Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పరిశోధనా ప్రక్రియలో అనేక ప్రయోగ దశలూ, వైద్య పరమైన నిబంధనలూ, ఆరోగ్య భద్రతా నియమాలూ, అవసరమైన సమయమూ ఉంటాయి. అవే వాక్సిన్ యొక్క శాస్త్రీయతను నిర్ధారిస్తాయి. వీటన్నిటినీ విస్మరించి వాక్సిన్ తయారికి గడువు విధించడమంటే ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడటమే. భారత ప్రభుత్వమూ, పాలకులూ తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ప్రాథమిక సూత్రాన్ని విస్మరించడం ప్రమాదకరం...
సంక్షోభాన్ని పరిష్కరించాలన్న దృష్టికన్నా, దాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలన్న దుగ్దే కేంద్ర ప్రభుత్వంలో అడుగడుగునా పొడచూపుతుండటం విచారకరం. దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో ఆగస్టు 15 కల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావాలన్న ఐసీఎంఆర్ (భారత వైద్య పరిశోధన మండలి) తాజా ఆదేశాల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ సంస్థ తాను క్లినికల్ టెస్టులకు ఎంపిక చేసిన సంస్థలకు ఆగస్టు 15లోపు పని పూర్తిచేయాలని గడువు విధించడం, లేనిపక్షంలో కఠిన చర్యలుంటాయని హెచ్చరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కరోనా మహమ్మారి ప్రాణాంతకంగా మారి భయోత్పాతం సృష్టిస్తున్న వేళ... వాక్సిన్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రావాలని ప్రజలు కోరుకోవడం సహజం. తదనుగుణంగా ప్రభుత్వాలు వేగంగా స్పందించడంలోనూ తప్పులేదు. కానీ ఈ ప్రక్రియలో పలు ఆచరణాత్మక అంశాలను, వైద్యపరమైన నిబంధనలను తుంగలోతొక్కి తాము విధించిన గడువులోపల వాక్సిన్ తేవాలని ఆజ్ఞాపించడం, లేదంటే కఠిన చర్యలుంటాయని హెచ్చరించడం ఐసీఎంఆర్ వంటి అత్యున్నత పరిశోధనా సంస్థకు తగునా? దీని వెనుక స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎర్రకోటపైనుంచి ప్రధాని ఈ వాక్సిన్ను ప్రకటించి ప్రపంచ వ్యాపిత ప్రచారం పొందాలన్న ఆలోచన తప్ప, ఇందులో శాస్త్రీయతకు, చిత్తశుద్ధికి ఏమాత్రమైనా ఆస్కారముందా? ఇప్పుడు కావాల్సింది ప్రజారోగ్యమా? రాజకీయమా? విజ్ఞాన పరిశోధనలూ, వాటి ఫలితాలూ శాస్త్రీయమైన నిర్ధారణల ఆధారంగా ఆవిష్కృతమవ్వాలి తప్ప, ఎలినవారి రాజకీయ అవసరాలను బట్టి కాదు కదా..!?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా మొదటి నుంచీ రాజకీయ ప్రయోజనాలే తప్ప ప్రజా ప్రయోజనాలు పట్టని ప్రభుత్వ చర్యల వల్ల నేడు దేశం అతలాకుతలమవుతోంది. ఒకప్పుడు కరోనా ప్రభావిత దేశాల జాబితాలో మొదటి 20లో కూడా లేని దేశం నేడు మూడవ స్థానానికి చేరిందంటే కారణమేమిటి? ఇప్పుడు దేశంలో కేసులు ఏడులక్షలు, మరణాలు ఇరవైవేలు దాటిపోయాయి. ప్రపంచలో అమెరికా, బ్రెజిల్ తరువాత అత్యధిక కేసులున్న దేశం భారతదేశమే. రోజుకు సగటున 20వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొత్త కేసుల నమోదులో కూడా దేశం 3వ స్థానంలో ఉంది. దేశంలో లాక్డౌన్ విధించడానికి ముందున్న కేసులు