Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పారిశ్రామిక, పెట్టుబడిదారీ విధానాన్ని బలంగా బలపరుస్తున్న బీజేపీ ప్రభుత్వం పేదల గురించి ఆలోచిస్తుందనుకోవడం అత్యాశే. ప్రస్తుతం దేశంలో ఉక్కుపాదంతో ఉద్యమాలను అణచివేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నా ప్రజాస్వామ్య హక్కుల కోసం నిరంతరం ఆందోళనలు జరుగుతున్నాయి. ఆ క్రమంలో గిడ్డంగుల్లో ధాన్యం.. పిడికిట్లో అన్నంగా మారాలంటే పోరాటమే మార్గం.
'మన అమ్మ అన్నపూర్ణ.. మన అన్న దానకర్ణ.. మన భూమి వేదభూమిరా తమ్ముడూ..' అనే పాట ఇప్పటికీ ప్రజల గొంతుల్లో మోగుతూనే ఉన్నది. ఈ దేశం గురించి, ఇక్కడ భూమి గొప్పతనాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ పాటలోని మాటలను మన పాలకులు గుర్తు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి వేదభూమిలో ప్రస్తుత లాక్డౌన్తో ప్రజలు పస్తులతో ఉండాల్సి వస్తున్నది. ఆహారం అందక కరోనాను మించిన ఆకలిచావులకు గురవుతున్నారు. ముందస్తు ప్రణాళిక లేకుండా విధించిన లాక్డౌన్తో అసంఘటిత రంగ కార్మికులు, వలస కూలీలు, పేదలు, ఎంతోమంది సామాన్యులు ఇబ్బందులు పడ్డారు. తినడానికి తిండిలేక, కొనుక్కునే అవకాశం లేక ఆకలి బాధలకు గురైనా.. వారిని ఆదుకుని కనీస అవసరాలు తీర్చాల్సిన మోడీ సర్కార్ చేతులెత్తేసింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ (పీఎంజీకేసీ)ని ప్రకటిస్తూ.. జాతీయ ఆహారభద్రత చట్టం కింద ప్రయోజనం పొందే 80 కోట్ల మందికి అదనంగా ఐదుకిలోల ఆహారధాన్యాలు ఇస్తామన్నారు. నెలకు ఇచ్చే ఐదు కిలోలకు అదనంగా మరో ఐదు కిలోలు ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఉచితంగా ఇస్తామని వాగ్దానం చేశారు. రేషన్కార్డులున్న కుటుంబాలకు కిలో పప్పు ధాన్యాలు కూడా ఇస్తామన్నారు. అయితే, జాతీయ భద్రత చట్టంతో పాటు ఉచితంగా ఇచ్చే సరుకులు గత నెల మేలో 14.4 కోట్ల మందికి అందలేదని ప్రభుత్వ గణాంకాలు తెలియజేశాయి. ఏప్రిల్ నెల్లోనూ ఇదే పరిస్థితి. రేషన్కార్డుల్లేని 10కోట్ల మందికి సరుకులు అందలేదు. వలస కార్మికుల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎనిమిదికోట్ల మందికి ఇవ్వాలని లక్ష్యం పెట్టుకోగా.. 20శాతం మందికి మాత్రమే ఆహార ధాన్యాలు అందాయి. బియ్యం, గోధుమలు, పప్పుల్లో ఇచ్చినవి నామ మాత్రమే. రెండునెలల్లో కలిపి 40శాతం పప్పులనే పంపిణీ చేసినట్టు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. బియ్యం, గోధుమల పంపిణీలోనూ కోతలు పెట్టింది. మరి ఆహారభద్రత చట్టం అమలు చేసిందెక్కడీ లాక్డౌన్తో తమ సొంతూర్లకు వెళ్లిన వలసదారుల్లో దారి మధ్యలోనే 700 మంది తనువు చాలించారు. ఇందులో గర్భిణులు ఉన్నారు. పిల్లలూ ఉన్నారు. వీరందరికీ సరైన పౌష్టికాహారం అందకనే చనిపోయారని నివేదికలు చెపుతున్నాయి. మరెంతోమంది అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రి పాలయ్యారు. గోదాముల్లో మూలుగుతున్న ఆహారనిల్వలను బయటకు తీసి ప్రజలకు పంచాలని వామపక్షాలు, మేధావులు కోరినా మోడీ సర్కార్ చెవికెక్కించుకోలేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ నిల్వలను బయటకు తీసి పంచాల్సిన కేంద్రం వాటిని పందికొక్కుల పాల్జేసింది. ఈ ఏడాది జనవరి నుంచి మే 1 దాకా ఎఫ్సీఐ గోదాముల్లో ఉన్న 65లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. దీనికి ఎవరు బాధ్యులు? మోడీ సర్కార్ అనుసరించిన విధానాలే కారణం.
