Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చైనా సరుకుల్ని బారుకాట్ చేయాలన్న డిమాండ్ మొదటి లేవనెత్తింది గుజరాత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఇప్పటిదాకా బీజేపీగానీ, ఆర్ఎస్ఎస్గానీ డబ్ల్యూటీఓలో నుంచి బయటికి రావాలన్న డిమాండ్ చేశారా? అదిచేయకుండా ఇది ఎలా సాధ్యమో ఏలినవారే సెలవియ్యాలి! మోడీ అయినా, మోహన్భగవత్ అయినా 'ఆత్మ నిర్భర్' ఉచ్ఛరణ హఠాత్తుగా చేసిన దాని వెనకున్న కథ ఇది.
ఆలంబన దెబ్బతినడం ప్రారంభమైన ముప్పయ్యేండ్లకు, వారంరోజుల తేడాలో, దాదాపు దేశమంతా మర్చిపోయిన మాటను హఠాత్తుగా మూలవిరాట్ నోటివెంట, మార్గదర్శి నోటివెంట ''ఆత్మ నిర్భర్'' జాలువారింది. ప్రపంచీకరణ విధానాల్లో దేశం కొట్టుకుపోవడం మొదలైన మూడు దశాబ్దాలకు ''ఆత్మ నిర్భర్'' అనే మాట వెంట వెంటనే ఇద్దరు కీలక వ్యక్తులు భారత ప్రధాని, ఆర్ఎస్ఎస్ సర్సంఫ్ుచాలక్ల నోళ్ళ నుంచి వెలువ డటం కాకతాళీయమేమీ కాదు, ఉబుసు పోక అన్న మాటల అంతకన్నా కావు.
దీని భావమేమీ తిరుమలేశా! అని మనం జుట్టు పీక్కోనవసరం లేదు. అంతా రిలయన్స్ పరమైపోయిన తర్వాత 'సెల్ప్ రిలయన్స్' అనే మాటకు ఉన్న అర్థమేపాటి?! అనుకోనక్కర్లేదు. మోడీ, మోహన్భగవత్ లిద్దరూ స్పష్టంగా ఉన్నారు. తెలుగు నిఘంటువులోకి 'స్వావలంబన' అనే మాటకు కొత్త అర్థం మోసుకొచ్చిన ఈ ఇద్దరు పెద్ద మనుషులకు మనం జోహార్లర్పించాల్సిందే.
ఈ ''ఆత్మ నిర్భర్'' ఒంటినిండా కత్తులన్న మాట, ఎన్నో సాంప్రదాయకబద్ధమైన అంశాల్ని చీల్చి చంపగల సత్తా ఆ కత్తులకుంది. ఆ మాటకుంది. ఆత్మ నిర్భర్ అంటే స్వావలంబన. 3వ ప్రపంచ దేశాల్లో, ముఖ్యంగా మనదేశంలో ఈ మాటకున్న అర్థమేమంటే స్వాతంత్య్రా నంతరం సామ్రాజ్యవాద దేశాల వత్తిడికి తలొగ్గకుండా, సోవియట్ యూనియన్, ఇతర సోషలిస్టు దేశాల సాయంతో ప్రభుత్వరంగాన్ని నిర్మించుకోవడం, ప్రభుత్వరంగ పరిశ్రమలు, ముఖ్యంగా మౌలికరంగాల్లో నిర్మితమైనవి. దేశ పురోభివృద్ధికి అవి ఇతోధిక సాయం చేశాయి. వీటికి ప్రభుత్వరంగంలో నిర్మితమైన బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాలు వెన్నుదన్నుగా నిలిచాయి.
ఈ ప్రక్రియ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మనదేశాన్ని నిలబెట్టింది. అలీనోద్యమ నాయకుడుగా అనేక పేద దేశాలపై అమెరికా దాష్టికాన్ని ఎదిరించే మొనగాడిగా మనదేశం ఉండింది. స్వావలంబనలో ఉన్న ''స్వ'' ''ఆలంబన'' నేడేది? దీన్ని ధ్వంసం చేయడాన్నే ఆత్మ నిర్భర్ అనడం నేటి వైచిత్రి! ప్రభుత్వ రంగాన్ని చీల్చి చంపడమే ఈ కత్తుల బోను ''ఆత్మ నిర్భర్'' లక్ష్యం.
1985లో కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో ప్రభుత్వ రంగమంటేనే నష్టాల్లో ఉండేదన్నట్టు ప్రచారం చేశారు. ఈ తెల్ల ఏనుగును ఇంకా మేపాలా అనడిగేవారు. సరళీకృత ఆర్థిక విధానాల వంతపాట గాళ్ళు, మధ్యతరగతిలోని మిడిమిడి 'జ్ఞాన సంపన్నులు'' ఈ ప్రచారానికి వాహకాలుగా ఉపయోగపడుతున్నారు. ఒకసారి వాహకం అవతారమెత్తిన తర్వాత ఆ ప్రచారోధృతిలో కొట్టుకుపోవడం తప్ప ఆగి ఆలోచించే అవకాశమెక్కడిది? 2020లోనూ సీన్ అదే! బ్యూరో ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ ప్రతి సంవత్సరమూ కాంగ్రెస్ పాలనైనా, బీజేపీ పాలనైనా విడుదల చేసే వివరాలు ఎవరూ చదవరని పాలకుల ధైర్యం. ప్రభుత్వరంగ పరిశ్రమల్లో లాభాలొచ్చేవి ఎక్కువ. నష్టాలొచ్చేవి తక్కువనే విషయం ఈ ప్రచారకులకు ఎవరు చెప్పాలి? లక్షలకోట్ల రూపాయలు వివిధ పన్నులు కట్టేది ప్రభుత్వరంగం తప్ప ప్రయివేటు రంగం కాదనే విషయం, ప్రభుత్వ పెట్టుబడికి ఎన్నో రెట్లు ఎక్కువగా డివిడెండ్లు చెల్లించేది ప్రభుత్వరంగమేననే విషయం వీరికి ఎవరు చెప్పాలి? గత ఇరవయ్యేండ్లలో ప్రభుత్వం ఈ పరిశ్రమల్లో పైసా పెట్టుబడి పెట్టకపోయినా అవి మహరాజుల్లా బతికాయని వీరికి ఎవరు చెప్పాలి? పాము తన పిల్లల్ని తానే తిన్నట్టు కేంద్ర ప్రభుత్వం సీపీఎస్యులకు ఆర్డర్లు ఇవ్వకుండా మాడ్చి చంపుతున్నది. ఇనిషియల్ పబ్లిక్ ఆఫైర్ (ఐపీఓ) పేరున కొన్నింటిని షేర్ల బైబ్యాక్ పద్ధతిలో కొన్నింటిని, వేలం పాట పద్ధతిలో కొన్నింటిని, వ్యూహాత్మక అమ్మకం పేరున కొన్నింటిని విఎస్ఎన్ఎల్, బాల్కో, హిందూస్థాన్ జింక్ లాగా పూర్తి ప్రయివేటీకరణతో కొన్నింటిని బీజేపీ సర్కార్ వదిలించుకుంటోంది. ఇవన్నీ పోయిన తర్వాత (స్వావలంబన) ఆత్మ నిర్భర్ ఏమిటి?
కోవిడ్-19 కంటే చాలా ముందునుంచే (2011-12 నుంచి) దేశ ఆర్థిక ప్రగతి తిరోగమనంలో ఉంది. మేక్ ఇన్ ఇండియాలు, స్టార్టప్ ఇండియాలు నిరుపయోగమైపోయాయి. 2018, 2019 ఆర్థిక సంవత్సరంలో పరిస్థితి ఇంకా దిగజారింది. 2020 నుంచి కోవిడ్ సమస్య వచ్చిపడింది. గత 40ఏండ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం పెరిగింది. ఫ్యాక్టరీ ఉత్పత్తి నెమ్మదించిన నేపథ్యంలో కోవిడ్ దెబ్బతో దాదాపు 'సున్నా' కొచ్చింది.
ఈ దశలో అది పర్మినెంట్ ఉద్యోగమా, కాంట్రాక్టు ఉద్యోగమా, ప్రభుత్వ రంగమా, ప్రయివేటు రంగమా ఆలోచించే దశలో సగటు భారతీయుడు లేడు. ఆసరా దొరికిందే చాలనుకునే స్థితి. అందుకే పూర్తిస్థాయి ప్రయివేటీకరణకు తెరలేపాడు మోడీసాబ్. ఇప్పటిదాకా ప్రభుత్వరంగంలో సాగిన ఉత్పత్తులు, వాటిని మాడ్చి చంపి ప్రయివేటు రంగంలో తయారుచేయడం మోడీ బ్రాండ్ మేకిన్ ఇండియా!
మనదేశంలో గత మూడేండ్లుగా చైనా సరుకులు రెట్టింపు అయ్యాయి. ఇక్కడేమిటి, అమెరికా మార్కెట్లనిండా చైనా సరుకులే. అమెరికా ఏరికోరి ప్రారంభించుకున్న ప్రపంచ వాణిజ్య సంస్థ రూల్స్ ప్రకారమే ఇదంతా జరుగుతోంది. చైనాపైనా, ఆ పేరుమీద కమ్యూనిస్టు సిద్ధాంతంపైనా దాడికి మోడీ సర్కార్ వాడుతున్న కత్తుల్లో ఓ కత్తి చైనా వ్యతిరేకత! చైనా సరుకుల్ని బారుకాట్ చేయాలన్న డిమాండ్ మొదటి లేవనెత్తింది గుజరాత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఇప్పటిదాకా బీజేపీగానీ, ఆర్ఎస్ఎస్గానీ డబ్ల్యూటీఓలో నుంచి బయటికి రావాలన్న డిమాండ్ చేశారా? అదిచేయకుండా ఇది ఎలా సాధ్యమో ఏలినవారే సెలవియ్యాలి! మోడీ అయినా, మోహన్భగవత్ అయినా 'ఆత్మ నిర్భర్' ఉచ్ఛరణ హఠాత్తుగా చేసిన దాని వెనకున్న కథ ఇది.