Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తనువు నుంచి మనస్సును ఎలా వేరు చేయలేమో రైతును వ్యవసాయాన్నుంచి కూడా దూరం చేయలేము. చేయలేరు. ఒకవైపు బతుకుపై కారుమబ్బులు కమ్ముకునే పరిస్థితులు ఆవహించినా, భవిష్యత్ పద్మవ్యూహంగా గోచరించినా చివరిదాకా భూమితోనూ సాగుచేసే పంటలతోనూ సహవాసం చేస్తూనే ఉంటాడు. తాను పండించే గింజలు తన నోట్లోకి వెళ్తాయో లేదో తెలుసుకోలేని అమాయకపు అన్నదాత.. లోకం కడుపు నింపా లని రాత్రింబవళ్లు పరిశ్రమి స్తూనే ఉంటాడు. అందుకే కష్టాలెదురైనా, నష్టాలు చవి చూసినా సమస్త మానవళికి మట్టిలో 'మహర్షి'గా కనిపిస్తుంటాడు.
నాలుగు రోజులు కష్టం రాగానే బతుకుడెట్లనో ఏమో అనే పదం ఆలోచించకుండానే నోటి నుంచి వచ్చేస్తుంది. ఉన్న ఉపాధి పోయి రోడ్డునపడే స్థితిని తలుచుకుంటేనే బతుకు అంధకారంగా కండ్లముందు మెదులుతుంది. అటువంటి సమయాల్లో ఇంటిల్లిపాది పోషణ గురించి ఒకటే ఆందోళన వెంటాడుతుంది. కరోనా కాలంలో ఇప్పుడిదే పరిస్థితి..! ప్రధానంగా పేద, మధ్య తరగతి ప్రజల్లో ఆకలి కేకలతో పాటు చావుడప్పులూ వినిపిస్తున్న దుస్థితి. ఇటువంటి ఆపత్కాలంలో కోట్లాది మంది కడుపు నిండాలన్నా ప్రతిఒక్కరూ తిరిగి మట్టినే నమ్మక తప్పడం లేదు. ముందువెనుక ఏమున్నా లేకున్నా మొదట తిండి గింజలైతే కావాలనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఒకవిధంగా ఇది మంచిదే. కర్షకుని కష్టం స్ఫురణకు రావడం గొప్పదే. కానీ, మట్టినే నమ్ముకుని ఏపుగా ఎదుగుతున్న పంటను చూసి మురిసిపోయే రైతన్న మార్కెట్లోని మాయ జూదానికి మోసపోవడం మాత్రం కొనసాగుతున్న మహావిషాదం. గిట్టుబాటు ధర రాక, పెట్టుబడికి భరోసా లేక పాలకుల నిర్లక్ష్యానికి బలవుతూనే ఉన్నాడు. లాక్డౌన్ వంటి సమయాల్లో జరిగిన నష్టాల్ని పూడ్చుకునేందుకు కార్పొరేట్ కంపెనీలు పలు సంస్కరణ చేపడుతున్నాయి. ప్రభుత్వాలు సైతం ప్రజలకందించే ప్రతి సేవనూ రెట్టింపు భారం చేస్తున్నది. పన్నులు పెంచేస్తున్నారు. వ్యాపారులు సైతం మానవుడి దైనందిన జీవితంతో ముడిపడి ఉన్న ఉత్పత్తులన్నింటిపైనా ధరలను పెంచి అమ్ముకుంటున్నారు. నేరుగా స్వేదం చిందించి సేద్యం చేసినా ఇప్పటికీ దళారీ చేతిలో దగాపడటం రైతుల వంతవడం ఓ విషాద పరిణామం.
