Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమెరికాలో నల్లజాతి ప్రదర్శనకారులు తగులపెడుతున్నారు, లూటీలు చేస్తున్నారని నిందించే అమెరికన్ పాలకులు, మీడియా ఆదేశంలో ఆ పాలన ఉండటమే శాంతిని ధ్వంసం చేసేదని, చేస్తోందని గుర్తిస్తే చేగువేరా మాటలు అర్థమౌతాయి.
''అణిచివేసే శక్తులు చట్టానికి వ్యతిరేకంగా అధికారంలో కొనసాగ గల్గితే శాంతి భగమైనట్లే!'' - చేగువేరా.
ఒకటి అతి పురాతన ''ప్రజాస్వామ్యం!'' ఇంకోటి అతి పెద్ద ''ప్రజాస్వామ్యం!''. ఒకటి అక్షరాల అగ్నికీలల్లో ఉండగా, మరోదాన్లో బడబాగ్ని రాజుకుంటూ ఉంది. కారణం కరోనానే!
200 సంవత్సరాల శ్వేతజాతి దాష్టీకాన్ని భరించి, భరించి నల్ల జాతీయులు, ఉరఫ్ 'బానిసల్లో' ఆక్రోశం కట్టలు తెంచుకుంది. లక్షల్లో తెల్లవారు తమ నల్లసోదరులతో జట్టుకట్టారు. ''పవర్ ఆఫ్ వైట్నెస్'' పై తిరగ బడ్డారు. దీనికి ''ఇగ్నీషన్''గా నిలిచింది జార్జి ఫ్లాయిడ్ హత్యతో పాటు ట్రంప్ ఆధ్వర్యంలో పడగ విప్పిన శ్వేతజాతి దురహం కారంపై బద్దలైన గూడుకట్టుకున్న అసంతృప్తి. ఒక నల్లజాతి కవి ''చచ్చిపోని ఎందరో జార్జి ఫ్లాయిడ్ల కోసం'' అని రాసిన విషయం చదివి కండ్లుచెమర్చని వారుండరు.
సివిల్ రైట్స్ చట్టం సాధించుకున్నా నల్లవారిపై వివక్షపోలేదు. తెలుపు, నలుపు అంతరాలు తగ్గలేదు. ప్రపంచ జనాభాలో 4శాతం ఉన్న అమెరికన్లు, జైళ్ళలో మగ్గుతున్న జనాభాలో 22శాతం ఉన్నారు. వీరిలో అత్యధికులు నల్లవారు. సైకిల్ దొంగతనానికి, నల్లమందు కలిగి ఉన్నారన్న నేరానికి యావజ్జీవ జైలుశిక్ష పడిన నల్లవారున్నారు అమెరికాలో.
కోవిడ్-19 మహమ్మారి తెల్లవారికంటే మూడురెట్లు అధికంగా నల్లవారిని మింగేస్తోంది. వారి పేదరికమే దానికి కారణమని వారికి స్పష్టమౌతూనే ఉంది. తిరుగుబాటుకు ఇదీ ఒక కారణం. దేశంలో లక్షమందికి పైగా చనిపోయినా, ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నా చండ్రుడిపై ఖనిజాలు తవ్వుకునే ఆర్డర్పై ట్రంప్ సంతకం చేశాడు. ప్రకటించిన రెండు లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీలో సగం పెట్టుబడిదారులకే చెందుతాయి. వెనుజులా, ఇరాన్లపై ఆంక్షలు సడలించలేదు. మోడీ గులాంగిరీ తప్ప, మన దేశాన్ని కూడా తన జియో పాలిటిక్స్లో ఇరికిస్తూనే ఉన్నాడు. మన కరెన్సీ తీసుకుని క్రూడాయిల్ అమ్ముతానన్న ఇరాన్ డీల్కు మోకాలాడ్డాడు. మోడీకి, ఆయన ''ఆత్మబంధువు''లకు సమ్మగా ఉన్నా కనీసం 125 కోట్ల భారతీయులకిది తీవ్రనష్టం.
ఇక ''పవిత్ర'' భారతావని మోడీ హయాంలో 'రాకాసి కోరల' కింద చిక్కుకున్న తీరు, కరోనా సాకుతో దేశంలో ప్రజాస్వామ్యం మంటగలుస్తున్న తీరు వర్ణనాతీతం. మనదేశంలో సరళీకృత ఆర్థిక విధానం అమలు చేయడమే కార్పొరేట్ల కోసమని 'నవతెలంగాణ' మొదటినుంచి మొత్తుకుంటోంది. మొన్న జూన్ 4న ఒక ఆంగ్ల దినపత్రికలో ''15 సంవత్సరాల క్రితం రైతులకు ఉచిత కరెంటు ఇవ్వవద్దని మన్మోహన్సింగ్ చెప్పిన దాన్ని నేటికి మోడీ అమల్లోకి తెచ్చాడ''ని రాశారు. సులభతర వ్యాపారంలో తమస్థానం మెరుగు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అంటే పెట్టుబడిదారులకు సౌకర్యాలు అందించి, కార్మికుల మెడలు వంచడంలో పోటీ పడుతున్నారు.
