Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వావలంబన గురించి గొంతు చించుకునే దేశాధినేత ఆ దిశగా ఒక్క అడుగు ముందుకు వేయలేని ఆత్మ నిర్భరత్వం తేటతెల్లమైన విదూషకత్వం. ఈ నేపథ్యంలో పెరుగుతున్న వినియోగదారుల చైతన్యం, కార్పోరేట్ల ఆగడాల ముగింపునకు దారితీసే క్రియాశీలతని సంతరించుకోవాలి.
కరోనా కల్లోలం సమస్త రంగాల్ని పెను మార్పులకు లోను చేసింది. మన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వ్యవస్థల్లోనూ ఈ మార్పుల ప్రభావాన్ని చూస్తున్నాం. కరోనా తాకిడికి ముందు మనకు ఏం కావాలో మార్కెట్శక్తులు నిర్దేశించేవి. ఇవాళ మనకు ఏం కావాలో మనమే తేల్చుకోవాలని వినియోగదారులు భావిస్తున్నారు. ఈ చైతన్యం తాత్కాలికం కాదు, మున్ముందు కొనసాగనున్నవిధానం. అవసరాలు కాని వాటిని సైతం అవసరాలుగా భ్రమింపజేసే మార్కెట్ ఎకానమీ కుటిల నాటకాలకి కోవిడ్-19 విజృంభణ తో తెర పడింది. కరోనా భయం ఏడాదికో, రెండేళ్ళకో మాసిపో వచ్చు, లేదా ఈ లోపు వాక్సిన్ రావచ్చు. అంతమాత్రాన బతుకు మునుపటిలా ఉండదు. వినియోగదారీ తత్వం పెట్రేగిపోయే అవకాశం లేనే లేదు.
అవసరాలు, సౌకర్యాలు, విలాసాలు అనే వర్గీకరణకు ప్రాధాన్యం హెచ్చిన కాలమిది. పైసాపైసాకి లెక్కించుకోవలసిన పరిస్థితుల్లోకి జనం నెట్టబడిన సన్నివేశమిది. దేశదేశాలన్నిటా కనిపించేది ఇదే దృశ్యం. మరీ ముఖ్యంగా మన దగ్గర ఇది తప్పనిసరయిన పరిస్థితి. కొత్త ఉద్యోగాలు లేవు. ఉన్న ఉద్యోగాలకు భద్రత లేదు. వేతనాల కోత సర్వసాధారణం. కొన్నిరంగాలు పూర్తిగా కుదేలయి, కోలుకోడానికి వీల్లేనంతగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా హౌటల్ ఇండిస్టీ, కేటరింగ్, పర్యాటకం, రియల్ ఎస్టేట్ తదితర రంగాలు దెబ్బతినడంతో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ పరిస్థితులలో సాధారణంగానే జనం ప్రాధాన్యాలు మారిపోతాయి.
అవసరమైతేనే ఖర్చుచేయాలనే పద్ధతి మొదలయింది. ఆహార పదార్థాల ఎంపికలోనూ అవసరాలది, ఆరోగ్యానిది ప్రధాన పాత్ర. కూల్డ్రింక్స్, చాక్లెట్లు, ఐస్క్రీములు, ఇంకా ప్యాక్డ్ ఫుడ్కు స్వస్తి చెప్పడం గమనించదగ్గ పరిణామం. ఇంట్లో వండుకొని తినడానికి అవసరమైన వస్తువులు మాత్రమే కొనాలన్న స్పృహ ఇనుమడించింది. బయటి ఫుడ్కు స్వస్తి చెప్పారు. బేకరీలు, టేక్అవే హౌటళ్ళు నడుస్తున్నప్పటికీ బయటి ఆహారం వద్దేవద్దు అనే పద్ధతికి బలం చేకూరింది. ఇక పుట్టినరోజు పండగలకీ, విందు వినోదాల సంస్కృతికీ చోటు లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈటింగ్ ఔట్ కల్చర్ మటుమాయమైంది. నిజఅవసరాలదే కుటుంబ బడ్జెట్లో ప్రధాన ఎజెండా. ఇక బట్టలు, నగలు, ఫ్రిజ్లు, ఏసిలు కొనాలన్న ఆలోచనలకు ఇపుడు అంతగా తావు లేదు. మాల్స్లో షాపింగ్, మల్టీప్లెక్స్లో సినిమాలు, బ్యూటీపార్లర్స్లో సింగారించుకోడమనే కలలు మాసిపోయాయి.
వినియోగదారుల్లో పెరుగుతున్న చైతన్యానికి ఈ పరిణామాలే సాక్షి. దీనికి తగ్గట్టుగా అభివృద్ధి నమూనాలు మారాలి. ఆర్థిక విధానాల్లో మార్పులు నెలకొనాలి. కానీ మార్కెట్శక్తులు ఈ వాస్తవాల్ని అంగీకరించే స్థితిలో లేవు. వ్యాక్సిన్ రాకతో అంతా మామూలవుతుందన్న పేరాశలో ఉన్నారు. జీవితం మునుపటిలా ఉండదనే నిజం ఒప్పుకోడానికి స్వేచ్ఛా వాణిజ్య ప్రవక్తలు సిద్ధంగా లేరు. అయినప్పటికీ మనుషుల్ని కేవలం వినియోగదారుల స్థాయికి దిగజార్చిన మార్కెట్శక్తుల దాష్టీకం అంతరించనుంది. మనం ఏం తినాలో, ఏ బట్టలు కట్టుకోవాలో, ఎలా ఉండాలో నిర్దేశించే వాణిజ్య కౌటిల్యం ఇక చెల్లదుగాక చెల్లదు. ప్రజల్లో ఆరోగ్య చైతన్యం ఇనుమడించిన కొద్దీ అనవసర వ్యయాలు, డాబుసరి ఖర్చులు తగ్గిపోతాయి. శుభ్రమైన ఆహారం, పరిసరాలు, చక్కటి ఆరోగ్యం కావాలని అందరూ కోరుకుంటున్నారు. కనుక తమ ఆరోగ్యానికి చేటు తెచ్చే విష రసాయనాల పానీయాల జోలికి వెళ్ళడం లేదు. కాలం కాని కాలంలో చలిలో వణుకుతూ ఐస్క్రీములు తినాలన్న యావ ఇపుడు లేదు. ఐస్క్రీమ్ తింటే జలుబు చేస్తుందన్న ఒకే ఒక్క కారణంతో వాటి జోలికి వెళ్ళనివారు అనేకులు.
కరోనా భయం ఒకవైపున వినియోగదారుల జీవనశైలిని విపరీతమైన మార్పులకు లోను చేసింది. మరోవైపున సర్వీస్ సెక్టార్ తీవ్ర ప్రకంపనలకు లోనయింది. దెబ్బతిన్న రంగాలలో ఉపాధి పొందేవారు లక్షలు, కోట్లలో ఉన్నారు. వారికి ప్రత్యామ్నాయం చూపే రీతిన మన అభివృద్ధి నమూనాల్ని కొత్తగా రూపొందించుకోవాలి. అధికారంలో ఉన్నవారు ఈ దిశగా యోచిస్తున్న ఆనవాళ్ళు లేవు. ఆరోగ్యరంగంలో ప్రయివేటుశక్తులకు కళ్ళెం వేస్తే కొత్త ఉపాధి అవకాశాలు నెలకొంటాయి. సరయిన ఆహారం జనాలకు అందించాలనే కోణంలో ప్రణాళికలు రూపొందిస్తే కొత్తద్వారాలు ఎన్నో తెరుచుకుంటాయి. మన నిజ అవసరాలు, ప్రాధాన్యాలు మాత్రమే అభివృద్ధికీ, ఆర్థికవ్యవస్థ గమనానికీ కీలకం కావాలన్న ఎరుక తప్పనిసరి. లాభాపేక్షతో అనేక దుర్మార్గాలకు పాల్పడిన మార్కెట్శక్తులకు కళ్ళెం వేసే నిర్ణయాత్మక విధానం అనుసరించాలి. కానీ కరోనా కాలంలోనే వ్యవసాయ, విద్యుత్ రంగాలలో కార్పోరేట్శక్తుల ప్రవేశానికి సంస్కరణల నాటకాన్ని ముందుకు తెచ్చింది కాషాయ ప్రభుత్వం. వివేచనతో, విజ్ఞతతో వ్యవహరించాల్సిన సందర్భంలోనూ కార్పోరేట్ల, బహుళజాతి కంపెనీల ప్రయోజనాలకే పట్టం కట్టడం దారుణం. ఇది పెరుగుతున్న వినియోగదారుల చైతన్యానికి ఆశనిపాతం. మార్కెట్ల కట్టడికి వచ్చిన అవకాశాన్ని కాలదన్నడం ప్రశ్నార్థకం. ఆహారం, విద్య, వైద్యానికి సంబంధించిన రంగాలలో జనం శ్రేయస్సును కోరే విధానాలు అవలంబించాలి.
కరోనా భయోత్పాతంలో జనం తల్లడిల్లుతున్నా కార్పోరేట్శక్తులు లాభాలవేటని ఆపలేదు. వాక్సిన్ కనుగొనే విషయంలోనూ, కరోనా నుంచి ఉపశమనం పొందే మందుల అమ్మకాల్లోనూ లాభమే పరమార్థమన్న కార్పోరేట్ల ధోరణి అమానుషం. వాటి విశృంఖలత్వాన్ని నిలువరించలేని పాలకుల అసమర్థత క్షమించరాని నేరం. స్వావలంబన గురించి గొంతు చించుకునే దేశాధినేత ఆ దిశగా ఒక్క అడుగు ముందుకు వేయలేని ఆత్మ నిర్భరత్వం తేటతెల్లమైన విదూషకత్వం. ఈ నేపథ్యంలో పెరుగుతున్న వినియోగదారుల చైతన్యం, కార్పోరేట్ల ఆగడాల ముగింపునకు దారితీసే క్రియాశీలతని సంతరించుకోవాలి. ఇందుకు అనువైన వేదికల్ని రూపొందించడమే ఇపుడు ప్రజానుకూలశక్తుల కర్తవ్యం.