Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆధిపత్య దాహం అనంతమైనది. అది వ్యక్తిగతమైనదైతే ప్రమాదం. వర్గపరమైనదైతే మహా ప్రమాదం. నేటి కేంద్ర ప్రభుత్వానిది వర్గాధిపత్య కాంక్ష. సమస్తమూ తమ చేతుల్లో, కేవలం తమ చేతుల్లో మాత్రమే ఉండాలనే సంఫ్ుపరివార్ సిద్ధాంతం దానిది. అది తన పరిధిని లెక్క చేయదు. తన పరిమితులను పట్టించుకోదు. ప్రశ్నను సహించదు, సాగిల పడడాన్ని తప్ప. అంతా ఏకపక్షం. మూక వాదం. ఈ లక్షణాలు నియంతృత్వానికి సూచికలు. నియంతృత్వం దేశాన్ని ఆకలిలోకి, అజ్ఞానంలోకి, అశాంతిలోకి, అంధకారంలోకి నెట్టేస్తుంది. ఇప్పుడు మన దేశంలో అదే జరుగుతూ ఉంది. కేంద్రంలో కొలువు దీరిన కాషాయ ప్రభుత్వం దేశానికి గుండెకాయ లాంటి రాజ్యాంగం మీదికే గురిపెట్టింది. సమయం చిక్కినప్పుడల్లా రాజ్యాంగ విలువల వలువు వొలిచేస్తూ ఉంది. ఇందుకు తాజా నిదర్శనం వ్యవసాయ రంగానికి వెన్నెముక లాంటి సహకార బ్యాంకుల స్వయం ప్రతిపత్తికి పాతరేసి వాటి పాలనా వ్యవహారాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చేతిలో పెట్టడం. పార్లమెంటులో ఎలాంటి చర్చ లేకుండా ఇంతటి కీలక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా అమలులోకి తీసుకొస్తోంది.
దేశంలోని 1540 గ్రామీణ, పట్టణ సహకార బ్యాంకుల్లో 8.6కోట్ల మంది మదుపుదారులు ఉన్నారు. ఆ బ్యాంకుల్లో 4.84 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ఈ 4.84 లక్షల కోట్లు ప్రధానంగా చిన్నకారు, సన్నకారు రైతులు, చిల్లర వ్యాపారులూ దాచుకున్న వారి రెక్కల కష్టం. బ్యాంకుల నుంచి కాస్తోకూస్తో రుణంపొంది దాన్ని వ్యవసాయంలోనో, వ్యాపారంలోనో పెట్టుబడిగా పెట్టి కడుపుకట్టుకుని కుటుంబ అవసరాలకోసం దాచుకున్న సొమ్ము అది. ఇప్పుడు ఆ 4.84లక్షల కోట్ల రూపాయలపై కేంద్ర పాలకుల కన్నుపడింది. ఆ సొమ్ముపై ఆర్బీఐకి అధికారం అప్పగించడం ద్వారా పరోక్షంగా అధికారాన్ని తమ చేతుల్లోకి లాక్కొని ఆర్బీఐ రిజర్వ్ ఫండ్ను ఖాజేసినట్టు ఖాజేయాలన్న కుట్ర ఇందులో దాగి ఉంది. అంతమాత్రమే కాదు రాజ్యాంగ మౌలిక సూత్రమైన సమాఖ్య విధానాన్ని సమాధి చేయడం కూడా ఇందులో ఇమిడి ఉంది. అంతకన్నా ఘోరం, చిన్న సన్నకారు రైతులను వ్యసాయానికి, చిల్లర వ్యాపారులను వ్యాపారానికీ దూరం చేసి ఆ రంగాలను కార్పొరేట్లకు అప్పగించడం కూడా ఈ నిర్ణయంలో ఒక అంతర్భాగం.
సంఘీయులు ఏ నిర్ణయమూ ఆషామాషీగా తీసుకోరు. వారి ప్రతి నిర్ణయం వెనుకా ఒక పకడ్భందీ ప్రజా వ్యతిరేక ప్లానుంటుంది. తాము వైరివర్గంగా భావించే బడుగు బలహీన వర్గాలను దెబ్బతీసే వ్యూహం దాగుంటుంది. ఈ నిర్ణయంతో వారి దుర్భుద్ది పరాకాష్టకు చేరుకుంది. గ్రామాలు, చిన్న పట్టణాలలో పేద రైతులు, చిల్లర వ్యాపారులకు సహకార బ్యాంకులే దిక్కు. కొన్నిచోట్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి కేంద్ర బ్యాంకులు ఉన్నా అవి బడా బాబుల సేవలో తరిస్తాయే తప్ప పేదలను తమ గడప తొక్కనీయవు. సహకార బ్యాంకుల పాలక వర్గాలు స్థానికంగా ఉంటూ ప్రజలతో మమేకమై ఉంటాయి కాబట్టి, రాజకీయంగా కూడా వాటికి ప్రజలతో అవసరం ఉంటుంది కాబట్టి ప్రజల ఆర్థిక అవసరాలను పట్టించుకుంటాయి. ప్రజలకు అందుబాటులో ఉండి సరసమైన వడ్డీలకు అవసరమైనప్పుడు లోన్లు ఇచ్చి ఆదుకుంటాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతంలో ఉండే పేదలకు గొప్ప అవకాశం, అండ, వెసలుబాటు సహకార బ్యాంకులు. ఇదే మన కేంద్ర పాలకులకు నచ్చనిది. పేదలకు, అందునా అణగారిన కులాలు, అన్య మతస్తులకు ఇంతటి అవకాశం, అండ, వెసలుబాటు వారు ఇవ్వదల్చకోలేదు. కాబట్టే ఈ కర్కశమైన కరోనా కాలంలో ఒక్క కలం పోటుతో వారి కడుపులు కొట్టేశారు. పనిలో పనిగా రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో చివరిగా మిగిలిఉన్న 'బ్యాంకింగ్' అధికారాన్ని కూడా గుంజేసుకుని ఫెడరల్ స్ఫూర్తికి సమాధికట్టారు.
అసలే దేశంలో ఇప్పుడు వ్యవసాయ రంగం కుదేలైయింది. సాగు ఖర్చులకన్నా దిగుబడుల రాబడి తక్కువై పేద రైతులు మరింత అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే మరో దారిలేక జూదంలా తయారైన వ్యవసాయంతో జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. ఇలాంటి దుస్ధితిలో తక్కువ వడ్డీకి రుణాలు అందకుంటే వారికి దిక్కెవరు? జలగల్లా నెత్తురు జుర్రే వడ్డీ వ్యాపారులకు బలైపోరా ఈ బడుగు జనం? అలాగే, చిల్లర వ్యాపారులు.. సరసమైన వడ్డీకి సహకార బ్యాంకుల ద్వారా రుణాలు పొంది చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ కండుపునింపుకుంటున్న వీరిని ఇప్పటికే కార్పొరేటు కంపెనీలు కబళించేస్తూ ఉన్నాయి. చిన్న పట్టణాలు, కాస్త పెద్ద గ్రామాలలో సైతం తమ రిటైల్ షాపులను ఏర్పాటు చేసి చిల్లర వ్యాపారుల వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయి. ఈ స్థితిలో వారికి సహకార బ్యాంకుల సహకారం కూడా కరువైతే కడుపు నింపుకుని, ప్రాణాలు నిలుపుకోవడం సాధ్యమా?.. సాధ్యం కాకుంటే చావండి. బతికినోళ్ళనే పాలించుకుంటాం. వారి చెమటనే మరింతగా పిండుకుంటాం. నెత్తురునే ఇంకింతగా జర్రుకుంటాం. అంటున్నారు కమలనాధులు. ఇంకా సాగనిద్దామా వారి ఆటలు!