Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతిపక్షాలన్నీ తమ రాజకీయ విభేదాలనూ, ప్రయోజనాలనూ పక్కనబెట్టి ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటించిన వేళ... పాలక పార్టీ మాత్రం తన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ద్వంద వైఖరిని అవలంబించడం అక్షేపణీయమే. ఇప్పుడు ఆలోచించాల్సింది రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, దేశ ప్రయోజనాల కోసం.
గాల్వాన్ లోయలో ఏం జరుగుతోంది? భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల వెనుక పరిణామాలేమిటి? ఇవి ఇప్పుడు దేశమంతటినీ వేధిస్తున్న ప్రశ్నలు. చైనా సైనిక బలగాలు వాస్తవాధీనరేఖ (ఎల్ఏసీ)ను దాటి చొరబాటుకు ప్రయత్నించాయనీ, దీనిని తిప్పికొట్టే ప్రయత్నంలో భారత బలగాలు 30మందికి పైగా చైనా సైనికులను మట్టుపెట్టాయనీ, ఆ క్రమంలో 20మంది మన జవాన్లు వీరమరణం పొందారనీ భారతీయ మీడియా వెల్లడించిన కథనాల సారాంశం. ఆలస్యంగా స్పందించిన భారత రక్షణ, విదేశాంగ మంత్రుల ప్రకటనలు కూడా ఇదే అభిప్రాయాన్ని బలపరిచాయి. కానీ భారత బలగాలే తమ భూభాగంలో చొరబాటుకు పాల్పడి ఉద్రిక్తతలకు కారణమయ్యాయనీ, దానిని అడ్డుకునే ప్రయత్నంలోనే ఈ ఘటన జరిగిందనీ చైనా వాదన.
ప్రధాని మోడీ స్వయంగా నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో... చైనా సైన్యాలు అసలు మన భూభాగంలోకే రాలేదనీ, సరిహద్దుల్లోని ఏ ఒక్క సైనిక పోస్టూ ఆక్రమణకు గురికాలేదనీ స్పష్టంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సరిహద్దు సమస్యను, తాజా ఉద్రిక్తతలను శాంతియుతంగా సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలనీ, ఈ దిశగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సమర్థిస్తామనీ రాజకీయ పక్షాలన్నీ వెల్లడించడం ఓ హర్షించదగిన పరిణామం. కానీ ఈ ఘటనపై అనేక అంశాలతో పాటు ఘర్షణ జరిగిన ప్రదేశానికి సంబంధించి కూడా ప్రభుత్వం వద్ద కచ్ఛితమైన సమాధానమేమీ లేకపోవడమే ఆందోళన కలిగిస్తున్నది. అయితే ఉద్రిక్తతలు ఇరుదేశాలకూ ప్రయోజనకరం కాదు. ఉద్రిక్తతలకు కారణాలేమైనప్పటికీ ఉభయులూ చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలన్న అఖిలపక్షం అభిప్రాయం అభినందనీయం.
కవ్వింపు చర్యల ద్వారా గాకుండా దౌత్యపరమైన సంప్రదింపుల ద్వారానే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ప్రభుత్వమూ చెబుతుండటం ఓ ఊరట. ఉద్రిక్తతలను తగ్గించాలన్నా, తిరిగి ఇరుదేశాల మధ్య శాంతీ సామరస్యాలను నెలకొల్పాలన్నా ఇది అవశ్యం. ఎప్పుడైనా ఈ పరిణితో కూడిన సంయమనమే దేశాన్ని ముందుకు నడిపిస్తుంది. సుదీర్ఘమైన చరిత్ర, పురాతనమైన నాగరికతలకు నిలయాలైన ఈ రెండు దేశాల మైత్రి ఓ చారిత్రక వాస్తవం మాత్రమే కాదు, చారిత్రక అవసరం కూడా.
