Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యజమానుల ఆనందం కోసం తమలో తామే పోరాడి తమ ప్రాణాలను కోల్పోవడం కంటే, అటువంటి పోటీకి తమను ఉసిగొలిపిన యజమానిపై తిరగబడాలని గ్రహించాకనే బానిసలు తమ బానిసత్వం నుంచి విముక్తి పొందారు. అలాగే పోటీ ప్రపంచంలో తమలో తామే పోటీ పడటం కంటే... ఒక నూతన ప్రపంచాన్ని ఆవిష్కరించుకోవాలి. దోపిడీ లేని ప్రత్యామ్నాయ వ్యవస్థను సష్టించుకోవాలి.
ఇద్దరు బానిస యుద్ధ వీరుల మధ్య ఎదురెదురు జరిగే పోరాటంలో ఒకడు ఓటమితో మరణిస్తాడు. మరొకడు జయించినా జీవచ్ఛవంలా మిగిలిపోతాడు. స్వేచ్ఛ కోసం పోరాటం, జీవించడం కోసం పోరాటం, ఆత్మగౌరవం కోసం పోరాటం, చివరకు మరణించడానికి కూడా పోరాటం. ఈ పోరాటం తిలకించే యజమానులు మాత్రం అడుగడుగునా వినోదం పొందుతారు. బానిస వీరులు ఒకరిపై ఒకరు సంధించే పిడిగుద్దులకు యజమానులు కేరింతలు కొడతారు. ఎవడు చచ్చినా చప్పట్లు కొడతారు. వారికి కావాల్సింది వారి ప్రయోజనం మాత్రమే. ఇప్పుడు సోషల్ మీడియా కూడా అలాగే మారిపోయింది. ఇప్పుడిదొక పెద్ద వ్యాపార సాధనం. ప్రపంచవ్యాప్తంగా రాజకీయాల కోసం సోషల్ మీడియాను మోసపూరితంగా ఉపయోగించడం... సోషల్ మీడియా అసలు ప్రయోజనాన్ని దెబ్బ తీస్తోంది. తప్పుదోవ పట్టిస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధికుల్ని ప్రభావితం చేస్తున్న మీడియా ఏదైనా ఉంది అంటే... అది ఒక్క సోషల్ మీడియానే. దీనికి ప్రధాన కారణం ఇంటర్నెట్. స్మార్ట్ ఫోన్లు వినియోగంలోకి రావడం, కాల్ రేట్లు తగ్గడం దీనికి మరింత ఊపునిచ్చింది. 'ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో.. ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో.. ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని మతాంధ విశ్వాసపుటెడారిలో ఇంకిపోదో.. తలపులో, పనిలో, నిత్య విశాల పథాల వైపు ఎక్కడ మనస్సు పయనిస్తుందో.. ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి తండ్రీ! నా దేశాన్ని మేల్కొల్పు' అని టాగూర్ ఆకాంక్షించారు. నిర్భయంగా భావాలను, స్వేచ్ఛగా అభిప్రాయాలను, విస్తృతమైన విజ్ఞానాన్ని పొందడానికి, పంచుకోడానికి, పెంచుకోడానికి ఇదొక వేదికగా ఉండబోతుందని స్వేచ్ఛాప్రియులు ఆలోచించారు. అయితే, ఈ అభిప్రాయం అచిరకాలంలోనే మంచులా వీడిపోయింది. ఒక భ్రమలో బతుకుతున్నామని అర్థమౌతోంది.
