Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పంతాలు, బేషజాలకు స్వస్తి పలికి పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిస్తే సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవడం అసాధ్యమేమీ కాదు. 1993, 1996, 2005, 2013లో ఇరు దేశాలు కుదుర్చుకున్న ఒప్పందాలు, ఇటీవల మోడీ, జిన్పింగ్ మధ్య కుదిరిన ఒప్పందాల ఆధారంగా సమస్యను పరిష్కరించుకోవచ్చు. 'హిందీ-చీనీ భాయి భాయి' స్ఫూర్తితో ముందుకు సాగాలి.
సరిహద్దు సమస్యను చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భారత్-చైనా నిర్ణయించుకోవడంతో ఇరు దేశాల సరిహద్దు వివాదానికి సంబంధించి గత నెల రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభన వీడింది. కోవిడ్-19 ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న తరుణంలో జనాభా పరంగా ప్రపంచంలోనే రెండు అతి పెద్ద దేశాల మధ్య ఉద్రిక్తతలు ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయో ఊహించుకోవచ్చు. రెండు దేశాల నేతలు వివేచనతో వ్యవహరించి ఈ వివాదానికి తెరదించడం ఒక మంచి పరిణామం. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం ఈనాటిది కాదు. అనేక దశాబ్దాలుగా నలుగుతూ వస్తున్న సమస్య ఇది. ఈ సరిహద్దు వివాదం 1962లో యుద్ధానికి దారి తీసింది. 1967లో రెండు చిన్నపాటి ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి. సమస్య మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. భారత్, చైనా యుద్ధం తరువాత ఉనికిలోకి వచ్చిన వాస్తవాధీన రేఖ (ఎల్ఎసి) పై కానీ, టిబెట్ ప్రాంతంలో సరిహద్దు విభజనకు సంబంధించిన మెక్ మోహన్ రేఖపై కానీ రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం ఎప్పుడూ లేదు. బ్రిటిష్వారు గీచిన మెక్మోహన్ రేఖను తాము ఎలా గుర్తిస్తామని చైనా వాదిస్తుంటే, వాస్తవాధీన రేఖ అస్పష్టంగా ఉందని భారత్ వాదిస్తున్నది. సరిహద్దుపై రెండు దేశాల మధ్య తగాదాను ఆసరా చేసుకుని ఇందులో తల దూర్చాలనేది అమెరికా ఎత్తుగడ. ఇరు దేశాల మధ్య తాజా ఉద్రిక్తతకు కారణం మే 5న లడఖ్లోని గాల్వాన్ వ్యాలీ, పాంగాంగ్ త్సో లేక్, గోగా పోస్ట్, సిక్కింలోని నకూలాలో అటు ఇటు భారీగా బలగాలను మోహరించడమే. డోక్లామ్ వివాదంలోనూ ఇదే విధంగా సైన్యాలను అటు ఇటు మోహరించడంతో 73రోజుల పాటు తీవ్ర ప్రతిష్టంభన నెలకొంది. చివరికి ఇరుపక్షాలు తమ అదనపు బలగాలను వెనక్కి రప్పించాలని నిర్ణయించుకోవడంతో ఆ ప్రతిష్టంభన తొలగిపోయింది.
ఈ సారి వివాదం తలెత్తగానే డొనాల్డ్ ట్రంప్ దీనిలో మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. మీ జోక్యం మాకొద్దు పొమ్మని భారత్, చైనా తేల్చి చెప్పడంతో అమెరికా అధ్యక్షుడి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైంది. భారత్కు చైనాను శత్రువుగా చూపించడం ద్వారా ఆ దేశాన్ని ఒంటరిపాటు చేయాలనేది ట్రంప్ ఎత్తుగడ. దీనికి దేశంలోని కార్పొరేట్ మీడియా, సంఫ్ుపరివార్ కూటమి వంత పాడుతున్నాయి. చైనా వ్యతిరేకతను ఒక పథకం ప్రకారం రెచ్చగొడుతున్నాయి. భారత్, చైనా మధ్య అనాదిగా వస్తున్న దౌత్య పరమైన సంబంధాల గురించి ప్రస్తావించకుండా, వాటి మధ్య విభేదాలను భూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నం చేస్తున్నాయి. ఎవరు ఎన్ని కుతంత్రాలు పన్నినా 1967 తరువాత భారత్, చైనా మధ్య సరిహద్దుల్లో ఇంతవరకు ఎటువంటి చిన్న ఘర్షణ జరగలేదనే వాస్తవాన్ని అవి ఉద్దేశపూర్వకంగానే గుర్తించ నిరాకరిస్తున్నాయి. ప్రత్యేకించి గత దశాబ్ద కాలంలో ఇరుదేశాల స్నేహ సహకార సంబంధాల్లో కొంత పురోగతి ఉంది. 2012లో ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో భారత్, చైనా మైత్రి, వ్యూహాత్మక సహకారాన్ని పెంపొందించుకోవాలని, ఉమ్మడి అభివృద్ధికి కలసికట్టుగా పాటుపడాలని చైనా ప్రధాని సీ జిన్పింగ్, అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ పిలుపునిచ్చారు. ఆ తరువాత మోడీ చైనా నేత జిన్ పింగ్తో రెండు సార్లు ఇష్టాగోష్టి సమావేశాలు నిర్వహించారు. భారత్, చైనా ద్వైపాక్షిక సంబంధాలకు 70 ఏండ్లు నిండుతున్న సందర్భంగా ఇరు దేశాల్లోను పలు కార్యక్రమాలను నిర్వహించాలని ఇరువురు నేతలూ సంకల్పించారు. చైనా చేపట్టిన 'బెల్ట్ అండ్ రోడ్డు ఇనీషియేటివ్'లో చేరరాదని భారత్ నిర్ణయించుకోవడం ఒకింత ఆశ్చర్యం కలిగించింది. భారత్, చైనా మధ్య మైత్రీబంధం బలోపేతం కావడం ఇరు దేశాలకు ఉపయోగకరం. సరిహద్దు సమస్యపై చర్చలు ఒక వైపు సాగిస్తూనే, మరో వైపు ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకోవడంపై దష్టి పెట్టాలి. 2018లో భారత్, చైనా అధినేతలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఇరుదేశాలు ఉన్నత స్థాయి అధికారుల మధ్య చర్చలు గత రెండేండ్లుగా నిరంతరం సాగుతున్నాయి. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గకుండా భారత్, చైనాతో సహకార సంబంధాల బలోపేతానికి కృషి చేయాలి. తద్వారా ఈ ప్రాంతంలో అమెరికా జోక్యానికి తావు లేదని చాటిచెప్పాలి. మరో వైపు సరిహద్దుల్లో పరస్పర విశ్వాసాన్ని పెంపొందించే చర్యలు ఇరు దేశాలు చేపట్టాలి. పంతాలు, బేషజాలకు స్వస్తి పలికి పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిస్తే సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవడం అసాధ్యమేమీ కాదు. 1993, 1996, 2005, 2013లో ఇరు దేశాలు కుదుర్చుకున్న ఒప్పందాలు, ఇటీవల మోడీ, జిన్పింగ్ మధ్య కుదిరిన ఒప్పందాల ఆధారంగా సమస్యను పరిష్కరించుకోవచ్చు. 'హిందీ-చీనీ భాయి భాయి' స్ఫూర్తితో ముందుకు సాగాలి.