Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీఎస్టీ దెబ్బ నుంచి రాష్ట్రాల ఆదాయాలు పోయి అలమటిస్తుండగా కేంద్రానికి నిర్ణీత ఆదాయం రావడమే కనాకష్టంగా ఉంది. దేశం నోట్ల రద్దు, జీఎస్టీ దెబ్బ నుంచి కోలుకునే లోపే ఆర్థిక వ్యవస్థ మందగించడం మొదలై పోయింది. దానికి కరోనా దెబ్బ అదనం. వరస క్రమం ఇది. దీన్ని దాచిపెట్టి అన్నింటినీ కరోనా కార్పెట్ కిందికి ఊడ్చేద్దామంటే చెల్లదని మోడీ సర్కార్కు తెలియజేయాలి.
''మనం అన్నదమ్ములుగా ఈలోకంలోకి వచ్చాం. ఒకరు ముందు ఒకరు వెనుక నడవద్దు. చెట్టాపట్టా లేసుకునే సాగుదాం!'' ఒకే పోలికలున్న రెండు పాత్రలు ఒకదానితో ఒకటి అనే ఈ మాటలతో షేక్స్పియర్ రాసిన గొప్ప హాస్య నాటిక ''కామెడీ ఆఫ్ ఎర్రర్స్'' ముగుస్తుంది. కానీ ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఒక దుర్ఘటన యొక్క విషాదాంతం గురించి. అదే ట్రాజెడీ ఆఫ్ ఎర్రర్స్!''
సరళీకృత ఆర్థిక విధానమే ఒక విషాదమని ప్రపంచ వ్యాపితంగా ఉన్న వామపక్షాలు, నామ్ చోమ్స్కీ, అమర్త్యసేన్, నోమ్కీ క్లీన్, జీన్డ్రీజ్ వంటి మేధావులు దాదాపు 1980ల నుంచే మాట్లాడు తున్నారు. రాస్తున్నారు. కొత్తగా ఈ ఊబిలోకి దిగుతున్న అభివృద్ధి చెందుతున్న దేశాలను హెచ్చరిస్తున్నారు కూడా! అయినా మన దేశ పాలకులు 1991లో దాన్నే తలకెత్తుకున్నారు. అది విషాదంగా ముగుస్తుందని, మన దేశ ప్రజలకు విషాదాన్నే మిగులుస్తుందని దేశంలోని వామపక్షాలు, కార్మిక సంఘాలు ప్రకటనలిచ్చి పడక్కుర్చీల్లో విశ్రమించలేదు. లక్షలాది, కోట్లాది కష్టజీవుల్ని కదిలించి పోరాడారు. రెండు, ఐదు, పది, పన్నెండు కోట్ల మంది కార్మికులు, దేశంలో అన్ని కార్మిక సంఘాల వెనుకనున్న వారు, ఏ సంఘంలో లేనివారు సైతం దండులా కదిలి 19 దేశ వ్యాపిత సార్వత్రిక సమ్మెలు చేశారు. ప్రస్తుతం పాలకుల విధానమూ 'ఆన్'లోనే ఉంది. ప్రజల ప్రతిఘటనా 'ఆన్'లోనే ఉంది.
ఈ నేపథ్యంలో జరుగుతున్న ''విషాద దుర్ఘటన''లు (ట్రెజెడీ ఆఫ్ ఎర్రర్స్) పరికిస్తే మొన్న జులై 11న రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత్ దాస్ ''ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ ఎకనామిక్స్ కాన్క్లేవ్''లో సుమారు 4000 పదాల ప్రధాన ఉపన్యాసం ఒక ట్రాజెడీ. మోడీ సర్కార్ యొక్క ప్రాధాన్యాలు కోట్లాది భారత ప్రజలకు సంబంధించినవి కావని అర్థమైనప్పుడు ఆ సామాన్యులకు మిగిలేది దుఃఖమేగా! ప్రజల జీవితాలను విపత్కర మయం చేసిన కోవిడ్ వారి జీవనాధారాన్ని దెబ్బతీసిందన్న ఆర్బీఐ గవర్నర్ (ఐఏఎస్) గారు (గత 28ఏండ్లలో మొట్టమొదటి ఆర్థికవేత్త కాని గవర్నర్) దాన్ని ఎలా పరిష్కారం చేయదల్చుకున్నారో ఒక్క మాట కూడా చెప్పలేదు. పైగా ప్రభుత్వరంగ బ్యాంకులు విజయమాల్యా లాంటి వారికి అప్పులిచ్చి కుదేలైతే వాటిని ఆదుకునేందుకు 2019-20 ఆర్థిక సంవత్సరంలో 3.08లక్షల కోట్ల రూపాయలు సదరు బ్యాంకుల్లోకి పంపి వాటికి పారుబకాయిల బాధలేకుండా చేశారనే బోలెడు ప్రవచనా లున్నాయి.
