Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రైతు సమన్వయ సమితులు అధికారపార్టీ నేతలకు పునరావాసంగా మారాయి. దీంతో అవి పేరుగొప్పగానే మిగిలిపోయాయి. రైతులకు సలహాలు, సూచనలు ఇస్తాయనీ సర్కారు చెబుతున్నా, రాష్ట్రంలో ఎక్కడా అలాంటి పరిస్థితి లేదు. ఇన్ని సమస్యల మధ్య రైతులు వానాకాలం కష్టాల సాగు చేస్తుండటం ఆందోళనకరం.
రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక తదితర సామెతలు పత్రికలు, మీడియాలో తరచూ వస్తుంటాయి. అందరి నోళ్లలోనూ నానుతుంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపై అంతులేని అభిమానాన్నీ, ప్రేమను కురిపిస్తుంటాయి. వారీ ప్రాథమిక అవసరాలను మాత్రం పటించుకోవు. ఇది వాటికి పరిపాటిగా మారింది. ఆరుగాలం కష్టపడి పంటలేసే రైతులకు ఎప్పుడూ కష్టాలూ కడగండ్లే. కనీస మద్దతు ధర, ఎరువులు, విత్తనాలు, రుణాలు ఎండమావే. వీటిని విరివిగా అందిస్తామంటూ ప్రతియేటా చెప్పే కాకమ్మ కబుర్లే ఈ వానాకాలం(ఖరీఫ్) సీజన్లోనూ ప్రభుత్వాలు వల్లెవేస్తున్నాయి. టీఆర్ఎస్ సర్కార్ ఒక అడుగు ముందుకేసి నియంత్రిత సాగు పేరిట అరచేతిలో స్వర్గాన్నీ చూపెడుతున్నది. సంప్రదాయ సాగు పద్ధతులకు స్వస్తి పలికి కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. కానీ ఆచరణ అంతంతే. మాటలు, చేతలకు పొంతనేలేదు. ఆర్భాటపు ప్రకటనలే తప్ప, వాస్తవ పరిస్థితులను విస్మరిస్తున్నది. ఆయా రాజకీయపక్షాలు, రైతు సంఘాలను విశ్వాసంలోకి తీసుకోవడం లేదు. మౌలిక వసతులు కల్పించకుండా నూతన విధానం అమలు సాధ్యంకాదనేది వ్యవసాయరంగ నిపుణుల అభిప్రాయం. రాష్ట్రంలో సాధారణంగా 1.25 కోట్ల ఎకరాల్లో పంటలు సాగుచేస్తారు. ప్రభుత్వం రైతులకు వాస్తవాలు చెప్పడం లేదనే విమర్శలూ లేకపోలేదు. అనేక సమస్యలు వ్యవసాయాన్నీ, రైతులను ఇప్పటికే వేధిస్తుండగా, సరైన మేర విత్తనాలు, ఎరువుల సబ్సిడీ, రుణాలు అందక పడే కష్టాలు వర్ణణాతీతం. నియంత్రిత సాగుపేర ఇవి మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. 41.76 లక్షల ఎకరాల్లో వరి, 12.31 లక్షల ఎకరాల్లో కందులు, 4.68 లక్షల ఎకరాల్లో సోయాబిన్, 60.16 లక్షల ఎకరాల్లో పత్తి, 1.53 లక్షల ఎకరాల్లో జొన్న, 1.88 లక్షల ఎకరాల్లో పెసర్లు సాగుచేయాలంటూ కారు సర్కార్ ఫత్వా జారీచేసింది. తాము చెప్పిన పంటలేస్తేనే రైతుబంధు వర్తిస్తుందంటూ మెలిక పెట్టింది. జూన్ ఒకటో తేదీన తొలకరి జల్లులు కురవడం సంతోషాన్ని కలిగించినా, ప్రభుత్వం మాత్రం వ్యవసాయ రుణ ప్రణాళికను ఇప్పటికీ ఆమోదించలేదు. రుణాలను సర్కారు రద్దు చేసినా, అది అమలుకాకపోగా, కొత్తగా రైతులకు బ్యాంకులు అప్పులివ్వడం లేదు. అలాగే ఫసల్ బీమా సైతం వారికి అందనేలేదు. రైతుబంధు పేరిట ఇచ్చే రూ.5 వేలను 59.30 లక్షల మంది పట్టా రైతులకుగాను 51 లక్షల మందికే రైతుబంధు చేరింది. రూ.7352 కోట్లు అవసరమైతే సర్కారిచ్చింది రూ.6800 కోట్లే. ఏయే పంటలను ఎన్ని ఎకరాల్లో సాగుచేయాలో ప్రణాళికేసిన వ్యవసాయశాఖ, విత్తనాల సరఫరాను మరిచింది. 4.68 లక్షల ఎకరాల్లో సోయాబీన్ సాగుకు 2.5 లక్షల క్వింటాళ్ల విత్తనాలు కావాలి. కానీ 1.5 లక్షల క్వింటాళ్లే ఉన్నాయి. ఈ కొరతను అవకాశంగా తీసుకుని, మాఫీయా ముఠాలు నాణ్యతలేనీ విత్తనాలను రైతులకు చేరవేశాయి. ప్రస్తుతం 600 కేసులు పెట్టినా, వారంతా బెయిల్పై బయటకు వచ్చి మళ్లీ అక్రమ వ్యాపారం యదేచ్ఛగా సాగిస్తూనే ఉన్నారు. ఈ మాఫియాను సర్కారు కట్టిడి చేయలేదా? రైతులు వేల కోట్ల పెట్టుబడులు నష్టపోతున్నారు. ఇదేనా నూతన నియంత్రిత వ్యవసాయ విధానం?
నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి 12జిల్లాల్లో ఈ పంటసాగవుతుంది. కాగా 40 నుంచి 50 వేల క్వింటాళ్ల విత్తనోత్పత్తికి వ్యూహరచన చేసినా, వాతావరణ పరిస్థితులు అనుకూలించక, అకాల వర్షాలతో రంగుమారడంతో 18వేల క్వింటాళ్లకే పరిమితమయ్యారు. చివరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి కొంతమేర తెప్పించుకుంటున్నా, అక్కడా కొరత రావడంతో స్థానిక అధికారుల నుంచి వ్యతిరేకత వచ్చింది. రాష్ట్ర అవసరాల్లో 50శాతమే దొరికాయి. కాగా నాసిరకం విత్తనాలతో రైతులు బెంబెలెత్తుతున్నారు. నల్లగొండ జిల్లా పరిణామాలే ఇందుకు సాక్ష్యం. తెలంగాణ సీడ్ కార్పొరేషన్, నేషనల్ సీడ్ కార్పొరేషన్, హాకా, ఆయిల్ఫెడ్ తదితర ఏజెన్సీలకు సోయాబీన్ సరఫరా బాధ్యతలు అప్పగించినా, సరిపడా అందించలేకపోయాయి. దీంతో ఈ విత్తనం సాధారణ ధర కిలోకు రూ.66.45 ఉండగా, మార్కెట్లో రూ. 90 నుంచి 100 పైనే. దీంతో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి 90వేల క్వింటాళ్లను తెప్పిస్తున్నామని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ప్రకటించింది. రాష్ట్రంలోని రైతులకు అన్ని పంటలకూ సంబంధించి 12లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం. ఇందులో దాదాపు ఏడు నుంచి ఎనిమిది లక్షల క్వింటాళ్ల వరకు కల్తీ విత్తనాలే కావడం గమనార్హం. ఈ అక్రమ వ్యాపారులపై పీడీ యాక్ట్ కేసులు పెడతామని ప్రభుత్వం గంభీరంగా చెబుతున్నా, ఆచరణలో అంతా తుస్సేనని తేలిపోయింది. ఏండ్లతరబడి ఈ తంతు సాగుతున్నా, ఆశించినస్థాయిలో పకడ్బందీ చర్యల్లేక వ్యవసాయం కుదేలవుతుండగా, రైతులు ఆర్థికంగా, శారీరకంగా నష్టపోయే దుస్థితి దాపురించింది. గతేడాది ఎస్ఎల్బీసీ రుణాలు రూ.49 వేల కోట్లు రావాల్సి ఉండగా, కేవలం రూ. 26 వేల కోట్లకే పరిమితమైయ్యాయి. రైతు సమన్వయ సమితులు అధికారపార్టీ నేతలకు పునరావాసంగా మారాయి. దీంతో అవి పేరుగొప్పగానే మిగిలిపోయాయి. రైతులకు సలహాలు, సూచనలు ఇస్తాయనీ సర్కారు చెబుతున్నా, రాష్ట్రంలో ఎక్కడా అలాంటి పరిస్థితి లేదు. ఇన్ని సమస్యల మధ్య రైతులు వానాకాలం కష్టాల సాగు చేస్తుండటం ఆందోళనకరం.