Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేరాలను అదుపు చేయాల్సిన పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. నిందితుడు నేరస్తుడు అవునో కాదో తేల్చాల్సింది న్యాయస్థానమే! భారత రాజ్యాంగం శాసన, న్యాయ, పరిపాలనా వ్యవస్థలు మూడింటి మధ్య స్పష్టమైన విభజన ఉంది. ఆ లక్ష్మణ రేఖను ఎవరు దాటినా అది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది.
ఉత్తరప్రదేశ్ గ్యాంగ్స్టర్ వికాస్ దుబే ఉదంతం నేరమయ రాజకీయాల క్రూరత్వానికి అద్దం పడుతోంది. తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసుల్లో 8మందిని తన నివాసం సమీపంలో చంపించిన నేరస్తుడు దుబే. తన అరెస్టు గురించిన సమాచారం పోలీసుల నుండే ఎప్పటికప్పుడు సంపాదిస్తున్నానని ఆయనే చెప్పాడు. అంతేకాక ఉత్తరప్రదేశ్ నుంచి తప్పించుకొని, మధ్యప్రదేశ్కు వెళ్లి అక్కడ విఐపి పాస్లతోనే దైవ దర్శనాలు గావించాడంటే రాజకీయ నేతల మద్దతు ఎంతగా వుందో విదితమే. అటు యూపీ ఇటు ఎంపీ రెండూ బీజేపీ పాలిత రాష్ట్రాలేనన్నది గమనార్హం.
మధ్యప్రదేశ్లో ఉజ్జయిని మహంకాళి మందిరంలో అరెస్టు కావడం.. ఆ మరుసటి రోజే కాన్పూరు సమీపంలో యూపీ పోలీసుల చేతిలో హతమవ్వడం.. చకచకా జరిగిన ఈ నాటకీయ పరిణామాలు సమాధానం లేని అనేక ప్రశ్నలకు ఆస్కారమిచ్చాయి. 2017 నుంచి వికాస్ బీజేపీ వారితోనే సన్నిహితంగా ఉంటున్నా.. జాతీయ స్థాయి నేత ఒకరు అడ్డుపడుతుండటంతో ఇటీవల బిఎస్పీ వైపు చూస్తున్నాడట. అందుకనే యోగి సర్కార్కు అతను టార్గెట్ అయ్యాడనే వాదన వినిపిస్తోంది. 1990లో యుక్త వయసులోనే ఒక కేసులో అరెస్టు అయిన వికాస్ స్థానిక నేతల అండతో ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాకుండానే బయటపడ్డాడు. అప్పటి నుంచి రాజకీయ నేతల మద్దతుతో అంతకంతకూ ఎదుగుతూ వచ్చాడు. సమాజ్వాదీ పార్టీలో కొన్నాళ్లూ, బిఎస్పీల్లో కొన్నాళ్లూ పనిచేస్తూ వచ్చాడు. ప్రభావిత వ్యక్తిగా ఎదిగిన వికాస్ దుబే ఇప్పుడు బీజేపీ నుంచి బిఎస్పీ వైపు మళ్లుతుండటంతోనే యోగి సర్కార్కు కంటగింపుగా మారాడని అక్కడి రాజకీయ విశ్లేషకుల మాట. శుక్రవారం నాటి ఎన్కౌంటర్ వెనుక లోగుట్టు ఇదేనని వారి వాదన. పోలీసులు చెబుతున్నవన్నీ సూత్రధారుల విరచిత కట్టుకథలేనని, రాజకీయ నేతల బండారం బయటపడకుండా చూసేందుకే వికాస్ను అంతమొందించారనే ఆరోపణలకు సినీ ఫక్కీలో క్షేత్రస్థాయిలో జరిగిన పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి.
గూండాలు, రౌడీలు, ఆర్థిక మోసగాళ్లతో పాలకపక్ష రాజకీయ నేతలకు సంబంధాలుండటం బహిరంగ రహస్యం. నేరమయ రాజకీయాలకు ఉత్తరప్రదేశ్ అడ్డాగా మారింది. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి యూపీ రాజకీయాల్లో ఈ నేర ప్రవత్తి మరీ హద్దు మీరింది. మాలెగావ్ ఉగ్రవాద దాడుల్లో ప్రధాన పాత్ర పోషించిన సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ వంటి వారిని సైతం చట్ట సభలకు పంపగలిగిందంటే నేరస్తులకు బీజేపీ ఇస్తున్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాన్ని కానీ, అధికార పక్షాన్ని కానీ విమర్శించేవాళ్లను ఏరిపారేయడమే లక్ష్యంగా అక్కడి పాలక పక్షాలు నేరగాళ్లను పెంచి పోషించాయనేది నిష్టుర సత్యం. ఈ విష సంస్కతిలో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ రెండాకులు ఎక్కువే చదివింది. తనకు అడ్డొచ్చే నేరగాళ్లతో పాటు ప్రభుత్వ విమర్శకులను, సామాజిక కార్యకర్తలను అధికార యంత్రాంగంతోనే మట్టుబెట్టేందుకు అది వెనుకాడడం లేదు. నేర నియంత్రణ పేరుతో ఎన్కౌంటర్ రాజ్గా యూపీ సర్కార్ మారిందన్నది జనవాక్యం.
నేరం జరిగితే శిక్ష పడాలి. ఆ శిక్ష మనిషి ప్రవర్తనను మార్చేలా ఉండాలన్నది భారతీయ శిక్షాస్మతి మౌలిక సారం. ఎంతటి తీవ్రమైన నేరాలు చేసినా నిందితులను ప్రాణాలతో న్యాయస్థానం ముందుంచడం పోలీసుల బాధ్యత. ఇటీవల కాలంలో పాలకుల్లోనూ, అధికార యంత్రాంగంలోనూ ఈ స్పహే కొరవడింది. తెలంగాణలో దిశ కేసులో నిందితులను కాల్చిపారేయడాన్ని ఒక ఉత్సవంగా మార్చిన వైనం చూశాం. ఇలా కాల్చుకుంటూ పోతూ అదే న్యాయం అని చెబితే.. నేరస్తులెవరో, అమాయకులెవరో.. తుపాకీ తూటాలకు ఏం తెలుస్తుంది? ధర్మ విచారణ, న్యాయ విచక్షణ విస్మరించి ప్రజల్లో ప్రతీకార ధోరణిని పెంపొందిస్తే ప్రజాస్వామ్యం మనుగడ సాగించగలదా?
వికాస్ దుబే ఎన్కౌంటర్తో ఇప్పుడు జరిగిన న్యాయమేంటి? అతడితో సంబంధమున్న రాజకీయ నేరగాళ్ల రహస్యాలు సమాధయ్యాయి. రాజ్యాంగ విలువలకు, న్యాయ ప్రక్రియకు తిలోదకాలిచ్చి ఇలా పోలీసు బలగాలతోనే పాలన సాగిద్దామనుకుంటే అది ప్రజాస్వామ్యం అవుతుందా? నేరాలను అదుపు చేయాల్సిన పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. నిందితుడు నేరస్తుడు అవునో కాదో తేల్చాల్సింది న్యాయస్థానమే! భారత రాజ్యాంగం శాసన, న్యాయ, పరిపాలనా వ్యవస్థలు మూడింటి మధ్య స్పష్టమైన విభజన ఉంది. ఆ లక్ష్మణ రేఖను ఎవరు దాటినా అది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది.