Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కొండపోచమ్మసాగర్ కాలువకు గండ్లు పడటం సర్వసాధారణమేనని చెప్పడం ప్రభుత్వ, అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ఇది సర్కారుకు ఆదిలోనే హంసపాదులా తయారైంది. ఇష్టానుసారం మాట్లాడటం, హితవు పలకడం ఇటీవల పరిపాటైంది గులాబీ సర్కారు పెద్దలు, ఉన్నతాధికారులకూ. ఎటొచ్చి సామాన్య ప్రజలే బలిపశువులయ్యేలా వారితీరు ఉండటం ఆందోళనకరం. ఆవేదనాభరితం. 18.25 లక్షల ఎకరాలకు నిరందించే ఉద్దేశంతో కేసీఆర్ సర్కారు ఆ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. రాజకీయపక్షాలు, ప్రజాసంఘాలు అభ్యంతరాలు చెబుతున్నా, ఇంతకుముందున్న ప్రాణహిత-చేవెళ్లను కాళేశ్వరం ప్రాజెక్టుగా రీడిజైన్ చేశారు. 2016, మే రెండో తేదీన కాళేశ్వరానికి హడావుడిగా శంకుస్థాపన చేశారు. 225 టీఎంసీల లక్ష్యంతో పనులు చేపట్టారు. కాలక్రమేణా అంచనాలు రెట్టింపయ్యాయి. ఇప్పటికే రూ. 60 వేల కోట్లు ఖర్చయ్యాయి. ఇంకా రూ. 40 వేల కోట్లు వ్యయం చేస్తేగానీ పూర్తయ్యే అవకాశం లేదు. వేగంగా పూర్తిచేయాలనే ఆతృతతో ప్రాజెక్టు కనీస నిర్మాణ ప్రమాణాలను పట్టించుకోలేదు. ఇంజినీరింగ్ ప్రణాళికలను బుట్టదాఖలుచేశారు. అందులో భాగంగానే మిడ్మానేరు నుంచి మల్లన్నసాగర్ ద్వారా కొండపోచమ్మ సాగర్కు నీళ్లు రావాలి. కానీ, మల్లన్నసాగర్ నిర్మాణం జాప్యం కావడంతో కొండపోచమ్మకు నీళ్లు తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో మిడ్మానేరు నుంచి రంగనాయకసాగర్, అక్కడ నుంచి మర్కుక్ పంపింగ్ కేంద్రానికి నీటిని చేరవేసి ఆ తర్వాత కొండపోచమ్మకు నీళ్లిచ్చారు. దాని కింద 3.2 లక్షల ఆయకట్టుకు 2020 ఖరీఫ్లోనే నీళ్లు ఇస్తామని ఆనాడు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ మేరకు నీటివిడుదలకు వీలుగా కాల్వలను వేగంగా నిర్మించారు. ఆ నేపథ్యంలోనే ట్రయల్రన్ వేశారు. మూడు టీఎంసీలు రంగనాయక్సాగర్ నిల్వ లక్ష్యమైతే, కొండపోచమ్మసాగర్ 15టీఎంసీలు కావడం గమనార్హం. పనులను వేగంగా పూర్తిచేయాలన్న ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని అవకాశంగా తీసుకున్న కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలను గాలికొదిలేశారు. ఇష్టారాజ్యంగా కాల్వకట్టలను నిర్మించారు. నిర్ణీత క్యూసెక్కుల కన్నా తక్కువ నీటిని విడుదల చేసినా, రెండు చోట్ల గండ్లుపడ్డాయి. ఇందుకు విచారించాల్సిన ఇంజినీరింగ్ అధికారులు 10 చోట్లా గండ్లు పడతాయని భావించామనీ, కానీ రెండు చోట్ల మాత్రమే పడ్డాయని చెప్పడం ఆశ్చర్యం, ఆందోళనా కలిగించేదే. ఉన్నతాధికారులు తమ ఇంజినీర్ల తప్పులను సమర్థించడం ఆమోదయోగ్యం కాదు. మొదటివిడతలోనే రెండు గండ్లు పడ్డ దరిమిలా, పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేస్తే ఇంకెంత నష్టం జరిగేదో ఊహించలేం. అయినా ఆత్మస్థైయిర్యం దెబ్బతింటుందనీ, ఇలాంటి విషయాలు ప్రచారం చేయరాదంటూ మన పాలకులు, ఇంజినీరింగ్ అధికారుల వైఫల్యాలను వెనకేసురావడం సరికాదు. పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వకుండా, విలువైన ప్రజాధనాన్ని కాంట్రాక్టర్ల పాల్జేయడం క్షమించరాని నేరం. కాగా కొత్త నిర్మాణాలు అలాగే జరుగుతాయని చెప్పడం సహించరానిది. కట్టలతోపాటు కాలువ లైనింగూ కొట్టుకుపోవడం దారుణం. గతం నుంచి నేటి వరకు జరుగుతున్న ప్రాజెక్టు పనుల్లో నాణ్యతా లోపాలతో చేపడుతున్న నిర్మాణాలు కాంట్రాక్టర్లు, పాలకులకు కామధేనువుగా మారాయనేది నిర్వివాదాంశం. కాళేశ్వరం 18.25 లక్షల ఎకరాలతోపాటు శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టు ఆయకట్టు స్థిరీకరణతో మరో 18.85 లక్షల ఎకరాలతో కలిపి మొత్తం 37 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే భారీ ప్రాజెక్టు నిర్మాణం ఇంత లోపభూయిష్టంగా , బలహీనంగా ఉంటుందా ? అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రాజెక్టు పనుల నిర్మాణాన్ని పరిశీలించడానికి నిపుణుల కమిటీ వేయడం శ్రేయస్కరం. ఎక్కడైనా లోపాలుంటే సవరించుకోవడం, అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవడం, కాంట్రాక్టర్లను బ్లాక్లిస్ట్లో పెట్టడం చేయాలి. లేదంటే ప్రాజెక్టుల ఫలాలు ప్రజలకు దక్కవు. కొండపోచమ్మకు గండ్లు పడ్డ సందర్భంగా ఇండ్లు మునిగిపోవడం, పంటలు దెబ్బతినడం జనానికి నష్టం చేసేవే. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన గురుతర బాధ్యత సర్కారుదే. కాగా కాళేశ్వరం తొలి అంచనాలు రూ. 40 వేల కోట్లే. అవి ఆ తర్వాతా పెరిగి ఇప్పటికి రూ.1.10 లక్షల కోట్లకు చేరాయి. భవిష్యత్లో ఇంకా అధికమయ్యే అవకాశం లేకపోలేదు. అప్పులు తెచ్చి చేస్తున్నా పనులు మాత్రం నాసిరకంగా ఉండటం దుర్మార్గం. అసలు ప్రజలకు కదా ఆత్మస్థైయిర్యాన్ని కల్పించాల్సింది. నిజంగా ప్రభుత్వానికి ప్రజల పట్ల, ప్రజాధనం పట్ల బాధ్యత, చిత్తశుద్ధి ఉంటే, అక్రమార్కులపై కఠినంగా వ్యవహరించాలి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు అని చెప్పుకుంటూ భుజకీర్తులు తగిలించుకున్న ప్రభుత్వానికి ఈ ఘటన మింగుడు పడుతుందో, లేదో తెలియదుకానీ లక్ష కోట్లు కాళేశ్వరంలో కలిసిపోకుండా చూడాల్సిన నైతిక బాధ్యత మాత్రం సర్కారుదే. రీడిజైన్ పేరుతో ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్నగర్, హైదరాబాద్ జిల్లాను పక్కనపెట్టేశారు. తాము ఏంచేసినా చెల్లుబాటవుతుందనే ధోరణి నుంచి బయటపడకపోతే ప్రజల ఆగ్రహం చవిచూడక తప్పదు.