కోవిడ్ వచ్చే సమయానికే దేశ ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించారట! అది ఆర్బీఐ గవర్నర్ ఉవాచ! 2020 మేలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 35శాతం కుంచించుకుపోయింది. పైకి కోవిడ్ సాకు అయినా 2019 డిసెంబర్ నాటికే మన దేశ ఆర్థిక పరిస్థితి జారుడుబండపై ఉంది. ఈ జారుడు బండ 2010 పదకొండంత, కాదు, కాదు 1991 అంత పొడవుంది. తొండముదిరి ఊసరవెల్లి కావడం మొదలైంది 2010-11 నుండైనా 2014 నాటికి శక్తివంతంగా తయారైంది. రైతు ఆత్మహత్యలు తారాస్థాయిలో ఉన్నాయి. నిరుద్యోగం అంగలు పంగలుగా పెరిగింది. ఫ్యాక్టరీల మూసివేతలు, కార్మికుల తీసివేతలు ఎక్కువైనాయి. కాంగ్రెస్పై మొహం మొత్తడానికి, అధికారానికి బీజేపీకి దారులుపరవడానికి ఇవి చాలవా!?
సంవత్సరానికి రెండుకోట్ల ఉద్యోగాలు, రైతులకయ్యే సాగుఖర్చు మీద ఒకటిన్నర రెట్ల కనీస మద్దతు ధర మోడీకి ఓట్లు రాల్చాయి. ''చెట్టా పట్టాలేసుకున్న'' వాస్తవమేమంటే 'కొండనాలుకకి మందేస్తే ఉన్న నాలిక ఊడినట్టు కొత్త ఉద్యోగాలు రాకపోగా లక్షల సంఖ్యలో ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయి. మద్దతు ధర ఒకటిన్నర రెట్లు ఇవ్వడం సాధ్యం కాదని సుప్రీం కోర్టుకే విన్నవించింది కేంద్ర ప్రభుత్వం. విదేశాల్లో ఉన్న నల్లధనం వెనక్కి తెచ్చి ప్రతివారి అకౌంట్లో రూ.15లక్షలు వేస్తామన్నది ఎన్నికల 'జుమ్లా'గా ప్రభుత్వంలో నంబర్ -2 తేల్చేసి నాలుగేండ్లయి పోయింది. ప్రపంచంలో బహుశా ఏ ప్రజాస్వామ్య దేశంలోను ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం సర్క్యులేషన్లో ఉన్న డబ్బులో 86శాతాన్ని రద్దు చేయడం ఎక్కడా చూడం. లక్షల సంఖ్యలో కార్మికుల ఉపాధి పోయింది. వేల సంఖ్యలో చిన్న పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) మూతబడ్డాయి. సరిగ్గా రబీ సీజన్ ముంగిట జరిగిన నోట్ల రద్దు ప్రభావం వ్యవసాయ రంగాన్ని ఘోరంగా దెబ్బతీసింది. వెరసి, ఈ రెండింటి ప్రభావం ట్రాన్స్ పోర్టు, హమాలీ మొదలైన వాటిని ప్రభావితం చేసి సర్వీసు రంగాన్ని కుంటుపరిచింది.
2016 నవంబర్ 8న మోడీ చెప్పిన నాలుగింటిలోను ఏ ఒక్కటీ వాస్తవ రూపం దాల్చలేదు. 2017 మధ్యలో కోలాహలంగా ప్రకటించిన జీఎస్టీ దెబ్బ నుంచి రాష్ట్రాల ఆదాయాలు పోయి అలమటిస్తుండగా కేంద్రానికి నిర్ణీత ఆదాయం రావడమే కనాకష్టంగా ఉంది. దేశం నోట్ల రద్దు, జీఎస్టీ దెబ్బ నుంచి కోలుకునే లోపే ఆర్థిక వ్యవస్థ మందగించడం మొదలై పోయింది. దానికి కరోనా దెబ్బ అదనం. వరస క్రమం ఇది. దీన్ని దాచిపెట్టి అన్నింటినీ కరోనా కార్పెట్ కిందికి ఊడ్చేద్దామంటే చెల్లదని మోడీ సర్కార్కు తెలియజేయాలి.