Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా సేకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. ముఖ్యమంగా కొన్ని రాష్ట్రాల్లో కొత్తగా నమోదవుతున్న కేసులు ఆందోళనకరంగా ఉన్నాయి. కరోనా కేసులు పెరుగున్న వేళ అందరికి వైద్య సేవలే అందడం కూడా కష్టంగానే మారుతుంది. తాజాగా సరైన సమయంలో వైద్యం అందక ఓ కరోనా పెషేంట్ ఆస్పత్రి గేటు వద్దే వేచిచూసి మరణించాడు. అయితే ఆ సమయంలోనే ఆరోగ్య శాఖ మంత్రి అదే ఆస్పత్రిలో కోవిడ్ పెషేంట్లకు అందుతున్న సౌకర్యాలను తనిఖీ చేస్తుండటం గమనార్హం. జార్ఖండ్లోని రాంచీలో చోటుచేసుకున్న ఈ హృదయవిదారక ఘటన కరోనా పెషేంట్లకు అందుతున్న ఆరోగ్య సేవలు ఏ విధంగా ఉందో తెలియజేస్తుంది. వివరాలు.. కరోనా సోకిన వ్యక్తిని హజరిబాగ్ నుంచి రాంచీకి మెరుగైన చికిత్స కోసం తరలించారు. రాంచీలోలోని ప్రైవేటు ఆస్పత్రులలో బెడ్ దొరక్కపోవడంతో.. అతడి కుటుంబ సభ్యులు చివరకు సర్దార్ హాస్పిటల్కు తీసుకుని వచ్చారు. అక్కడ వైద్యం చేయాల్సిందిగా డాక్టార్లను వేడుకున్నారు. చాలా గంటల పాటు ఆస్పత్రి గేటు వద్దే వేచి చూడాల్సి వచ్చింది. చివరకు లోపలికి తీసుకెళ్లే సమయానికి అతను చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
దీంతో అతని కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొన్ని గంటల నుంచి తాము సాయం కోసం డాక్టర్లను కోరుతూనే ఉన్నామని.. కానీ ఘోరం జరిగేవరకు ఎవరూ స్పందించలేదని ఆరోపించారు. ఇక, ఈ ఘటన జరిగిన సమయంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా అదే ఆస్పత్రిలో కోవిడ్ పెషేంట్లకు అందుతున్న సౌకర్యాలపై సమీక్ష చేపట్టారు. ఇక, కరోనా పెషేంట్ మృతదేహంతో బయటకు వస్తున్న అతని బంధువులు.. ఆస్పత్రి నుంచి మంత్రి కూడా బయటకు రావడం చూశారు. దీంతో వారిలో సహనం నశించిపోయింది. వారు వెంటనే ఆరోగ్య సేవలపై మంత్రిని ప్రశ్నించారు. ‘మంత్రి గారు.. మేము వైద్యుల కోసం అరుస్తూనే ఉన్నాం. కానీ నా తండ్రికి చికిత్స చేయడానికి ఎవరూ ముందుకు రాదు. నా తండ్రి ఆస్పత్రిలో చేర్పించడానికి మేము చాలా సేపు బయటే నిల్చుని ఉన్నాం. కానీ ఏ ఒక్కరు కూడా నా తండ్రిని పట్టించుకోలేదు. చివరకు వైద్యం అందకపోవడంతో నా తండ్రి మరణించాడు’ మృతుడి కూతురు మంత్రిపై కేకలు వేసింది. తన తండ్రిని తిరిగి ఇవ్వగలరా అంటూ బోరున విలపించింది. నాయకులు ఓట్ల కోసం ప్రజల వద్దకు వస్తారని.. అయితే వారికి సమస్యలు వస్తే మాత్రం పట్టించుకోరని మృతుడి కూతురు ఆరోపించారు. పరిస్థితి చాలా దారుణంగా ఉందని.. సరైన వైద్యం అందక ప్రజలు చనిపోతున్నారని అన్నారు.
ఈ ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి స్పందించారు. ప్రతిచోట సమస్యలు ఉన్నాయని.. వాటిని తొలగించడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ప్రతిరోజు కోవిడ్ రోగుల సంఖ్య పెరుగుతోందని.. అందుకు అనుగుణంగా బెడ్స్ సంఖ్యను పెంచుతామని తెలిపారు. కోవిడ్ పెషేంట్లకు 50 శాతం బెడ్స్ కేటాయించాలని తాము ఇప్పటికే ప్రైవేటు ఆస్పత్రులను కోరినట్టు చెప్పారు. లోపాలు ఉన్నాయని.. వాటిని తొలగించడానికి ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు.