Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంతటి విలయంలోనూ ఏలినవారి ధ్యాసంతా తమ సంపన్న వర్గాల ప్రయోజనాలూ, తమ రాజకీయ ప్రయోజనాల మీదే తప్ప ప్రజల ప్రాణాల మీద కాదని మొన్నటి మోడీగారి ''నమస్తే ట్రంప్'' కార్యక్రమమూ, నిన్నటి ఆర్థిక మంత్రి విడతలవారీ వివరణలూ, నేటి హౌం మంత్రి బీహార్ ఎన్నికల సన్నాహాలు స్పష్టంగానే తెలియజేస్తున్నాయి. ఇప్పటికైనా పౌర సమాజం మేలుకోకుంటే మిగిలేది చీకటే..
వెలిగించమంటే వెలిగించాం..! ఆర్పేయమంటే ఆర్పేసాం..!! గడిచిన మూడు నెలలుగా ఏలికల నాలుకలు ఏం చెపితే అది పాటించాం. మృత్యవాకిలిలోనూ రాజకీయాలను మరువని నేతల మాటలు నమ్మి మన విధేయతను సమర్పించుకున్నాం. కానీ జరిగిందేమిటి? దేశం కరోనా ప్రభావిత దేశాలలో 10వ స్థానం నుంచి 5వ స్థానానికి చేరింది. అయినాసరే, కరోనా భయంలో ప్రజలుండగా లాక్డౌన్లో దేశాన్ని బంధించిన ప్రభువులు.. తాము మాత్రం ప్రభుత్వాలకూల్చివేతలూ, కార్మిక హక్కుల హననాలూ, ప్యాకేజీల పేర ప్రయివేటీకరణలతో యధేచ్ఛగా తమ రాజకీయాలు సాగిస్తుంటే, తమ వర్గ ఆర్థిక ప్రయోజనాలు సాధించు కుంటుంటే.. ఇక ఆర్పేయడానికి వెలుగులేముంటాయీ, వెలిగించడానికి ఆశలేముంటాయి..!? నిన్నటిదాకా కరోనా నివారణలో మనం ప్రపంచానికే ఆదర్శంగా ఉన్నామని నీతులు పలికిన నేతలంతా నేడు చేతులెత్తేసాక.. ప్రజల ప్రాణాలను గాలిలో దీపాలు చేశాక.. ఇప్పుడు మిగిలింది ఇంటిలోనూ, కంటిలోనూ చీకటే..
ఆలోచనలేని జనతా కర్ఫ్యూలు, అనుచితమైన లాక్డౌన్లు ప్రమాదాన్ని నివారించకపోగా, పరిస్థితులను మరింత జటిలం చేశాయి. ఇది తేలిపోయాక.. కేంద్ర ఆరోగ్యశాఖ మే 8న కరోనాతో కలసి బతకడం నేర్చుకోవాలని ప్రకటించే నాటికి దేశంలో కేసుల సంఖ్య 56వేలు. ఇప్పుడా సంఖ్య 2,76,583 దాటిపోయింది. మరణాల సంఖ్య మరీ తీవ్రమయింది. ఈ దుస్థితికి కారణమెవ్వరు..? జనవరి 30న కేరళలో తొలి కేసు నమోదయినప్పుడే జాగ్రత్తపడి విమానయానాలను నివారించి వుంటే ఈ దుస్థితి దాపురించేదా..? ఈ దేశానికి లాక్డౌన్ అవసరమై ఉండేదా? అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ ఇంతగా దిగజారేదా..? కానీ మోడీగారి ట్రంప్ ఆగమనాభిలాష ముందు ఇవేవీ ఈ సర్కారుకు పట్టలేదు. లక్షల మందితో స్వాగత సత్కారాలందుకున్న ట్రంప్ గాల్లోకి ఎగరడమూ, దేశంలో కరోనా పెరగడమూ ఏకకాలంలో జరిగిపోయాయి. అయినా ఈ వ్యాప్తి అంతగా బయటపడని ఆ రోజుల్లో కరోనా నివారణలో మొనగాల్లుగా జబ్బలు చరచుకున్న ఏలికలు నేడు కన్నంలో దూరిన ఎలుకల్లా మారిపోయారు. వైరస్ వ్యాప్తి ప్రారంభదశలో ఉన్నప్పుడు, కట్టడి కఠినంగా అమలు చేసిన ఏలికలు.. ఇప్పుడు వ్యాధి తీవ్రమై, వ్యాప్తి విస్తృతమైన వేళ కట్టడిని సరళం చేసి ప్రజలను గాలికొదిలేసారు.