కోవిడ్ వల్ల చైనా దివాళ ఎత్తుతుందని, అప్పుడు అక్కడ నుంచి బయటపడే పారిశ్రామికవేత్తలకు మనదేశమే మలి మజిలీ కావాలని, అందుకు కార్మికచట్టాల ''ముళ్ళతుమ్మల''న్నింటిని తొలగించి నేలదున్ని చదును చేయ్యాలనేది మోడీ సర్కార్ ఆలోచన. నేడు రాష్ట్రాలకు, రాష్ట్రాలు కార్మిక చట్టాలకు మంగళం పాడేస్తున్నాయి. దీంట్లో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలకు పంజాబ్, రాజస్థాన్లలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసిపోయిందేమీ లేదు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులకు ఉపయోగపడనిది ప్రజాస్వామ్యమెలా అవుతుంది? ఇది అంబానీ, అదానీ స్వామ్యం. కష్టజీవుల కడుపుల్లో రాజుకునే ఈ బడబాగ్నిని చల్లార్చేవారెవరు?
మనదేశంలో ఉన్నది బహుళ పార్టీల ప్రజాస్వామ్యమట! అమెరికాలో ఉన్నది రెండు పార్టీల ప్రజాస్వామ్యమట! చారిత్రాత్మకంగా రిపబ్లికన్ పార్టీ పుట్టింది లగాయతూ ధనికుల కొమ్ముకాసే పార్టీగానే ఉండగా, ట్రేడ్ యూనియన్లు, నల్లజాతివారు డెమొక్రాట్ల వెనకుండేవారు. 1981లో రోనాల్డ్ రీగన్ ప్రపంచీకరణకు తెరలేపిన తర్వాత క్రమంగా పరిస్థితిలో మార్పు వచ్చింది. రెండూ ఏకాభిప్రాయానికి రావడమే కాదు, ప్రపంచాన్ని ఏకాభిప్రాయానికి తెచ్చాయి. దీన్నే వాషింగ్టన్ కన్సెన్సస్ అని పిలుస్తున్నారు. మనదేశంలో వామపక్షాలు తప్ప మిగిలిన పార్టీలన్నీ పేరేది పెట్టుకున్నా కార్పొరేట్ల, భూస్వాముల ప్రయోజనాల కోసం నిలిచే పార్టీలే! ఇక ప్రజాస్వామ్యం బుగ్గికాక ఏమౌతుంది.
అమెరికాలో టీవీ టాక్షోల్లో ట్రంప్ని తూర్పారపడ్తారు. దాన్లో వందోవంతు మనదేశంలో మోడీని ఏమైనా అంటే అన్నవాడు ఇంతే సంగతులు. బహుశా కేరళ తప్ప మరే రాష్ట్రంలోనూ అసెంబ్లీ ముందు ధర్నాలు చేసే అవకాశం, హక్కూ లేవు. అమెరికాలో ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ల ముందే వాటికి వ్యతిరేకంగా ధర్నా చేసే హక్కుంది. కాని, అమెరికా పార్లమెంట్లో జరిగే చర్చలు, చేసిన నిర్ణయాలు, జరిగిన ఉద్యమాలు గాలికిపోయి అధ్యక్షుడు ఏమనుకుంటే అదే చట్టం. ఇది రాజరిక వ్యవస్థ తప్ప ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? అక్కడ 'బంకర్ల' ప్రజాస్వామ్యం ఉంది. మనదేశంలో లేదు. 4వేల అడుగుల లోతులో నిర్మించిన 'మయసభ' ''అధ్యక్షుడి బంకర్''. 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడి జరిగినప్పుడు జార్జిబుష్ దూరింది, మొన్న జార్జి ఫ్లాయిడ్ హత్యపై కోపోద్రిక్తులైన ప్రజలు అధ్యక్ష భవనం వైపు చొచ్చుకొస్తే ట్రంప్ దాక్కుందీ ఈ బంకర్లలోనే!
నేడు అమెరికాలో నల్లజాతి ప్రదర్శనకారులు తగులపెడుతున్నారు, లూటీలు చేస్తున్నారని నిందించే అమెరికన్ పాలకులు, మీడియా ఆదేశంలో ఆ పాలన ఉండటమే శాంతిని ధ్వంసం చేసేదని, చేస్తోందని గుర్తిస్తే చేగువేరా మాటలు అర్థమౌతాయి.