స్వేచ్ఛగా అభిప్రాయాలను వ్యక్తీకరించడం పట్ల, విజ్ఞానాభివృద్ధికి దోహదపడే భిన్న ఆలోచనా దృక్పథాల పట్ల అసహనం అధికమై, మేధో సజనకారులపై దాడులకు దిగుతున్న కాలం ఇది. చరిత్రకు వక్రభాష్యాలు చెబుతూ, మనువు మా మనోరథం అంటూ హిందూత్వ ఉన్మాదం పెచ్చరిల్లుతోన్న పాలన ఇది. దేశం, ప్రాంతం అనే తేడా లేకుండా మీడియా మొత్తం మా కనుసన్నల్లోనే ఉండాలని, మేం చెప్పిందే రాయాలి, రాసిందే చెప్పాలనే నియంతృత్వ ధోరణితో భయోత్పాతాలను సృష్టిస్తోన్న నిరంకుశత్వం ఇది. అక్కడ ట్రంప్ అయినా, ఇక్కడ మోడీ అయినా... వారి ఆలోచనా ధోరణి మాత్రం నియంతృత్వమే. జార్జి ఫ్లాయిడ్ హత్యపై హౌరెత్తిన నిరసనలపై ట్విట్టర్ వేదికగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆందోళనకరం. ఆ వ్యాఖ్యలను నిలిపివేసిన ట్విట్టర్ను బెదిరించాడు. అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను 'గట్టిగా నియంత్రిస్తానని' లేదా 'మూసివేస్తానని' హూంకరించాడు. తమ స్వేచ్ఛ గురించి మాట్లాడే ట్రంప్ అయినా, మోడీ అయినా... ఎదుటివారి స్వేచ్ఛపై ఆంక్షలు పెడతున్నారు. లేదంటే బెదిరింపులకు దిగుతున్నారు. సోషల్ మీడియాను కూడా తమ నియంత్రణలో, తమకు అనుకూలంగా ఉండాలంటున్నారు. అందుకోసం ఫాలోవర్స్ పేరుతో తమకు మద్దతు తెలిపే లక్షాలాది సైన్యాన్ని సృష్టించుకుంటున్నారు. మరోవైపు స్వేచ్ఛ పేరుతో నకిలీ వార్తలను, వ్యాపార ప్రకటనలను పుంఖానుపుంఖాలుగా ఉత్పత్తి చేస్తున్నారు. వ్యాపార ప్రయోజనాలు ఒకవైపు, నకిలీ వార్తలు మరోవైపు భావవ్యక్తీకరణను తుంచేస్తున్నాయి. 'పెట్టుబడికీ, కట్టుకథకు పుట్టిన విషపుత్రికలు.. ఈ పత్రికలు' అని శ్రీశ్రీ అన్నది ఇటువంటి పెట్టుబడిదారీ మాధ్యమాన్ని దృష్టిలో పెట్టుకునే.
సోషల్ మీడియాలో పేరుకే భావ ప్రకటనా స్వేచ్ఛ. అందులో కంటెంట్ మొదలుకొని ఆయా పోస్టింగ్లు ఎంతమందికి చేరాలనే విషయాన్ని నియంత్రించే శక్తి కూడా ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి కంపెనీలకే ఉంటుంది. దీంతో డబ్బు ఉన్నవారు తమ పోస్టింగ్స్ ఎంతో మందికి చేరేలా చేయగలుగుతున్నారు. తమ సొంత భావాలను, నకిలీ వార్తలను పెద్దఎత్తున వ్యాపారంగా మార్చుకొంటున్నారు. ఇక ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా సంస్థల బడ్జెట్లు భారీ స్థాయిలో ఉంటున్నాయి. కొన్ని దేశాల బడ్జెట్ల కన్నా ఈ సంస్థల బడ్జెట్లు అధికంగా ఉంటున్నాయి. ఆర్థికంగా బలోపేతమైన ఈ సంస్థలు ప్రభుత్వాల విధివిధానాలను కూడా ప్రభావితం చేసే స్థాయికి చేరుకున్నాయి. వీరు పెట్టే ఆంక్షలు ఎవరికి లాభం? వీరిచ్చే స్వేచ్ఛ ఎవరికి లాభం? అని ఆలోచించాల్సిన సమయం ఇది. యజమానుల ఆనందం కోసం తమలో తామే పోరాడి తమ ప్రాణాలను కోల్పోవడం కంటే, అటువంటి పోటీకి తమను ఉసిగొలిపిన యజమానిపై తిరగబడాలని గ్రహించాకనే బానిసలు తమ బానిసత్వం నుంచి విముక్తి పొందారు. అలాగే పోటీ ప్రపంచంలో తమలో తామే పోటీ పడటం కంటే... ఒక నూతన ప్రపంచాన్ని ఆవిష్కరించుకోవాలి. దోపిడీలేని ప్రత్యామ్నాయ వ్యవస్థను సష్టించుకోవాలి.