వ్యాధి అదుపులో ఉన్నప్పుడు క్రమం తప్పక ప్రజల ముందుకొచ్చి దీపాలు పెట్టమనో, చప్పట్లు కొట్టమనో ప్రకటనలు గుప్పించడమేగాక, ప్రజలు పాటించవలసిన జాగ్రత్తలను టీవీల్లో గంటలకొద్దీ ఏకరువు పెట్టిన నేతగణానికి ఇప్పుడు జనం ముందుకు రావడానికే మొహం లేని పరిస్థితి! ఈపరిస్థితి ఏలికల వైఫల్యాలనే కాదు, ప్రపంచ వ్యాపితంగా పెట్టుబడిదారీ వ్యవస్థ అసలు స్వరూపాన్నే బహిర్గతం చేసింది. చివరికి పెట్టుబడిదారీ వ్యవస్థ ''స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ హెల్త్ కేర్'' అనే తన హామీని కూడా నిలబెట్టుకోలేకపోయిందని తేటతెల్లం చేసింది. కరోనా విజృంభణలో ఆకలి, నిరుద్యోగం, ఆర్థిక, ఆరోగ్య సంక్షోభాలతో జనం అల్లాడుతుంటే ప్రభుత్వాల చర్యలూ, చేయూతలు మాత్రం సంపన్నులకే దక్కుతుండటం ఈ వ్యవస్థ వికృతరూపాన్ని బట్టబయలు చేస్తున్నది. ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డది ఉద్యోగులు, కార్మికులు అయితే ఉద్దీపనలు మాత్రం కార్పొరేట్ల కోసమే వెలువడు తుండటం వైచిత్రి! పెట్టుబడిదారీ వ్యవస్థకు ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ తమ లాభాలే తప్ప ప్రజల ప్రయోజనాలు పట్టవనడానికి ఉదాహరణగా ప్రపంచంలో ఇలాంటి అనేక పరిణామాలను మనం ఈ కరోనా కాలంలో చూడగలిగాం. ఈ పరిణామాలకు మన దేశమూ మినహాయింపు కాకపోగా మోడీ ఏలుబడిలో మరింత దుష్ఫలితాలను చవిచూస్తోంది. ఫలితంగా నిన్నటిదాకా కరోనా నివారణలో మన ప్రధానిని ప్రపంచానికే ఆదర్శంగా చూపుతూ సోషల్ మీడియాలో శివతాండవం చేసిన అనుచరగణమంతా నేడు మౌనంలోకి జారుకుంటున్నది. అయినా తమ చేతగాని తనానికి నేతలే మొహం చాటేస్తుంటే వారు మాత్రం ఏం చేయగలరు..?
పెరుగుతున్న కరోనా ఉధృతికి మన ప్రజారోగ్య వ్యవస్థ తట్టుకోలేదన్న సత్యం రోజు రోజుకూ నిరూపితమవుతున్నా కేంద్రం నిశ్చేష్టగా చోద్యం చూస్తోండటంతో ప్రభుత్వాల చేతగాని తనానికి ప్రాణరక్షణ ప్రజల విధిగా మాత్రమే మారిపోయింది. ఇప్పటి వరకు ప్రధాని ప్రకటనలలో గానీ, ప్రకటించిన ప్యాకేజీలలో గానీ ఏ భరోసా లేకపోవడంతో ప్రజల ప్రాథమిక హక్కుయిన ఆరోగ్యం దిక్కులేనిదయింది. ఏలినవారి ప్రసంగాల్లోనూ, ప్యాకేజీల్లోనూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తామన్న అభయం గానీ, ఆరోగ్య సేవల గురించిన నిర్దిష్టమైన ప్రణాళికగానీ లేకపోవడం ఓ విషాదం. ఇప్పటి వరకూ కరోనాను ఎదుర్కొవడంలో ఎదో ఒక స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలే కృషి చేస్తున్నాయి. కానీ ఈ కాలంలో అవి కోల్పోయిన ఆదాయాలను పూడ్చే ప్రయత్నమేదీ ఈ ప్యాకేజీలో లేకపోవడం కూడా కేంద్రం వైఖరికి అద్దంపడుతోంది. నిజానికి ఈ ఆర్థిక ప్యాకేజీ ఓ ఆత్మవంచన. ఇందులో అత్యధిక భాగం బ్యాంకులు ఇచ్చే రుణాలు, ఇప్పటికే బడ్జెట్లో ప్రకటించిన నిర్ణయాలు. ప్రస్తుత కరోనా సృష్టించిన సంక్షోభానికీ, ఈ ఆర్థిక ప్యాకేజీకీ సంబంధమే లేదు. అసలిది ప్రజలు కోరుకున్న ప్యాకేజీ కానేకాదు. ప్రభు త్వం అమలుచేయదల్చుకున్న సంస్కరణలు. ఇంతటి విలయంలోనూ ఏలిన వారి ధ్యాసంతా తమ సంపన్నవర్గాల ప్రయోజనాలూ, తమ రాజకీయ ప్రయోజనాల మీదే తప్ప ప్రజల ప్రాణాల మీద కాదని మొన్నటి మోడీగారి ''నమస్తేట్రంప్'' కార్యక్రమమూ, నిన్నటి ఆర్థికమంత్రి విడతలవారీ వివరణ లూ, నేటి హౌం మంత్రి బీహార్ ఎన్నికల సన్నాహాలు స్పష్టంగానే తెలియ జేస్తున్నాయి. ఇప్పటికైనా పౌర సమాజం మేలుకోకుంటే మిగిలేది చీకటే...