Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్లకు వేతనాలు చెల్లించే విషయంలో టీఆర్ఎస్ సర్కార్ శషబిషలకు పోతున్నది. లక్షలాది మందికి ప్రతినెలా రూ.3500 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా, కరోనా పేరుచెప్పి వాయిదా వేసే ప్రయత్నాలు ఇంకా చేస్తూనే ఉంది.. ధనిక రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం పేర మార్చి నుంచి అమలుచేస్తున్న వేతనాల కోత విధానానికి అధికారికంగా రాజముద్ర వేసుకునేందుకు కేసీఆర్ సర్కారు మంగళవారం అర్థరాత్రి ఆర్డినెన్స్ను తెచ్చి చట్టబద్ధత కల్పించుకుంది. కరోనా వైరస్ విపత్తు నేపథ్యంలో రాష్ట్రంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్న కారణంగా దాని కింద ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్దార్లు, ఇతరుల వేతనాల్లో 50 శాతానికి మించకుండా కోత (డిఫర్మెంట్)కు ఆర్డినెన్స్ ద్వారా మార్గం సుగమమం చేసుకుంది. వేతనాలు, పింఛన్లపై రెండు నెలల నుంచి హైకోర్టులో కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. పింఛనర్ల జేఏసీ నేత నాగటి నారాయణ వేసిన పిల్తోపాటు మరో ఇద్దరు న్యాయవాదులు రాసిన లేఖలను సుమోటోగా తీసుకుని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విచారణ చేస్తున్నది. ఆర్థిక అత్యయిక స్థితి విధిస్తే తప్ప పింఛన్లల్లో కోత వేయడానికి వీల్లేదన్న హైకోర్టు వ్యాఖ్యలతో ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ జారీకి పూనుకోవడం గమనార్హం. ఆన్ని కేటగిరీల ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతనాల్లో 50శాతం, నాలుగో తరగతి, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాల్లో 10శాతం కోతపెట్టారు. అన్ని రకాల రిటైర్డ్ ఉద్యోగుల పింఛనర్లకు 25శాతం నిలిపేశారు. ఈ కోతల నుంచి వైద్య, ఆరోగ్య, పోలీస్ శాఖల ఉద్యోగులు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులను మాత్రమే మినహాయింపు నిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్లకు వరుసగా మార్చి, ఏప్రిల్, మే వేతనాలు, పింఛన్లల్లో కోతపెట్టడం విమర్శలకు దారితీసింది. ప్రభుత్వ నిర్ణయంతో మూడు నెలలుగా వీరంతా తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఈఎంఐలు, పిల్లల చదువులకు డబ్బులేక అవస్థలు పడుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు 3.5 లక్షలు, కాంట్రాక్టు సోర్సింగ్ ఉద్యోగులు 1.5 లక్షలు, పింఛనర్లు 2.5 లక్షల మంది ఉన్న విషయం విదితమే. వీరందరికీ రూ.3500 కోట్లు ప్రభుత్వం ప్రతినెలా వేతనాల కోసం ఇవ్వాల్సి ఉంది. కాగా ఆర్డినెన్స్ ద్వారా బకాయి వేతనాలు ఎప్పుడిస్తారనే సంగతిని ఆరు నెలల్లోగా చెప్పాల్సి ఉంటుంది. మార్చి 24 నుంచి అమల్లోకి వచ్చిన వేతనాల వాయిదాను సెప్టెంబర్ 24 వరకు అధికారికంగా అమలుచేయడానికి ఆర్డినెన్స్ సర్కారుకు ఆయుధంగా ఉపయోగపడనుంది. ఆలోగా బకాయి వేతనాలు ఎప్పుడిస్తారనేది చెప్పడం ఆర్డినెన్స్ సారాంశం. నిజానికి ఆర్డినెన్స్ గడువు ఆరు నెలలు మాత్రమే. ఈలోగా జరిగే శాసనసభ సమావేశాల్లో దీన్ని చట్టం చేయడం లేదా బిల్లు ఆమోదించడం సాంకేతికాంశం. తప్పనిసరి కూడా. లేనిపక్షంలో మరోసారి ఆర్డినెన్స్ తేవాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు, ఉన్నతాధికారులు అంటున్నారు. ప్రభుత్వం తెచ్చిన గెజిట్ నోటిఫికేషన్ చీకటి ఆర్డినెన్స్గా రాజకీయపార్టీలతోపాటూ సంఘాలూ విమర్శిస్తున్నాయి. ఎంప్లాయి ఫ్రెండ్లీగా చెప్పుకునే కేసీఆర్ సర్కారు నియంతృత్వం పోకడతో వెళుతున్నది. ఉద్యోగులు, వాటి సంఘాలతో ఎలాంటి సంప్రదింపులు, చర్చలు లేకుండానే ఏకపక్షంగా వేతనాలకు కోత పెట్టడం దారుణం. అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇతర అధికారులకు సైతం 60శాతం కోతపెట్టడం పట్ల ఆ సర్వీసు అధికారుల సంఘం నుంచి నిరసన వ్యక్తమవుతున్నది. ఒకటి, రెండు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల్లోని కొందరు నేతలు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్ల ఆర్థిక ప్రయోజనాలను దెబ్బకొట్టేలా వ్యవహరిస్తుండటం విచారకరం. ఫైరవీలు చేసుకుంటా లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్ల ప్రయోజనాలను తాకట్టుపెట్టడం దారుణం. లాక్డౌన్ ప్రారంభమైన వారంరోజుల్లోనే ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ వేతనాలకు భారీ కోతపెట్టిన ప్రభుత్వం ఆన్లాక్ అయినా అలాగే ఆ కోతలను కొనసాగించడాన్ని ఉద్యోగులు తప్పుబడుతున్నారు. కరోనా మహమ్మారితో దేశం, రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు తారుమారయ్యాయనే అభిప్రాయం ఎంతమాత్రం సహించ రానిదని బెంగళూరు ఐఐఎం రిటైర్డ్ ప్రొఫెసర్ భరత్ ఝున్ఝున్వాలా వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమల పతనం, జీఎస్టీ, పౌరసత్వ చట్టాల ఫలితంగా నెలకొన్న సామాజిక అశాంతి న్యాయ వ్యవస్థతో సహా అన్నిచోట్లా ప్రబలిన అవినీతి తదితరాలే మన ఆర్థిక వ్యవస్థ పురోగతికి ప్రధాన ఆటంకాలుగా ఉన్నాయని చెప్పారు. ప్రజలను విశ్వాసంలోకి తీసుకోవడం, సామాన్యులపై ఆర్థిక భారం పడకుండా చూడటం కీలకమని అభిప్రాయపడ్డారు. అలాగే వేతనాల్లో కోతలు న్యాయసమ్మతం కాదనీ, ఈ విషయమై 48 గంటల్లోగా సర్కారు సమాధానం చెప్పాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో తెచ్చిన ఆర్డినెన్స్ ప్రభుత్వం ఆడుతున్న 'డ్రామా'కు నిలువుటద్దంగా కనిపిస్తున్నది. ప్రభుత్వ అధికారాలను ప్రశ్నించిన నేపథ్యంలో సర్కారు ఆర్డినెన్స్ ద్వారా తన అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నదనే ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి.