Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బతికిన నాలుగునాళ్ళు క్షేమంగా, నిశ్చింతగా, ఆరోగ్యంగా బతకాలంటే భయాన్ని అధిగమించాలి. ఈ భయాన్ని మనలో రాజేసిన ప్రయివేటు రంగాన్ని భూస్థాపితం చేయాలి. మార్కెట్ ఆధారిత వాణిజ్యవ్యవస్థల ధ్వంసం అనివార్యం. మనుషుల పట్ల బాధ్యతతో, దయతో, మమకారంతో వ్యవహరించే వ్యవస్థల నిర్మాణం అవసరం. ఈ వివేచన, సోయి, చైతన్యం మాత్రమే భయాన్ని జయించేందుకు సోపానం.
ఎల్లెడలా భయం రాజ్యమేలుతున్నది. మనిషిని చూస్తే మనిషికి భయం. బయటికెళ్ళాలంటే భయం. ఎవరింటికి వెళ్ళాలన్నా భయం. మన ఇంటికి ఎవరు వచ్చినా భయం. దగ్గితే భయం. తుమ్మితే భయం. తాకితే భయం. మనిషి పలకరిస్తే భయం. ఆటో ఎక్కాలంటే భయం. హాస్పిటల్కు వెళ్ళాలంటే భయం. పక్క ఊరి నుంచో, పక్క రాష్ట్రం నుంచో మన వాకిట్లోకి ఓ మనిషి వచ్చాడంటే భయం. సర్వత్రా భయం నెలకొన్న భీతావహ దృశ్యం మనుషుల్ని కలవరపెడుతున్నది. కల్లోలానికి లోను చేస్తున్నది. వార్తలు విన్నా, చూసినా భయం. తెలియని భీతి ఏదో వెంటాడి రాత్రి కలలోకి వచ్చి బెంబేలెత్తిస్తున్నది. ఎందుకింత భయం? ఏల ఈ ఉలికిపాటు?
రోజురోజుకీ పెరుగుతున్న కోవిడ్-19 కేసులు మనుషుల్ని భయపెడుతున్నాయి. టీవీ వార్తలు వింటే చెమటలు పట్టేసేంత భయం. మళ్ళీ లాక్డౌన్ పెడతారంట కదా అనే భయకంపితమైన మాట వినిపిస్తున్నది. మీడియా రెండు మూడురోజులుగా ఈ భయాన్ని పెంచి పోషిస్తున్నది. కరోనా భయమే కాదు, బతుకు భయం, అప్పుల భయం, చిట్టీలు కట్టేదెలా, ఇంటి అద్దె కట్టేదెలా అన్న భయాలు మనుషుల్ని పీల్చిపిప్పి చేస్తున్నాయి. ప్రభుత్వాలు భయపడుతున్నాయి. ప్రజల్ని భయపెడుతున్నాయి. జాగ్రత్తలు చెప్పాల్సిన వారే భీతిగొలిపే వ్యవహారసరళి పట్ల మౌనంగా ఉన్నారు. అందుకే కరోనా వ్యాధిగ్రస్తుల్ని పశువుల్లా చూడటమేమిటని స్వయంగా సుప్రీంకోర్టు మండిపడింది.
జ్వరమొచ్చి డాక్టర్ దగ్గరకు వెళితే దూరదూరంగా ఉంచుతారు. మాట వినరు. ఏమీ కాదులెమ్మన్న భరోసా ఇవ్వరు. వైద్యులకూ భయం. రోగిని చూడాలంటే భయం, దగ్గరకు రానివ్వాలంటే భయం. దయాపూరిత హృదయంతో చికిత్స చేసే డాక్టర్లకు ప్రభుత్వం నుంచి భరోసా ఉండదు. రక్షణ కవచాలు అందవు. వారికి అండగా ఉండాలన్న ప్రభుత్వమే వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఆ నిర్లక్ష్యం, వైమనస్యం డాక్టర్లలో భయానికి దారితీస్తుంది. అది రోగులపైనా ప్రభావం చూపుతుంది. తమకే రక్షణ లేదని వైద్యులు తలపోస్తే, తమ ఆరోగ్యానికి చేటు వస్తుందని అనుకుంటే అస్వస్థతకు లోనయ్యే రోగులకు ఏం చెప్పగలరు, ఎలాంటి చికిత్స నందించగలరు.
భయమే పెద్ద రోగం, భయమే అసలు శత్రువు. దీన్ని అధిగమించాలని చెబుతున్నారు. కానీ అందుకు మార్గాలు సూచించరు. భయాన్ని అంతమొందించే విధివిధానాలు పాలకుల వద్ద శూన్యం. మాటలు కోటలు దాటుతాయే గానీ చేతలు 'ప్రగతి' ప్రాంగణాల్ని దాటవు. అందుకే కరోనా బాధితులకు భరోసానిచ్చే వైద్యులే వీధుల్లోకి వచ్చి నినాదాలు చేయాల్సివచ్చింది. అధికారంలో ఉన్నవారికి సున్నితత్వం, కరుణాంతరంగం, హేతుబుద్ధి కొరవడిన ఫలితంగా అంతటా భయం రాజ్యమేలుతున్నది. ఎక్కడో న్యూజిలాండ్లో కరోనా కేసులు జీరోకు చేరాయన్న వార్తని ఆనందంగా చదువుకుంటాం. దానికి అసలు మూలం ఏమిటో ఆలోచించేవారు అరుదు. అక్కడి పాలకులు వివేచనతో వ్యవహరించారు. శాస్త్రీయంగా ఆలోచించారు. జనానికి భయం అక్కర్లేదన్న భరోసాని ఇచ్చారు. కరోనా విపత్తును ధైర్యంగా ఎదుర్కొందామన్న సంకల్పాన్ని అందించారు. మాటలో, చేతలో చిత్తశుద్ధితో వ్యవహరించారు. మనదగ్గర గద్దెలెక్కినవారిలో కొరవడింది ఈ నిజాయితీనే. అందుకే కట్టుకథలతో, అబద్ధాలతో, అంకెల గారడీతో రోజులు వెళ్ళబుచ్చుతున్నారు. రోజురోజుకీ జనాల్ని మరింత భయకంపితుల్ని చేసే రీతిన వ్యవహరిస్తున్నారు.
వట్టిమాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టవోరు అనే మాటని పెడచెవిని పెట్టారు. వట్టి మాటలు చెబుతూ కాలాన్ని కరగదీస్తూ వచ్చారు. చేయకూడని పనులు చేస్తున్నారు. కరోనాతో కలిసి బతకాలంటూ చేతులెత్తేశారు. ఇదే జనంలో భయానికి మూలం. పాలకులే నిష్క్రియాపరులయితే ప్రజలు భయపడటంలో ఆశ్చర్యమేముంది. మరల లాక్డౌన్ అంటూ జనాల్ని ఇంకొంత భయపెడుతున్నారు. ఇప్పటికే పనుల్లేక, ఆదాయాల్లేక, అప్పులు తీర్చలేక అవస్థలు పడేవారు లాక్డౌన్ అంటే భయపడటం సహజం.
మనిషి నుంచి మనిషికి సోకే కరోనా విపత్తు నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో శాస్త్రీయంగా వివరించి చెప్పాలి. పని పద్ధతుల్లో ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలి. సరికొత్త అభివృద్ధి నమూనాలకు, జీవిత నమూనాలకు అంకురార్పణ చేయాలి. విద్యారంగంతో సంబంధం ఉన్న తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు విపరీతంగా తల్లడిల్లుతున్నారు. కొన్ని లక్షల మంది ప్రయివేట్ అధ్యాపకులది దీనాతిదీనమైన విలాపం. వారు కరోనా భయంతో కాదు ఉపాధిలేమి భయంతో, వేతనాల రాహిత్యంతో బతుకు బీభత్సమై వాపోతున్నారు. వారికి ఓదార్పుని ఇవ్వాల్సిన, ఆదరువు చూపించాల్సిన ప్రభుత్వం కండ్లు మూసుకున్నది.
మూడు దశాబ్దాలుగా విద్యా వైద్య రంగాల్ని ప్రయివేటు పరం చేసిన దుష్ఫలితాల పెను ప్రభావం కరోనా కాలంలో మరింతగా తేటతెల్లమైంది. అందుకే అంతటా భయం తారాట్లాడుతున్నది. భయాన్ని జయించే శాస్త్రీయ ఆలోచన, విధానాల లేమి స్పష్టంగా కనిపిస్తున్నది. కరోనా కొన్ని నెలలకో, ఒకటి రెండు సంవత్సరాలకో తొలగిపోవచ్చు. కానీ నిత్యమూ, నిరంతరమూ అభద్రతతో, బతుకు భయంలో తల్లడిల్లే వారికి ఏది భరోసా? బతికిన నాలుగునాళ్ళు క్షేమంగా, నిశ్చింతగా, ఆరోగ్యంగా బతకాలంటే భయాన్ని అధిగమించాలి. ఈ భయాన్ని మనలో రాజేసిన ప్రయివేటు రంగాన్ని భూస్థాపితం చేయాలి. మార్కెట్ ఆధారిత వాణిజ్యవ్యవస్థల ధ్వంసం అనివార్యం. మనుషుల పట్ల బాధ్యతతో, దయతో, మమకారంతో వ్యవహరించే వ్యవస్థల నిర్మాణం అవసరం. ఈ వివేచన, సోయి, చైతన్యం మాత్రమే భయాన్ని జయించేందుకు సోపానం.