'జై జవాన్ జై కిసాన్' అంటూ దేశ సైనికుడితో సమానంగా పోల్చే సంస్కృతిలో తరతరాలుగా రైతు కష్టం పాలకుల నిర్లక్ష్యానికి 'పొల్లు'పోతున్నది. 'రైతే రాజు.. దేశానికి వెన్నెముక.' అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలతో కష్టజీవులపై ఆప్యాయతల్ని రంగరించినా అవన్నీ పెదాల పైపూసే కృత్రిమ పదాల పూతేనని ప్రస్తుత పరిస్థితులు చెప్పకనే చెబుతున్నాయి. ఇప్పటికీ సరైన మార్కెట్లేక మరొకరిపై ఆధారపడం కర్షకుడి దయనీయతను తేటపరుస్తున్నది. ఒకప్పుడు నిబంధనలు ఒప్పుకోవనే పేరుతో గిడ్డంగుల్లోని ఆహార నిల్వలను ప్రజలకు అందించకుండా పందికొక్కుల పాల్జేసిన సందర్భం ఇప్పుడు గుర్తుకు వస్తున్నది. కార్పొరేట్లకు లక్షల కోట్లు కేటాయించడమేగాక, మాఫీ, రాయితీ, రద్దువంటి సౌకర్యం కట్టబెట్టే పాలకులు పంట గిట్టుబాటు ఎందుకు విస్మరిస్తున్నారో అర్థం కాదు. అసలు మరిచి కొసరు వేసినట్టు కంటితుడుపు చర్యలెన్ని ప్రకటించినా అవి రైతాంగం కన్నీళ్లు తుడవలేవన్నది నిష్టుర సత్యం. పైగా 'ఒకే దేశం ఒకే మార్కెట్' అంటూ కొత్త భ్రమలు కల్పిస్తున్నవాళ్లు తక్కువ పంటున్న పేద రైతులు స్వతహాగా ఎక్కడికని వెళ్లి అమ్ముకుంటారో తెలుసుకోకపోవడం విడ్డూరం. ఎన్నో సందర్భాల్లో ఇదేనా రైతురాజ్యం? అంటూ పూనకమొచ్చినట్టు ఊగిపోయే నేతలు సైతం వారి కష్టాలు ఎరుగకపోవడం వైచిత్రి. ఇప్పుడు రైతుకు కావాల్సింది సానుభూతి లేదా ఊసరవెల్లి రాజకీయాలు కాదు.. మేలు చేసే విధానాలు, మట్టితో పెనవేసుకుపోయిన వారి బంధానికీ, బతుక్కీ ఒక భరోసా ఇచ్చే నిర్ణయాలు కావాలి.
ఈరోజు అభివృద్ధి చెందుతున్న పట్టణాలన్నీ పల్లెలవైపు చూస్తున్నాయి. వ్యవస్థలన్నీ ఒక్కొక్కటిగా కుదేలైపోతున్న సందర్భంలో వ్యవసాయం మరింత బలోపేతం కావాల్సి ఉందనే అభిప్రాయాలు వినవస్తున్నాయి. ప్రజాధనాన్ని ఎత్తులకు పైఎత్తులు వేసి పాలకుల అండతో కొల్లగొట్టే కార్పొరేట్లది సైతం ఇదే అభిభాషణ. అన్నదాత ప్రాధాన్యత ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చిందనే చెప్పాలి. 'చేసేదేమో పట్నంవాసం.. తినేదేమో పల్లెగాసం' అన్న సామెత ఎంత సత్యమో ఈ సందర్భం నిరూపిస్తున్నది. పల్లెలు గాసం కట్టి పంపితే తప్ప పట్నాల్లో పూటగడవకుండా పోతున్నది. కానీ రైతుకు మాత్రం మేలు జరుగుతున్నదా? పంటలు లాభసాటిగా అమ్ముడుపోతున్నాయా? అంటే ఏ ఒక్కరి నోరూ పెగలదు. చిన్నారి మొదలు పండుముసలిదాకా 'రైతుకు న్యాయం జరగడం లేదు, వాళ్ల రెక్కలకష్టం పెట్టుబడికే పోతున్నది' అనే సమాధానమే వస్తుంది. మరెందుకు ఇలాంటి పరిస్థితులున్నాయో పాలకులు పునరాలోచించాల్సిన సమయమిది. రైతే రాజు అని చెప్తున్నవారు ఆ రైతుల నోట్లో మట్టి కొట్టకుండా శాస్త్రీయ వివేచనతో మసులుకోవాలి. నేలను నమ్ముకుని నలుగురికి అన్నంపెట్టే అన్నదాత అసువులు బాస్తుంటే నిర్లిప్తంగా ఉండటం క్షంతవ్యం కాదు. అందుకే ఇలాంటి సంక్షోభ సమయంలో పాలకుల్ని మరింత నిగ్గదీసి అడగాల్సిన బాధ్యత రైతు ప్రతిఫలాన్ని అనుభవిస్తున్న ప్రతి ఒక్కరిదీ. అప్పుడే లోకానికి అన్నంపెట్టే దాతకు మరింత అండ దొరుకుతుంది.