Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశంలో జూన్ 25 ను బ్లాక్ డేగా ప్రకటించాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లాలోని రాఘవపూర్ బచ్చాయిపల్లిలో బీజేపీ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం పెద్దమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో ఇందిరాగాంధీ ప్రతిపక్షాలను ఎలాగైతే అణచివేతకు ప్రయత్నాలు చేసిందో.. ఎలాగైతే ప్రజాస్వామ్యం గొంతునులిమి నియంత పాలన సాగించాలని కోరుకుందో.. నేడు తెలంగాణలో అదే పరిస్థితి ఉందన్నారు. ప్రతిపక్షాల మీద జూన్ 25 ఎలాగ ఉండేదో ఇప్పుడు తెలంగాణలో కూడా అలాగే ఉందని అన్నారు. తెలంగాణలో నేడు నిర్బంధాలు, ఒత్తిళ్లు పోలీసు పాలన తప్ప మరేమీ లేదన్నారు. గ్రామాల్లో ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు తిరగలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ లో ఎమర్జెన్సీ విధించేలా టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప ఎవరు కూడా తిరిగే హక్కు లేకుండా పోయిందన్నారు.