే ముందే పంటల కొనుగోళ్లు, ధరలపై ఎగుమతిదార్లు, వ్యాపారులతో ముందస్తు ఒప్పందాలకు వీలు కల్పించే చట్టం... ఈ మూడు సంస్కరణలు రైతులకూ, వినియోగదారులకూ నష్టమే. రైతులు పంటలను ఎక్కడైనా అమ్ముకొనేందుకు ఉద్దేశించిన ఏకీకృత మార్కెట్ చట్టం భవిష్యత్తులో కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ల విధానాన్ని ప్రశ్నార్ధకం చేస్తుంది. పరిమితంగానైనా పంటలను కొనుగోలు చేస్తున్న సర్కారీ సంస్థలు తమ బాధ్యత నుంచి వైదొలుగుతాయి. రైతులకు ఇప్పుడున్న కొద్దిపాటి భరోసా, భద్రత సైతం ఉండవు. ధరలు ఎక్కడుంటే అక్కడికి తమ ఉత్పత్తులను తీసుకెళ్లి అమ్ముకోవడం సన్న, చిన్న, మధ్యతరగతి, కౌలు రైతులకు అసాధ్యం. ఇది ధనిక, భూస్వాములకే ఉపకరిస్తుంది. రాష్ట్రాల చట్టాలున్నా కేంద్ర చట్టమే చెల్లుబాటవుతుంది కనుక రాష్ట్రాల అధికారాలకు కత్తెర పడుతుంది. ఏకీీకృత మార్కెట్ చట్టం అనేది ఒకే దేశం-ఒకే భాష, ఒకే దేశం-ఒకే మతం, ఒకే దేశం-ఒకే పింఛన్ తదితర బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏకరూప సిద్ధాంతంలో నుంచి పుట్టింది. 1955 నాటి నిత్యావసర వస్తువుల చట్టం అవసరం ఇక ఇప్పుడెంత మాత్రం లేనే లేదని, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, ఎగుమతిదార్ల వద్ద పప్పుధాన్యాలు, వంట నూనెలు, చిరుధాన్యాలు, నూనెగింజల నిల్వలు, ధరలపై పరిమితులను పూర్తిగా కేంద్రం ఎత్తేయబోతుంది. బీజేపీ పాలిత రాష్ట్రాలైన యూపీ, మధ్యప్రదేశ్ల్లో మార్కెట్ విధానంలో సవరణ చట్టాలను తెచ్చాయి. పరిమితులు ఉన్నప్పుడే బ్లాక్ మార్కెట్ను, కృత్రిమ కొరతను ప్రభుత్వాలు అడ్డుకోవడం లేదు. ఉల్లి, టమాట, ఆలుగడ్డ ధరలు అమాంతం ఏవిధంగా ఆకాశాన్నంటు తుంటాయో చూస్తున్నాం. అలాంటిది నిల్వల పరిమితులను ఎత్తేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహకందదు. ఇప్పటికే చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడం వలన వాల్మార్ట్ వంటి అమెరికా వ్యాపార దిగ్గజాలు మన గ్రామాల్లో ఏజెంట్లను పెట్టుకొని పంటలను సేకరిస్తున్నాయి. వ్యవసాయరంగంలో ఎగుమతి, దిగుమతి బాధ్యతలను దేశీయ గుత్తపెట్టుబడిదారులకు అప్పగించింది. అందులో భాగంగానే రిలయన్స్ వంటి దేశీయ కార్పొరేట్లు నిత్యావసర, ఫ్రెష్ ప్రూట్ మార్కెట్ను శాసిస్తున్నాయి. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను కాంక్షించి క్యాబినెట్ చేసిన తీర్మానాలను ఉపహరించు కోవడం మంచిది.