కానీ ఈ పరిణితి ఏ మాత్రమూలేని ఓ వర్గం, సంఫ్ుపరివార్ భావజాలాన్ని గుడ్డిగా అనుసరించే ఓ సెక్షన్ ఇరుదేశాల మధ్య శాంతిని పెంచడానికి బదులు విద్వేషాలను గుమ్మరించేందుకు పోటీపడుతుండటం విచారకరం. అఖిలపక్షంలో ప్రధాని ప్రకటన తర్వాత కూడా ఇది ఆగకపోవడం ఆందోళనకరం. చైనా ఉత్పత్తుల బహిష్కరణ పిలుపులూ, ఆ దేశ నేతల చిత్రపటాల దహనాలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ వీరు చైనా దిగుమతులపై నిషేధం పర్యవసానం తెలిసే ఇలా వ్యవహరిస్తున్నారా? సాధారణ సరుకుల కొరకు ఇతర దేశాల మీద ఆధారపడే పరిస్థితి పోవాలని కోరుకోవడంలో తప్పులేదు. దీనిని భారత స్వావలంబనను కోరుకునేవారంతా సమర్థించాల్సిందే. మన ప్రజలకు అవసరమైన సరుకులను మనమే ఉత్పత్తి చేసుకోగలిగితే దేశానికి అంతకంటే కావాల్సిందేముంటుంది. కానీ ఈ మాట చెప్పకుండా కేవలం చైనా సరుకులను మాత్రమే నిషేధించాలనే వారికి చైనా ఉత్పత్తులను నిషేదిస్తే నష్టపోయేది చైనా మాత్రమే కాదు భారత్ కూడా అనేది తెలుసా? ఈ ఘటనకు పూర్వమే గుజరాత్ చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి, ఆ తరువాత పంజాబ్, హర్యానా, ఢిల్లీ చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచీ ఇలాంటి ప్రతిపాదనలే వచ్చాయి. వీటి పర్యవసనాల్ని గమనించిన ఆర్థిక మంత్రి అప్పుడే చైనా ఉత్పత్తుల నిషేధం సాధ్యం కాదు అని స్పష్టంగా ప్రకటించారు. ఇప్పుడీ సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో తిరిగి ఈ వాదనలు వెలువడుతున్నాయి. కానీ ఒకసారి విదేశీ సరుకులను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించుకున్న తరువాత ఏ దేశం చౌకగా అందిస్తే ఆ దేశం నుంచి దిగుమతి చేసుకోవడమే మన దేశానికి లాభమవుతున్నదన్నది వీరుమరిచిపోతున్నారు. కేవలం చైనామీద ద్వేషంతో చౌకగా లభించే ఉత్పత్తులను కాదనుకుని అదే సరుకులను అత్యధిక చెల్లింపులతో అమెరికా నుంచో, మరో దేశంనుంచో దిగుమతి చేసుకోవడం దేశానికి నష్టమే తప్ప లాభమెలా అవుతుంది? భావోద్వేగాలతో, అవేశకావేశాలతో కాక పరిణితితో కూడిన సంయమనం, సదాలోచనతో ముందుకు సాగాల్సిన తరుణమిది. అలాంటి తరుణంలో భారత ప్రభుత్వం అనుసరిస్తున్నామని చెపుతున్న దౌత్య విధానానికీ, ప్రభుత్వానికి వెలుపల జరుగుతున్న ఈ విద్వేష ప్రహసనానికీ ఏ మాత్రం పొంతన లేకపోవడం ఓ వైచిత్రి!
సహజంగానే పాలకపార్టీలెప్పుడూ ఏ సమస్యనైనా తమ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం పరిపాటిగా మారిన కాలంలో.. బీజేపీ ఈ విషయంలో అందరికంటే రెండాకులు ఎక్కువే చదివిందని పై పరిణామాలు నిరూపిస్తున్నాయి. పనిలో పనిగా దీనికి జాతీయ వాదాన్ని కూడా జోడించి లబ్దిపొందాలని చూస్తున్నది. ప్రతిపక్షాలన్నీ తమ రాజకీయ విభేదాలనూ, ప్రయోజనాలనూ పక్కనబెట్టి ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటించిన వేళ... పాలక పార్టీ మాత్రం తన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ద్వంద వైఖరిని అవలంబించడం అక్షేపణీయమే. ఇప్పుడు ఆలోచించాల్సింది రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, దేశ ప్రయోజనాల కోసం.