Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాలకులు తలచుకుంటే మందగించిన ఉత్పత్తి క్రమాన్ని శీఘ్రంగా గాడిన పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడటం పెద్ద కష్టమేమీ కాదు. అయినా, అందుకు పూనుకోరు కాషాయ పాలకులు. అది వారి వర్గ స్వభావం. వెల్లువెత్తే ప్రజా పోరాటాలు మాత్రమే వారిని దారికి తేగలవన్నది సత్యం. ప్రజలు అందుకు సిద్ధపడాల్సిందే.
పాలకులలో మానవ విలువలు నశిస్తే పనిదినాలకే కాదు ప్రజల ప్రాణాలకూ హామీ ఉండదు. సరిగ్గా మన దేశంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. పేదలకు ఉపాధి కల్పించడం ద్వారా వారి ప్రాణాలు కాపాడేందుకు ఉపకారిణిగా ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి (నరేగా) కేంద్ర ప్రభుత్వం ఎసరు పెట్టడం పాలకుల మానవతారాహిత్యాన్ని చాటుతోంది. నాటి యూపీఏ ప్రభుత్వ కాలంలో వామపక్షాల పట్టుదలతో రూపొందించబడ్డ ఈ'చట్టం' దేశంలోని పేదలకు ఊరటగా వర్థిల్లుతోంది. గ్రామీణ ప్రాంతాలలోని పేదలు తమ గ్రామాలను అభివృద్ధి చేసుకుంటూ పనిని పొందేందుకు ఈ చట్టం వీలు కల్పించింది. ఆ మేరకు ప్రజలు దానిని సద్వినియోగం చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటూ ఉన్నారు. ఈ కరోనా కష్ట దినాలలో పట్టణాలను వీడి పల్లెదారి పట్టిన వలస కార్మికులు గ్రామాలలో తమ ప్రాణాలను నిలుపుకోవాలంటే ఉపాధి హామీ పథకం తప్ప మరో మార్గం లేదు. కాబట్టే, ఏప్రిల్ 1 నుంచి జూన్ 17లోపు 7.2కోట్ల మంది ప్రజలు దీని ద్వారా పని కల్పించమని దరఖాస్తు చేసుకున్నారు. కానీ, పేదల ఎడల ఏమాత్రం దయలేని కేంద్ర ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా 2 కోట్ల మంది దరఖాస్తులను బుట్టదాఖలు చేసి తన బుద్ధిని బైటపెట్టుకుంది. మరి ఇప్పుడు ఈ రెండు కోట్ల మందికి దిక్కేమిటి? వీరి ఆకలి సమస్య తీరే మార్గమేమిటి? పట్టణాలలో పనులు లేక పల్లెకు చేరిన ఈ దీనులకు అక్కడ కూడా పని దొరకకుంటే పరిస్థితి ఏమిటి? ఈ పథకం ద్వారా వచ్చే సంపాదనేమీ ప్రజలు సుఖంగా బతికేందుకు సరిపోదు. కానీ తాము గౌరవంగా తమ రెక్కల కష్టంతో బతుకుతున్నామన్న తృప్తినిస్తూ ప్రాణాలను కాపాడుతుంది. అదే చాలు అనుకుంటున్నారు జనం. డిగ్రీలు, పీహెచ్డీలు చేసిన, చేస్తున్న నిరుద్యోగులు విద్యార్థులు సైతం ఉపాధి హామీని ఆశ్రయించి కాయ కష్టంతో తమ కడుపు నింపుకుంటున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ప్రజా వ్యతిరేకత ఇమిడి ఉంటుంది. వీలైనంత మేరకు పన్నుల రూపంలో ప్రజలను పీల్చి పిప్పి చేయడం, వారికి ఎంతో కొంత తోడ్పడే ప్రభుత్వ పథకాలను రద్దు చేయడం ఒక పనిగా పెట్టుకుంది మోడీ ప్రభుత్వం. అంతర్జాతీయంగా డీజిల్, పెట్రోల్ ధరలు గణనీయంగా తగ్గినా ప్రజలను ఏమాత్రం కనికరించని మోడీ ప్రభుత్వం రెండు వారాలలో పెట్రోల్పై రూ.6.55 పైసలు, డీజిల్పై రూ.7.04 పైసలు ధర పెంచి మధ్య తరగతి జీవుల జేబులకు చిల్లుపెడుతోంది. మరో వైపు ఈ పెంపు వల్ల మార్కెట్లో అన్ని వస్తువుల ధరలూ చుక్కలనంటుతున్నాయి. భద్రజీవులమనుకునే ప్రభుత్వ ఉద్యోగులు సైతం సగం జీతంతో బతకాల్సిన పరిస్థితి దాపురించింది. ఇక అరకొర జీతాలతో బతుకు బండి లాగించే అసంఘటిత రంగ కార్మికులు, చిన్నాచితకా వ్యాపారాలు చేసుకుని బతికే బక్క జీవుల నెత్తిపై ఏకంగా పిడుగే పడింది. ఈ కరోనా కాలంలో దేశంలో దాదాపు 14కోట్ల మంది వలస కూలీలు ఉపాధి కోల్పోయారు. దీంతో పట్టణాలలో బతకడం అసాధ్యమై ప్రాణాలకు తెగించి పల్లెదారి పట్టారు. పట్టణాలలోని శ్రమ జీవులు అధికశాతం ఇప్పుడు గ్రామాలలో జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. వారికి అక్కడ పని దొరికేందుకు ఉన్న ఏకైక మార్గం ఉపాధి హామీ పథకం మత్రమే. నిజానికి ఇతర పనులు దొరకకనే కదా వాళ్ళు పట్టణాల దారి పట్టింది. తాము పుట్టిపెరిగిన పల్లెలో పని ఉంటే ఆ కోట్లాది జనం ఏ మాత్రం భద్రదతలేని పట్టాణాలకు ఎందుకు చేరుతారు. నరకప్రాయమైన బతులు ఎందుకు బతుకుతారు. ఇప్పుడు ఆ మార్గమూ మూసుకుపోయింది. తిరిగి పల్లే వారికి దిక్కయ్యింది. అలాంటిది అక్కడ కూడా పని దొరక్కపోతే వారి ప్రాణాలు నిలిచేదెలా? ఈ కఠోర సత్యం అర్థం కాదా మన పాలకులకు? అర్థమవుతుంది. కచ్చితంగా అర్థమవుతుంది. తాము అభయహస్తం అందించకుంటే కోట్లాది పేదల బతుకులు ఆగమైపోతాయని వారికి తెలుసు. తెలిసే పాలకులు తమ నిర్ణయాలను ప్రకటిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే- ప్రజల ప్రాణాలకు హామీ ఇచ్చేందుకు పాలకులు సిద్ధంగా లేరు. ప్రజలు బతకాలి. వాళ్ళ కష్టంతో వాళ్ళు బతకాలి. కనీస సౌకర్యాలతో కాలం గడపాలి. మానవ మాతృలు భరించలేని కష్టాలైనా పంటి బిగువుతో భరించాలి తప్ప, ప్రభుత్వ సాయాన్ని ఆశించరాదు. ప్రభుత్వ సాయాన్ని ఆశించే వాళ్ళకు ఈ దేశంలో బతుకులేదు. భవిష్యత్తులేదు. అప్పటికీ బతకలేక పోతే ఆత్మహత్యలు చేసుకునో, ఆకలి భరించలేకో చావాలి తప్ప సర్కారు చేయూతను చచ్చినా ఆశించకూడదు. పాలకులు ఇలా నిర్ణయించుకున్న తరువాత ప్రతి పరిణామాన్నీ ప్రజలకు వ్యతిరేకంగానే ప్రయోగిస్తారు. ఇప్పుడు కరోనాను కూడా అలాగే ప్రయోగిస్తున్నారు. నిజానికి కరోనా ద్వారా ఉత్పత్తి సాధనాలు, ఉత్పత్తి శక్తులకు తీవ్ర నష్టమేమీ సంభవించలేదు. ఉత్పత్తి క్రమం వాయిదా పడిందే తప్ప విచ్ఛిన్నం కాలేదు. అంటే, పరిస్థితి మన అదుపులోనే ఉంది. పాలకులు తలచుకుంటే మందగించిన ఉత్పత్తి క్రమాన్ని శీఘ్రంగా గాడిన పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడటం పెద్ద కష్టమేమీ కాదు. అయినా, అందుకు పూనుకోరు కాషాయ పాలకులు. అది వారి వర్గ స్వభావం. వెల్లువెత్తే ప్రజా పోరాటాలు మాత్రమే వారిని దారికి తేగలవన్నది సత్యం. ప్రజలు అందుకు సిద్ధపడాల్సిందే.