కరోనా లాంటి వైరస్లను తట్టుకోవాలంటే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండాలని వైద్యులు చెపుతున్నారు. మరోవైపు పౌష్టికాహారం తీసుకోవాలని మన పాలకులూ చెపుతుంటారు. అది అందాల్సిన రీతిలో అందుతున్నదా అంటే ప్రశ్నార్థకమే. 2013 ఆగస్టు 23న జాతీయ ఆహార భద్రతచట్టం వచ్చినా అమలు చేసిందెక్కడీ ఈ చట్టం 52 సెక్షన్లు, మూడు షెడ్యూల్స్తో ఏర్పడింది. ఎవరెవరికి ఎన్నెన్ని కేలరీల శక్తి గల ఆహారాన్ని, ప్రొటీన్లు అందించాలో కూడా అందులో స్పష్టంగా ఉన్నది. ఐదేండ్లలోపు ఉన్నవారు 1633 కేలరీల శక్తి వచ్చే ఆహారం తీసుకోవాలి. అంతకు పైబడిన వారు 3,264 కేలరీల శక్తి వచ్చే ఆహారం తీసుకోవాలి. ఎదుగుదల తక్కువ ఉంటే ఎలా, రక్తహీనత, విటమిన్, అయోడిన్ లోపం లేకుండా ఏమి చేయాలన్నది చట్టంలో స్పష్టంగా ఉన్నది. దీని అమలుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లోనూ కమిటీలున్నాయి. గ్రీవెన్స్ సెల్లు ఏర్పాటు చేసుకునే వీలుంది. ప్రత్యేకంగా మహిళలకే పూర్తి అధికారం ఉన్నది. ఆహార భద్రత విజయవంతం కావాలంటే వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యవసాయ పరిశోధనలు విస్తరించాలి. మైనర్ ఇరిగేషన్, విద్యుత్ ఉత్పత్తి, ఉత్పాదకలూ చేపట్టాలి. ఆహారభద్రత చట్టంలో అన్నీ ఉన్నా 2014లో అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ అమలు చేసేందుకు సిద్ధపడలేదు. దీనివల్లే దేశంలో ప్రస్తుతం ఆకలిచావులు పెరగడానికి కారణం. ఆహార భద్రతను అమలు చేస్తే మనిషిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కానీ మన దేశంలో ఏడాదికి వెయ్యికి 40మంది శిశు మరణాలు జరుగుతున్నాయి. ఒక్క కేరళలో మాత్రమే శిశు మరణాలు తగ్గించగలిగారు. ఐసీడీఎస్లకు నిధుల్లో కోతపెట్టడం వల్ల గర్భిణులకు పౌష్టికాహారం ఎలా అందజేస్తారన్నది ప్రశ్న. పేదల ఆకలి తీర్చడానికి కష్టపడుతున్నామంటున్న బీజేపీ సర్కార్.. దానికంటే ముందు ప్రస్తుతం ఉన్న జాతీయ ఆహార భద్రత చట్టం అమలుకు తగు యంత్రాగాన్ని ఏర్పాటు చేయాలి. గిడ్డంగుల్లో ఉన్న నిల్వల పద్ధతిని మార్చేయాలి. ప్రతి ఒక్కరికీ పౌష్టికాహారాన్ని అందించేందుకు కృషి చేయాలి. అయితే, గత పాలకుల కంటే వేగంగా పారిశ్రామిక, పెట్టుబడిదారీ విధానాన్ని బలంగా బలపరుస్తున్న బీజేపీ ప్రభుత్వం పేదల గురించి ఆలోచిస్తుందనుకోవడం అత్యాశే. ప్రస్తుతం దేశంలో ఉక్కుపాదంతో ఉద్యమాలను అణచివేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నా ప్రజాస్వామ్య హక్కుల కోసం నిరంతరం ఆందోళనలు జరుగుతున్నాయి. ఆ క్రమంలో గిడ్డంగుల్లో ధాన్యం.. పిడికిట్లో అన్నంగా మారాలంటే పోరాటమే మార్గం.