Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మహారాష్ట్రలో మరణ మృదంగం మోగుతోంది. ఇప్పటికే కరోనా కాటుకు నిత్యం వందల మంది మరణిస్తున్నారు. దీనికి తోడు ఆస్పత్రుల్లో వరుస ప్రమాదాలు కూడా రోగుల ప్రాణాలు తీస్తున్నాయి. నాసిక్లో ఆక్సీజన్ ట్యాంకర్ లీకై 24 మంది మరణించిన ఘటనను మరవక ముందే.. మరో ఘోరం జరిగింది. పాల్గఢ్ జిల్లాలోని విరార్లో ఓ కరోనా ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 12 మంది రోగులు మరణించారు. మరికొందరికి గాయాలయ్యాయి. వారిని వేరొక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
విరార్ వెస్ట్ ప్రాంతంలో ఉన్న విజయ్ వల్లభ్ ఆస్పత్రిలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. రెండో అంతస్తులో ఉన్న ఐసీయూలో 17 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ఐతే అర్ధరాత్రి దాటిన తర్వాత ఐసీయూలో మంటలు చెలరేగాయి. అందరూ నిద్రలో ఉండడం.. మంటలు వేగంగా వ్యాపించడంతో.. రోగులకు బయటకు వెళ్లేకపోయారు. మంటల్లో చిక్కుకొని కొందరు.. పొగలతో ఊపిరాడక మరికొందరు మరణించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మొత్తం 12 మంది రోగులు మరణించారు. ఘటనపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదం ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. ఐతే ఐసీయూలో మంటలు ఎలా చెలరేగాయనే దానిపై అధికారులు ఆరాతీస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు వచ్చాయా? లేదంటే ఇంకేదైనా కారణముందా? అనే కోణాలో దర్యాప్తు చేస్తున్నారు.