Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో: కోడలు తమ కళ్ల ముందే ఉరేసుకుని ప్రాణాలు కాపాడాల్సింది పోయి అత్త మామలు కిటికీ లోంచి వీడియో తీశారు. ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్ నగర్కు చెందిన ఆశిష్ కు, బాధితురాలు కోమల్ కు రెండేళ్ల క్రితం పెళ్లి అయింది. బాధితురాలు కోమల్.. డాటియానా గ్రామంలో భర్త ఆశిష్, అత్తమామలతో కలిసి ఉంటోంది. అత్తమామల వేధింపులు భరించలేక మనస్థాపంతో గదిలోకి వెళ్లి ఉరేసుకుంది. అయితే కోడలు మృతికి తమకు సంబంధం లేదని, చెప్పుకునేందుకే నిందితులు ఆమె ఉరి వేసుకుంటున్న సన్నివేశాలను తమ సెల్లో చిత్రీకరించారు. ఈ వీడియో కాస్త బయటికి రావడం, వైరల్ కావడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెళ్లి సమయంలో కోమల్ తల్లిదండ్రులు 5 లక్షలు డబ్బు, ఒక బైక్ని కట్నం కింద ఇచ్చారు. ఆరు నెలలుగా ఆశిష్ అమ్మానాన్నలు అదనపు కట్నం కావాలని, లేదంటే ఇంటి నుంచి వెళ్లిపోవాలని కోమల్ని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారు. భర్త కూడా తల్లిదండ్రులకే వత్తాసు పలికాడు. వారి పోరు తట్టుకోలేని కోమల్ ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ ఊరి పెద్దలు నచ్చజెప్పడంతో ఇటీవల తిరిగి తన అత్తవారింటికి వచ్చింది. అయితే అత్తమామలు మళ్లీ తనని వేధించడం మొదలు పెట్టారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన కోమల్.. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని ఆదివారం ఈ దారుణానికి పాల్పడింది.