నాలుగువందలలోపే. కానీ సుదీర్ఘమైన లాక్డౌన్ అనంతరం కేసుల సంఖ్య లక్షలు దాటింది. మన ఏలినవారి 'లాక్డౌన్' ఎంత అశాస్త్రీయమైనదో, ఎంత ప్రణాళికారహితమైనదో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి? సుమారు 14కోట్ల మంది వలస కార్మికులు రహదారులపై రక్తంతో తమ ఉనికిని లిఖించాకగానీ వారు ప్రభుత్వానికి గుర్తుకురాలేదంటే ఈ ప్రభుత్వం ఎంత అనాలోచితంగా వ్యవహరించినట్టు? కేసులు వందల్లో ఉన్నప్పుడు ప్రతిరోజూ ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చిన కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పుడు ఎందుకు ఆపేసినట్టు? పదే పదే ప్రజలకు ఆరోగ్య సూత్రాలు, తమ ప్రభుత్వ చర్యలను వల్లించిన ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులు ఇప్పుడు ఎందుకు మొహం చాటేస్తున్నట్టు? ''మహమ్మారులు విజృంభించే సమయంలో సమాచార గోప్యత ఉండకూడదు'' అన్నది వైద్య చరిత్రకారులు చెపుతున్నమాట. ఎందుకంటే ప్రజలకు స్పష్టమైన సరైన సమాచారం ఇవ్వకపోతే అది మరింత ప్రమాదకరంగా దాపురిస్తుంది. మరి ఈ అవసరమైన సమయంలో మొహం చాటేస్తున్న మన ప్రభుత్వాధినేతలూ, అధికారుల వైఖరీ దేనికి సూచిక..!!
ప్రభుత్వ లెక్కల మాటెలా ఉన్నా ఇప్పటికి దేశంలో దాదాపు మూడుకోట్ల మందికి వైరస్ సోకి ఉండవచ్చుననేది నిపుణుల అంచనా. అమెరికాలోని ''సెంటర్ ఫర్ డీసీజ్ డైనమిక్స్'' డైరెక్టర్, ప్రపంచ ప్రఖ్యాత అంటువ్యాధి శాస్త్ర నిపుణులు రమానంద్ లక్ష్మీనారాయణ్ సెప్టెంబర్ నాటికి ఈ సంఖ్య 20కోట్లకు చేరవచ్చునని అంచనా వేస్తున్నారు. ఇందులో కనీసం మూడుశాతం మందికి హాస్పిటలైజేషన్ అవసరమనుకున్నా కూడా 60లక్షల మందిదాకా ఉంటారు. అందుకు మన ప్రజారోగ్య వ్యవస్థ సిద్ధంగా ఉందా? సమస్య ఇంత తీవ్రంగా ఉన్నా అసలు దేశంలో కరోనాయే లేదన్నట్టుగా ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తుండటం వైచిత్రి! సమస్యనే గుర్తించనివారు సమస్యను ఎలా పరిష్కరిస్తారు? ఇలాంటివారు ఆగస్టు 15కల్లా వాక్సిన్ తెస్తామనడంలో రాజకీయ అవసరాలను తప్ప నిజాయితీ, చిత్తశుద్ధిలను ఊహించగలమా?
నిజానికి ఇప్పుడు వాక్సిన్ అత్యవసరం అనడంలో సందేహం లేదు. అందుకే భారత్తో సహా ప్రపంచవ్యాపితంగా వందలాది పరిశోధనా సంస్థలు ఈ పనిలో కఠోరంగా శ్రమిస్తున్నాయి. ఇందులో ఐసీఎంఆర్ ఆదేశిత ''భారత్ బయోటెక్'' కృషిని కూడా తక్కువ చేయలేం. ఆ మాటకొస్తే ఏ భారతీయ సంస్థనూ తక్కువ చేయలేం. ఎందుకంటే ప్రపంచ ఔషదరంగంలో వాటి పాత్ర గణనీయమైనదే కాదు, ఎంతో ప్రామాణికమైనది కూడా. అయితే ఈ పరిశోధనా ప్రక్రియలో అనేక ప్రయోగ దశలూ, వైద్య పరమైన నిబంధనలూ, ఆరోగ్య భద్రతా నియమాలూ, అవసరమైన సమయమూ ఉంటాయి. అవే వాక్సిన్ యొక్క శాస్త్రీయతను నిర్ధారిస్తాయి. వీటన్నిటినీ విస్మరించి వాక్సిన్ తయారికి గడువు విధించడమంటే ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడటమే. భారత ప్రభుత్వమూ, పాలకులూ తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ప్రాథమిక సూత్రాన్ని విస్మరించడం ప్రమాదకరం...